టీ20 వరల్డ్ కప్‌లో ఆడొద్దని బంగ్లాదేశ్‌ను పాకిస్థానే రెచ్చగొట్టిందా? వరల్డ్ కప్ బాయ్‌కాట్ చేయాలన్న పాక్ మాజీ క్రికెటర్

టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయం వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని మాజీ క్రికెటర్ మదన్ లాల్ ఆరోపించాడు. భారత్‌ను దెబ్బతీయడానికే పాకిస్థాన్ బంగ్లాదేశ్‌ను రెచ్చగొట్టిందని, దీనివల్ల బంగ్లాదేశ్‌కే తీవ్ర నష్టం జరుగుతుందని అతడు హెచ్చరించాడు.

Published on: Jan 23, 2026, 07:58:32 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా, శ్రీలంక వేదికగా ఫిబ్రవరి 7 నుంచి జరగనున్న టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) నుంచి తప్పుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రకటించడం వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉందని టీమిండియా మాజీ పేసర్ మదన్ లాల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 1983 ప్రపంచ కప్ విజేత జట్టులో సభ్యుడైన మదన్ లాల్.. ఇండియా టుడేతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించాడు.

టీ20 వరల్డ్ కప్‌లో ఆడొద్దని బంగ్లాదేశ్‌ను పాకిస్థానే రెచ్చగొట్టిందా? వరల్డ్ కప్ బాయ్‌కాట్ చేయాలన్న పాక్ మాజీ క్రికెటర్ (AFP)
టీ20 వరల్డ్ కప్‌లో ఆడొద్దని బంగ్లాదేశ్‌ను పాకిస్థానే రెచ్చగొట్టిందా? వరల్డ్ కప్ బాయ్‌కాట్ చేయాలన్న పాక్ మాజీ క్రికెటర్ (AFP)

పాకిస్థాన్ రెచ్చగొడుతోంది..

గ్రూప్-సి మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చకపోతే టోర్నీలో పాల్గొనబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) ఛైర్మన్ అమీనుల్ ఇస్లాం గురువారం (జనవరి 22) స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మదన్ లాల్ స్పందిస్తూ.. "ఇది చాలా మూర్ఖపు నిర్ణయం. దీనివల్ల భారత్‌కు పోయేదేమీ లేదు. నష్టపోయేది బంగ్లాదేశే. ఆర్థికంగా కూడా వారికి ఇది పెద్ద దెబ్బ. నాకు తెలిసి పాకిస్థాన్ వాళ్లను రెచ్చగొడుతోంది. కేవలం భారత్‌ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే వాళ్లు ఇలా చేస్తున్నారు" అని మదన్ లాల్ మండిపడ్డాడు.

అదంతా రాజకీయమే..

షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు మ్యాచ్‌లు, ముంబైలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది. ముంబైలో భద్రతపై బంగ్లాదేశ్ లేవనెత్తుతున్న అభ్యంతరాలను మదన్ లాల్ కొట్టిపారేశాడు. "ముంబై ఇండియాలోని అత్యంత సురక్షితమైన ప్రదేశాల్లో ఒకటి. అక్కడ భద్రతకు ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా కేవలం రాజకీయం మాత్రమే. పాకిస్థాన్, బంగ్లాదేశ్ కలిసి భారత్‌ను తగ్గించాలని చూస్తున్నాయి" అని అతడు విమర్శించాడు.

ఐసీసీ నిర్ణయం మారదు..

మరోవైపు ఐసీసీ ఇప్పటికే షెడ్యూల్ మార్చేది లేదని తేల్చి చెప్పింది. ఒకవేళ బంగ్లాదేశ్ రాకపోతే వారి స్థానంలో స్కాట్లాండ్‌ను తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వివాదంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) కూడా బంగ్లాదేశ్ వైపు నిలబడటం గమనార్హం.

వరల్డ్ కప్ బాయ్‌కాట్ చేయండి: రషీద్ లతీఫ్

ఐసీసీ, బీసీబీ మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్.. అక్కడి క్రికెట్ బోర్డుకు ఒక సూచన చేశాడు. టీ20 వరల్డ్ కప్ ను బాయ్‌కాట్ చేయాలని, ప్రస్తుత క్రికెట్ వ్యవస్థను సవాలు చేయడానికి ఇదే మంచి సమయమని అనడం గమనార్హం. గత వారం రోజులుగా పాకిస్థాన్ మీడియాలో కూడా పీసీబీ.. బంగ్లాదేశ్ బోర్డుకు మద్దతు ఇస్తోందని, తుది నిర్ణయం కోసం ఎదురుచూస్తూ జట్టు సన్నాహాలను కూడా నిలిపివేసిందని వార్తలు వస్తున్నాయి.

'కాట్ బిహైండ్ షో' అనే యూట్యూబ్ ఛానెల్‌లో లతీఫ్ మాట్లాడుతూ.. "ఒకవేళ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగకపోతే.. 50 శాతం వరల్డ్ కప్ పోయినట్లే. ఉన్న క్రికెట్ విధానాన్ని సవాలు చేయడానికి ఇది గొప్ప అవకాశం. పాకిస్థాన్ బంగ్లాదేశ్‌కు అండగా నిలవాలి. టీ20 వరల్డ్ కప్ ఆడటానికి నిరాకరించాలి. ఒక స్టాండ్ తీసుకోవడానికి ఇదే సమయం. ఇది చేయడానికి గుండె ధైర్యం కావాలి" అని వ్యాఖ్యానించాడు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More