కర్తవ్య పథ్‌లో 'ఆపరేషన్ సిందూర్' గర్జన.. త్రివిధ దళాల ఐక్యతకు నిదర్శనంగా రిపబ్లిక్ డే శకటాల ప్రదర్శన!

77వ గణతంత్ర వేడుకల్లో 'ఆపరేషన్ సిందూర్' నేపథ్యంతో సాగిన త్రివిధ దళాల శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు సాంప్రదాయ వైద్యం-టెక్నాలజీ మేళవింపును చాటుతూ ఆయుష్ మంత్రిత్వ శాఖ శకటం కూడా కనువిందు చేసింది.

Published on: Jan 26, 2026, 12:27:10 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దిల్లీలోని కర్తవ్య పథ్‌లో భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా పాకిస్థాన్​ మద్దతు ఉన్న ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన భారీ సైనిక చర్య ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంతో రూపొందించిన త్రివిధ దళాల శకటం హైలైట్​గా నిలిచింది. ఇ శకటం దేశ సైనిక పటిమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది.

కర్తవ్య పథ్​లో ఆపరేషన్​ సిందూర్​ శకటం..
కర్తవ్య పథ్​లో ఆపరేషన్​ సిందూర్​ శకటం..

త్రివిధ దళాల సమైక్య శక్తి..

రిపబ్లిక్​ డే పరేడ్​లో భాగంగా భారత సైన్యం, నావికాదళం, వాయుసేనల ఏకీకృత పోరాట పటిమను ప్రతిబింబిస్తూ ‘విక్టరీ త్రూ జాయింట్‌నెస్’ అనే ఇతివృత్తంతో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. యుద్ధ సమయంలో వ్యూహాత్మక ప్రణాళికలు, క్షేత్రస్థాయిలో వాటి అమలు, దళాల మధ్య సమన్వయం ఎలా ఉంటుందో ఈ శకటం కళ్లకు కట్టింది.

ముఖ్యంగా ఆపరేషన్​ సిందూర్​లోని నిర్ణయాత్మక సైనిక పోరాటంలో వాయుసేన జరిపిన ఖచ్చితమైన దాడులు, సముద్ర రంగంలో నౌకాదళం చూపిన తిరుగులేని ఆధిపత్యం, పదాతి దళం శత్రు స్థావరాలను ధ్వంసం చేసిన తీరును ఇందులో అద్భుతంగా ప్రదర్శించారు. భారత రక్షణ దళాలు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మిషన్-ఓరియెంటెడ్ ఫోర్స్‌గా ఎలా రూపాంతరం చెందాయో ఈ ప్రదర్శన చాటిచెప్పింది.

పరేడ్‌లో ప్రదర్శించిన అత్యాధునిక ఆయుధాలు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో కీలక పాత్ర పోషించిన ప్రధాన ఆయుధ సంపత్తిని త్రివిధ దళాల శకటంలో ప్రదర్శించారు.

నౌకాదళం: సముద్ర గర్భంలో భారత నావికాదళం సాధించిన ఆధిపత్యం.

ఆర్టిలరీ: ఎం777 అల్ట్రా లైట్ హోవిట్జర్లు.

గగనతల రక్షణ: ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఎస్-400 క్షిపణి వ్యవస్థ.

డ్రోన్ శక్తి: హారోప్ లోయిటరింగ్ మునిషన్స్.

యుద్ధ విమానాలు: స్కాల్ప్ మిసైళ్లతో కూడిన రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలు.

ఆయుష్ మంత్రిత్వ శాఖ శకటం..

మరోవైపు ఆయుష్ మంత్రిత్వ శాఖ రూపొందించిన శకటం భారత సాంప్రదాయ వైద్య గొప్పతనాన్ని, దానిని ప్రజారోగ్య వ్యవస్థలోకి ఎలా విలీనం చేస్తున్నారో వివరించింది. వందేమాతరం, ఆత్మనిర్భర్ భారత్, ప్రధానమంత్రి పిలుపునిచ్చిన 'పంచ ప్రాణ్' స్ఫూర్తితో ఈ శకటాన్ని తీర్చిదిద్దారు. ఇది భారత నాగరికత వారసత్వంతో పాటు భవిష్యత్తు ఆరోగ్యంపై ఉన్న విజన్‌ను ప్రతిబింబించింది.

కర్తవ్య పథ్‌లో సాగిన ఈ శకటం ముందు భాగంలో ఆయుర్వేద మూలపురుషులు ఆచార్య చరక, రిషి పతంజలి, మహర్షి అగస్త్యుల త్రిమూర్తి శిల్పాలు.. ఔషధ మొక్కల కొండ చుట్టూ కొలువై ఉన్నట్టు చూపించడం అందరినీ ఆకట్టుకుంది.

ఆయుష్‌ రంగంలో ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ ఉపయోగాన్ని ప్రదర్శిస్తూ, సాంప్రదాయ వైద్యానికి ఆధునిక ఆవిష్కరణలు తోడైతే ఆరోగ్యం ఎంత మెరుగ్గా ఉంటుందో చాటిచెప్పింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More