రైతులకు నిరాశ! దీపావళి కానుక లేనట్టే- పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఇంకెప్పుడు?
దీపావళి వేళ రైతులకు నిరాశ! పీఎం కిసాన్ 21వ విడత నిధులు ఇప్పట్లో విడుదలయ్యే సూచనలు కనిపించడం లేదు. నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు ఈ డబ్బులు బదిలీ అయ్యే అవకాశం ఉంది!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకం 21వ విడత నిధుల కోసం రైతుల నిరీక్షణ కొనసాగుతోంది. వాస్తవానికి దీపావళికి ముందు నిధులు విడుదల అవుతాయని అందరు భావించారు. పండుగ సంబరాలకు తమకు అదనంగా రూ. 2,000 వస్తాయని అన్నదాతలు ఆశించారు. అయితే, ఈ విడత డబ్బులు దీపావళికి విడుదలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. నివేదికల ప్రకారం.. పీఎం కిసాన్ 21వ విడత నిధులు నవంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది!

బిహార్ ఎన్నికలకు ముందు ప్రకటన వచ్చే అవకాశం..
మీడియా కథనాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం నవంబర్ మొదటి వారంలో 21వ విడతను ప్రకటించే అవకాశం ఉంది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఈ ప్రకటన రావచ్చు!
2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 6, 11 తేదీల్లో జరగనుండగా, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న ఉంది.
మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్లో నిధుల విడుదలపై ప్రశ్నలు..
ప్రస్తుతం బిహార్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఈ సమయంలో పీఎం-కిసాన్ నిధులను విడుదల చేయవచ్చా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కోడ్ ఆఫ్ కండక్ట్ సమయంలో కొత్త పథకాలను ప్రకటించకూడదు. కానీ గతంలో ఆమోదించిన పథకాలకు సంబంధించిన చెల్లింపులు కొనసాగించవచ్చు.
కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 21వ విడత విడుదల..
ముఖ్యంగా గమనించదగిన విషయం ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పీఎం కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేసింది! సెప్టెంబర్ 26, 2025న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంజాబ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల రైతులకు ఈ విడత నిధులను విడుదల చేశారు.
ఆ రాష్ట్రాల్లో ఇటీవల సంభవించిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల కారణంగా రైతులకు ముందుగానే ఈ సాయం అందించారు. ఆ తర్వాత, అక్టోబర్ 7న జమ్ముకశ్మీర్ రైతులు కూడా ఈ విడత ప్రయోజనాన్ని అందుకున్నారు.
పీఎం కిసాన్ యోజన అంటే ఏంటి?
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ఫిబ్రవరి 2019లో ప్రారంభించారు.
ఈ పథకం కింద అర్హులైన రైతులకు ఏటా రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తారు.
ఈ మొత్తాన్ని రూ. 2,000 చొప్పున మూడు సమాన విడతలుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా వారి బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
చిన్న, సన్నకారు రైతులను వారి వ్యవసాయ అవసరాలు, జీవనోపాధి కోసం ఆదుకోవడమే ఈ పథకం లక్ష్యం.
ఈ రైతులకు డబ్బులు అందవు: కొత్త నిబంధనలు!
పీఎం కిసాన్ పథకం లబ్ధిదారుల విషయంలో కేంద్రం 2019లో కీలక మార్పులు చేసింది.
భూమి కొనుగోలు నిబంధన: ఫిబ్రవరి 1, 2019ను కటాఫ్ తేదీగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ తేదీ తర్వాత కొత్తగా వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన లేదా పొందిన రైతులకు తరువాత ఐదు సంవత్సరాల పాటు పీఎం కిసాన్ చెల్లింపులు అందవు.
మినహాయింపు: యజమాని మరణానంతరం వారసత్వంగా భూమి లభిస్తే ఈ నిబంధన వర్తించదు.
ఈకేవైసీ, ఆధార్ లింకింగ్ తప్పనిసరి: ఈకేవైసీ పూర్తి చేయని రైతులకు, లేదా బ్యాంక్ ఖాతాలకు ఆధార్ లింక్ చేయని వారికి ఈ విడత నిధులు అందవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అర్హులైన రైతులందరూ తక్షణమే ఈ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


