Lays off India : ఏఐ వచ్చింది.. ఔట్సోర్సింగ్ అవసరం లేదంటూ భారతీయుల ఉద్యోగాలు కట్ చేసిన సంస్థ!
Opendoor layoff : భారత ఐటీ రంగానికి ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సెగ తగిలింది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ‘ఓపెన్డోర్’ భారత్లో తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో దాదాపు 250 మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
Opendoor India operations closure : ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న తరుణంలో, ఇది గ్లోబల్ ఔట్సోర్సింగ్ రంగాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందో చూపే ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్డోర్’.. భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల భారత్లో పనిచేస్తున్న దాదాపు 250 మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుంది. తమ వ్యాపార పరివర్తన వ్యూహంలో భాగంగానే ఈ విధులను అమెరికాకు మారుస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.

ఈ మేరకు ఓపెన్డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్.. ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్ను సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా పంచుకుంటూ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించారు. తమ క్లయింట్లు, కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారని, కాబట్టి వారికి సంబంధించిన కార్యాచరణ విధులను కూడా కస్టమర్లకు దగ్గరగా, అమెరికా నుంచే నిర్వహించడం సరైనదని భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత కొన్ని నెలలుగా కొన్ని కీలక బాధ్యతలను భారత్ నుంచి అమెరికాకు మార్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, తాజా నిర్ణయంతో ఈ ప్రక్రియ పూర్తయి భారతదేశంలో కార్యకలాపాలు పూర్తిగా ముగిసిపోతాయని వివరించారు.
ఏఐ రాకతో మారిన సమీకరణాలు..
భారత్లో ఆఫీసును మూసివేయడానికి గల కారణాలను సీఈఓ కాజ్ నెజాటియన్ నోట్లో స్పష్టంగా వివరించారు. గతంలో వివిధ సాఫ్ట్వేర్ సిస్టమ్స్ ద్వారా జరిగే మాన్యువల్ వర్క్ఫ్లోలను నిర్వహించడానికి ఓపెన్డోర్ సంస్థ భారతదేశంలో ఒక భారీ బృందాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే, సాంకేతికతలో వచ్చిన విప్లవాత్మక మార్పులు, ముఖ్యంగా అమెరికాలో సరికొత్త ‘ఏఐ-నేటివ్’ బృందాలను రంగంలోకి దించడం వల్ల గతంలోలాగా విదేశాల (ఆఫ్షోర్) నుంచి పనులు చేయించాల్సిన అవసరం చాలా వరకు తగ్గిపోయింది. విభిన్న సాఫ్ట్వేర్ వ్యవస్థలను ఒకే ప్లాట్ఫారమ్గా అనుసంధానించడం వల్ల తక్కువ మంది ఉద్యోగులతో, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ సహాయంతోనే పనులను మరింత వేగంగా పూర్తి చేయగలుగుతున్నామని కంపెనీ తెలిపింది.
ఉద్యోగుల తప్పు లేదు.. సీఈఓ ప్రశంసలు
అయితే, ఈ లేఆఫ్స్ లేదా ఆఫీస్ మూసివేత నిర్ణయానికి భారత ఉద్యోగుల పనితీరుకు ఎలాంటి సంబంధం లేదని సీఈఓ స్పష్టం చేశారు. మన దేశంలోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, కంపెనీ వృద్ధికి వారు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు.
"భారత్లో ఉన్న మా సహచరులు అద్భుతమైన నిపుణులు. ఎవరైనా కొత్తగా ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తుంటే, వీరికి నేను గట్టిగా రికమండ్ చేస్తున్నాను. ఇతర సంస్థలకు వీరు గొప్ప ఆస్తిగా మారతారు," అని కాజ్ నెజాటియన్ ప్రశంసించారు.
అంతేకాదు, ఈ కష్టసమయంలో బాధిత ఉద్యోగులను ఆదుకోవడానికి కంపెనీ తగిన చర్యలు తీసుకుంటోందని మేనేజ్మెంట్ తెలిపింది. ఉద్యోగం కోల్పోతున్న వారికి సెవెరెన్స్ ప్యాకేజీలు, కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి వీలుగా అవుట్ప్లేస్మెంట్ సేవలు, ఇతర అవసరమైన సహాయ వనరులను అందిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీలోని కొన్ని ముఖ్యమైన పనుల బదిలీ ప్రక్రియను పూర్తి చేయడానికి మాత్రం కొద్దిమంది సిబ్బంది తాత్కాలికంగా మరికొంత కాలం కొనసాగుతారని పేర్కొంది.
భవిష్యత్తు వ్యూహంలో మార్పు లేదు
భారత్లో కార్యకలాపాలు నిలిపివేసినప్పటికీ, ఓపెన్డోర్ మార్కెట్ స్థానం చాలా బలంగా ఉందని సీఈఓ కాజ్ నెజాటియన్ స్పష్టం చేశారు. కంపెనీ మొత్తం వ్యాపార వ్యూహంలో ఎలాంటి మార్పులు లేవని, అమెరికాలోని ఇళ్ల యజమానులకు మరింత మెరుగైన సేవలు అందించడంపైనే తాము దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. మాన్యువల్ ప్రక్రియలను తగ్గించి, ఇళ్ల కొనుగోలు, పునరుద్ధరణ, అమ్మకాల ప్రక్రియ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.
ఏదేమైనప్పటికీ, ఐటీ, సర్వీస్ రంగాలలో భారత్కు ఉన్న 'తక్కువ ఖర్చుతో కూడిన మానవ వనరుల' సానుకూలతను ఏఐ సాంకేతికత ఏ విధంగా సవాలు చేయబోతోందనే దానికి ఈ ఓపెన్డోర్ నిర్ణయం ఒక స్పష్టమైన ఉదాహరణగా నిలుస్తుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియా స్పందన..
“దీని అర్థం.. పొలాండ్లో కూడా మీరు మీ కార్యకలాపాలను తగ్గించేసుకుంటారా?” అని సోషల్ మీడియాలో ఒకరు అడిగిన ప్రశ్నకు.. అవునన్నట్టే సమాధానం ఇచ్చారు సీఈఓ.
“ప్రో-అమెరికా వ్యక్తిగా సడెన్గా మారిపోయారా? లేక ఏఐ వచ్చిందని మనుషులను తీసేస్తున్నారా?” అని మరొకరు ప్రశ్నించారు.
“భారతీయులను ఏఐ రిప్లేస్ చేసేసింది.. మీరు చెప్పేది ఇదే కదా?” అని మరొకరు అన్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


