లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం.. 118 మంది ఎంపీల నోటీసు
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించాలని కోరుతూ 118 మంది విపక్ష ఎంపీలు నోటీసు ఇచ్చారు. ఆయన ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని ఆరోపిస్తూ రాజ్యాంగంలోని అధికరణ 94(సి) ప్రకారం ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు.
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల వేళ రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ విపక్షాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు మంగళవారం (ఫిబ్రవరి 9) లోక్సభ సెక్రటరీ జనరల్కు విపక్ష సభ్యులు నోటీసు సమర్పించారు. సుమారు 118 మంది ఎంపీలు ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకాలు చేసినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

ఈ నోటీసు అందిన వెంటనే, దీనిపై తదుపరి చర్యలు తీసుకోవడానికి సంబంధిత నిబంధనలను పరిశీలించాలని స్పీకర్ ఓం బిర్లా సెక్రటరీ జనరల్ను ఆదేశించినట్లు సమాచారం.
విపక్షాల ప్రధాన ఆరోపణలు ఏమిటి?
స్పీకర్ ఓం బిర్లా సభను ఏకపక్షంగా నడుపుతున్నారని, ప్రతిపక్ష నేతలను మాట్లాడనీయకుండా అడ్డుకుంటున్నారని విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 94(సి) నిబంధనల ప్రకారం ఆయనను తొలగించాలని డిమాండ్ చేశాయి.
తమ ఆరోపణలకు బలంగా నాలుగు ప్రధాన అంశాలను విపక్షాలు ఈ నోటీసులో ప్రస్తావించాయి.
- రాహుల్ గాంధీ ప్రసంగానికి అడ్డంకులు: ఫిబ్రవరి 2న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతున్న సమయంలో.. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీని తన ప్రసంగాన్ని పూర్తి చేయనివ్వలేదని విపక్షాలు ఆరోపించాయి. సభలో విపక్ష నేత గొంతు నొక్కడం ఇది మొదటిసారి కాదని వారు పేర్కొన్నారు.
- ఎంపీల సస్పెన్షన్: ఫిబ్రవరి 3న ఎనిమిది మంది విపక్ష ఎంపీలను బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తూ, ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు.
- బిజెపి ఎంపీపై చర్యలు లేకపోవడం: ఫిబ్రవరి 4న అధికార బీజేపీకి చెందిన ఒక ఎంపీ.. ఇద్దరు మాజీ ప్రధాన మంత్రులపై వ్యక్తిగత దాడులు చేస్తూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా స్పీకర్ మందలించలేదని విపక్షాలు గుర్తుచేశాయి. ఎన్నిసార్లు కోరినా ఆ ఎంపీపై చర్యలు తీసుకోకపోవడం స్పీకర్ పక్షపాత వైఖరికి నిదర్శనమని మండిపడ్డాయి.
- స్పీకర్ వ్యాఖ్యలపై అభ్యంతరం: రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఆమోదం పొందిన తర్వాత ఓం బిర్లా స్వయంగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు గౌరవప్రదంగా లేవని విపక్షాలు పేర్కొన్నాయి. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్కు సంరక్షకుడిగా ఉండాల్సిన స్పీకరే.. సభలో ఇలాంటి ఆరోపణలు చేయడం రాజ్యాంగ పదవిని దుర్వినియోగం చేయడమేనని నోటీసులో స్పష్టం చేశారు.
ప్రజా సమస్యలను సభ దృష్టికి తీసుకురాకుండా స్పీకర్ అడ్డుకుంటున్న తీరు తమను ఎంతగానో కలచివేసిందని విపక్ష నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటరీ నిబంధనలు, ప్రజాస్వామ్య విలువలను కాపాడటంలో స్పీకర్ విఫలమయ్యారని వారు నోటీసులో పేర్కొన్నారు. ఈ పరిణామం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

E-Paper












