‘రా.. నన్ను ప్రెగ్నెంట్​ చెయ్​’ అన్న యాడ్​ మీద క్లిక్​ చేశాడు.. రూ. 11లక్షలు కోల్పోయాడు!

'బిడ్డను కనడానికి మగాడు కావాలి' అనే ప్రకటనకు స్పందించి ఓ వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు కోల్పోయాడు! చివరికి పోలీసులను ఆశ్రయించాడు. అసలేం జరిగిందంటే..

Published on: Nov 1, 2025, 06:45:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పుణెలో ఆన్‌లైన్ ప్రకటనకు స్పందించిన ఒక వ్యక్తి ఏకంగా రూ. 11 లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. “నన్ను గర్భవతి చేసేందుకు ఒక మగాడి కోసం వెతుకుతున్నాను” అనే ఆన్‌లైన్ ప్రకటనను చూసిన ఆ వ్యక్తి, అది మోసమని గ్రహించేలోపే భారీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు!

ఆన్​లైన్​ యాాడ్స్​తో మోసాలు.. తస్మాత్​ జాగ్రత్త! (Pixabay/Representative)
ఆన్​లైన్​ యాాడ్స్​తో మోసాలు.. తస్మాత్​ జాగ్రత్త! (Pixabay/Representative)

ఓ జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. ఆ ప్రకటనకు స్పందించిన వెంటనే మోసగాళ్లు ఆ వ్యక్తిని నమ్మించారు. అతడిని ఇనీషియల్​ ఫీజు, మెంబర్​షిప్​ ఫీజు, ప్రైవసీ ఫీజు వంటి వివిధ రకాల పేర్లతో డబ్బులు చెల్లించమని అడిగారు. ఈ చెల్లింపులు చేయకపోతే తమ 'పని' పూర్తి కాదని మోసగాళ్లు చెప్పడంతో, ఆ వ్యక్తి వారి ఉచ్చులో పడిపోయి అనేక ఆన్‌లైన్ బదిలీలు చేశాడు.

మోసం జరిగిన తీరు, పోలీసుల హెచ్చరిక..

పలు దఫాలుగా డబ్బులు బదిలీ చేసిన తర్వాత, ఆ ప్రకటన వెనుక ఉన్న వ్యక్తుల నుంచి సదరు వ్యక్తికి ఎలాంటి సమాచారం అందలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి, ఆ వ్యక్తి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

మరో జాతీయ మీడియా కథనం ప్రకారం.. ఆ వ్యక్తి ఆన్‌లైన్ ప్రకటనకు స్పందించిన తర్వాత, ఒక మహిళ అతనికి ఒక వీడియో పంపి, తనను గర్భవతి చేయమని కోరింది.

మరోవైపు ఈ మోసం వెనుక ఉన్నవారిని గుర్తించడానికి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి అనుమానాస్పద ప్రకటనలకు ఎవరూ స్పందించవద్దని అధికారులు ప్రజలను హెచ్చరించారు.

"పౌరులు అనుమానాస్పద ఆన్‌లైన్ ప్రకటనలు లేదా ఆఫర్‌లకు స్పందించడం మానుకోవాలి! ఎవరైనా వ్యక్తిగత పనుల కోసం పెద్ద మొత్తంలో ఆన్‌లైన్‌లో డబ్బు డిమాండ్ చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి," అని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

గతంలో ఇలాంటి మోసాలే..

ఈ కేసు ఈ సంవత్సరం ప్రారంభంలో బిహార్‌లో వెలుగు చూసిన సైబర్ మోసాన్ని గుర్తు చేస్తోంది. అక్కడ.. పిల్లలు లేని మహిళలకు గర్భం ధరించేలా చేస్తే లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సైబర్ మోసగాళ్లు పురుషులను మోసం చేశారు.

ఈ మేరకు.. బిహార్‌లోని నవాడా జిల్లాలో జనవరిలో జరిగిన పోలీసు దర్యాప్తులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. అమాయక పురుషుల నుంచి డబ్బులు వసూలు చేసే ఒక పెద్ద ముఠాలో వీరు కూడా భాగమై ఉండవచ్చని పోలీసులు అనుమానించారు.

మోసగాళ్లు 'ఆల్ ఇండియా ప్రెగ్నెంట్ జాబ్ సర్వీస్' అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించి పురుషులను ఉచ్చులోకి దించారు. గర్భవతి చేయగలిగితే రూ. 10 లక్షల వరకు, విఫలమైనా కూడా రూ. 50,000 ఇస్తామని ఆశ చూపారు.

ఈ ప్రకటనలకు స్పందించిన వ్యక్తుల నుంచి పాన్, ఆధార్ వంటి గుర్తింపు వివరాలను తీసుకున్నారు. ఆ తర్వాత హోటల్ బుకింగ్‌లు, రిజిస్ట్రేషన్ వంటి పేర్లతో భారీ మొత్తంలో డబ్బులు కట్టించినట్లు పోలీసులు తెలిపారు.

ఇలాంటి నకిలీ ఉద్యోగ ప్రకటనలు లేదా ఆశ చూపించే ఆన్‌లైన్ ఆఫర్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌లో పంచుకోకూడదని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More