...
...
Next Story

ITR Refund Delay : ఐటీఆర్ రీఫండ్ రాలేదా? అలస్యానికి అసలు కారణాలు ఇవే..

Income tax return refund status : ఐటీఆర్ రీఫండ్ ఎందుకు ఆలస్యం అవుతుందో తెలుసా? ఈ-వెరిఫికేషన్ చేయకపోవడం, బ్యాంక్ ఖాతా తప్పులు, ఏఐఎస్ డేటా సరిపోకపోవడం వంటి ముఖ్యమైన కారణాలతో పాటు రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి..

Published on: Aug 13, 2026, 14:02:07 IST
Advertisement

భారతదేశంలో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటీఆర్) దాఖలు చేసిన తర్వాత రీఫండ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ఆదాయపు పన్ను శాఖ చాలా రిటర్నులను వేగంగా ప్రాసెస్ చేసినప్పటికీ, కొంతమందికి మాత్రం రీఫండ్ రావడంలో ఆలస్యం అవుతోంది.

ఐటీఆర్​ రీఫండ్ ఆలస్యానికి కారణాలు..
ఐటీఆర్​ రీఫండ్ ఆలస్యానికి కారణాలు..

ఐటీఆర్​ రీఫండ్స్​ ఆలస్యం అవ్వడానికి.. వెరిఫికేషన్ సమస్యలు, తప్పు వివరాలు లేదా ట్యాక్స్ రికార్డ్స్‌లో వ్యత్యాసాలే కారణం అని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఈ కారణాలను ముందుగా తెలుసుకోవడం ద్వారా పన్ను చెల్లింపుదారులు అనవసరమైన ఆందోళనను తగ్గించుకోవచ్చు. అలాగే సకాలంలో తగిన చర్యలు తీసుకోవచ్చు.

“పన్ను చెల్లింపుదారులు వీలైనంత త్వరగా ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయాలి. బ్యాంక్ ఖాతాను ముందే వ్యాలిడేట్ చేసుకోవాలి. ఏఐఎస్, ఫామ్ 26ఏఎస్ వివరాలతో సరిచూసుకోవాలి,” అని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే తప్పులను తగ్గించుకోవచ్చని, ఐటీఆర్ ప్రాసెసింగ్, రీఫండ్‌లో ఆలస్యాన్ని నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఐటీఆర్ రీఫండ్ ఆలస్యం కావడానికి ముఖ్యమైన కారణాలు..

1. ఈ-వెరిఫికేషన్ పెండింగ్‌లో ఉండటం

రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తి చేయకపోవడం వల్ల రీఫండ్ ఆలస్యం అవుతుంది. వెరిఫికేషన్ పూర్తి కానంత వరకు ఐటీఆర్ పూర్తిగా ఫైల్ అయినట్లు పరిగణించరు! వెరిఫికేషన్ ప్రక్రియ పెండింగ్‌లో ఉంటే రీఫండ్ రావడం అసాధ్యం.

2. ఏఐఎస్, ఫామ్ 26ఏఎస్ లేదా టీడీఎస్ వివరాలలో వ్యత్యాసం

ఐటీఆర్‌లో చూపించిన ఆదాయం, పన్ను వివరాలు.. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (ఏఐఎస్), ఫామ్ 26ఏఎస్, టీడీఎస్ సర్టిఫికేట్‌లలో ఉన్న సమాచారంతో ఖచ్చితంగా సరిపోలాలి. చిన్న తేడాలు ఉన్నా అదనపు తనిఖీలు జరిగి రీఫండ్ ప్రాసెసింగ్ మందగిస్తుంది.

రీఫండ్ నేరుగా రిటర్న్‌లో పేర్కొన్న బ్యాంక్ ఖాతాకు జమ అవుతుంది. ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ లేదా బ్యాంక్ వ్యాలిడేషన్ స్టేటస్ తప్పుగా ఉంటే రీఫండ్ ఆగిపోతుంది. పన్ను చెల్లింపుదారులు తమ బ్యాంక్ ఖాతాను ఐటీ శాఖ పోర్టల్‌లో ముందే వ్యాలిడేట్ చేసుకోవడం తప్పనిసరి.

4. పాన్- ఆధార్ సమస్యలు

పాన్-ఆధార్ అనుసంధానంలో సమస్యలు ఉన్నా లేదా వ్యక్తిగత వివరాలలో తేడాలు ఉన్నా అదనపు వెరిఫికేషన్ అవసరమవుతుంది. ఇది రిటర్న్ ప్రాసెసింగ్‌ను ప్రభావితం చేస్తుంది. రీఫండ్ విడుదల చేయడానికి ముందు ఐటీ శాఖ అదనపు తనిఖీలు కోరవచ్చు.

5. అదనపు పరిశీలన, నిబంధనల తనిఖీ

పెద్ద మొత్తంలో రీఫండ్ క్లెయిమ్స్, భారీ లావాదేవీలు, అసాధారణ తగ్గింపులు ఉన్న రిటర్న్‌లను అదనపు సమీక్షకు ఎంపిక చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో శాఖ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే రీఫండ్‌ను ఆమోదిస్తారు.

6. ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులు

ఆదాయం తప్పుగా నమోదు చేయడం, వడ్డీ ఆదాయాన్ని చూపించడం మర్చిపోవడం లేదా తప్పు ట్యాక్స్ క్రెడిట్‌లను పేర్కొనడం వంటి సాధారణ పొరపాట్లు ప్రాసెసింగ్‌ను ఆలస్యం చేస్తాయి. తప్పులు గుర్తిస్తే రివైజ్డ్ రిటర్న్ ఫైల్ చేయడం మంచిది.

7. సీపీసీ వద్ద విపరీతమైన పనిభారం

సెంట్రల్ పీరియాడికల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) ప్రతి సంవత్సరం కోట్లాది రిటర్నులను నిర్వహిస్తుంది. పీక్ సీజన్‌లో ఎక్కువ సంఖ్యలో రిటర్నులు రావడం వల్ల ప్రాసెసింగ్ సమయం పెరుగుతుంది.

8. బకాయి ఉన్న పన్ను డిమాండ్లు

గత సంవత్సరాలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల వద్ద ఏమైనా బకాయిలు ఉంటే, ఐటీ శాఖ ప్రస్తుత రీఫండ్‌ను ఆ బకాయిల సర్దుబాటు నిమిత్తం మినహాయించుకోవచ్చు. దీనివల్ల రీఫండ్ మొత్తం తగ్గవచ్చు లేదా ఆలస్యం కావచ్చు.

ఐటీఆర్​ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి?

  • ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను సందర్శించండి.
  • మీ పాన్/ఆధార్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వండి.
  • e-File > Income Tax Returns > View Filed Returns ఆప్షన్‌కు వెళ్లండి.
  • అసెస్‌మెంట్ ఇయర్ పక్కన ఉన్న 'View Details' పై క్లిక్ చేయడం ద్వారా రియల్-టైమ్ ప్రాసెసింగ్ మైలురాళ్లను చూడవచ్చు.
  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోని "Refund/Demand Status" సర్వీస్ ద్వారా కూడా స్టేటస్ తెలుసుకోవచ్చు.

రీఫండ్ ఆలస్యం అయినంత మాత్రాన మీ ట్యాక్స్ రిటర్న్‌లో సమస్య ఉందని అర్థం కాదు! పెండింగ్ వెరిఫికేషన్, డేటా మ్యాచింగ్ లేదా సాధారణ నిబంధనల తనిఖీల వల్ల కూడా ఆలస్యం జరగవచ్చు. పన్ను చెల్లింపుదారులు ఎప్పటికప్పుడు రీఫండ్ స్టేటస్‌ను పరిశీలిస్తూ, నోటీసులకు తక్షణమే స్పందించి, వివరాలు సరిగ్గా ఉండేలా చూసుకోవాలి.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe