తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. వన్ స్టేట్-వన్ ట్యాక్స్ విధానం!

పర్యాటక బస్సులకు వర్తించే పన్ను విధానంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. వన్ స్టేట్-వన్ ట్యాక్స్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Published on: Aug 1, 2026, 12:40:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల యజమానులకు ఊరటనిస్తూ, రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేసేందుకు తెలంగాణ రవాణా శాఖ కీలక అడుగులు వేస్తోంది. త్రైమాసిక పన్నులను క్రమబద్ధీకరించడం, పదే పదే పర్మిట్లు తీసుకోవాల్సిన అవసరం లేకుండా టూరిస్ట్ బస్సులు రాష్ట్రమంతటా స్వేచ్ఛగా తిరిగేలా వన్ స్టేట్, వన్ టాక్స్(ఒకే రాష్ట్రం.. ఒకే పన్ను) విధానాన్ని తీసుకొచ్చేందుకు సమగ్ర పరిశీలన జరుపుతోంది. ఈ ప్రతిపాదిత మార్పులపై రవాణా శాఖ కమిషనర్ కె. ఇలంబరితి టూరిస్ట్ బస్సు ఆపరేటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు.

తెలంగాణలో వన్ స్టేట్-వన్ ట్యాక్స్
తెలంగాణలో వన్ స్టేట్-వన్ ట్యాక్స్

ప్రస్తుతం తెలంగాణలో టూరిస్ట్ బస్సులకు మూడు వేర్వేరు త్రైమాసిక పన్ను స్లాబ్‌లు అమల్లో ఉన్నాయి. ఒకే జిల్లా పన్ను సీటుకు త్రైమాసికానికి సుమారు రూ.1,150, రెండు జిల్లాల పన్ను సీటుకు త్రైమాసికానికి సుమారు రూ.1,510, రాష్ట్ర స్థాయి పన్ను సీటుకు త్రైమాసికానికి సుమారు రూ.3,500గా ఉన్నాయి.

ఈ పాత మూడంచెల విధానాన్ని తొలగించి, రాష్ట్రమంతటికీ వర్తించేలా ఒకే రకమైన పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టడం ఈ నూతన విధానం ముఖ్య ఉద్దేశం. పన్ను రహిత ప్రక్రియను సరళీకృతం చేయడమే కాకుండా, బస్సు ఆపరేటర్లపై అదనపు పన్ను భారం పడకుండా చూడటమే రవాణా శాఖ లక్ష్యమని కమిషనర్ తెలిపారు.

ఈ సందర్భంగా కమిషనర్ ఇలంబరితి మాట్లాడుతూ.. "గతంలో జిల్లాలు పెద్దవిగా ఉండటం వల్ల బస్సులు ఒకే జిల్లా పర్మిట్‌పై ఎక్కువగా నడిచేవి. వేరే జిల్లాకు వెళ్లాలంటే 7 రోజుల వ్యవధితో తాత్కాలిక పర్మిట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు జిల్లాలు చిన్నవిగా మారి, సంఖ్య పెరిగింది. దీనివల్ల ఆపరేటర్లు తాత్కాలిక పర్మిట్లను పరిమితికి మించి వాడాల్సి వస్తోంది.' అని వివరించారు.

రాష్ట్రంలో ప్రస్తుతం 8,000 కంటే ఎక్కువ టూరిస్ట్ బస్సులు నడుస్తున్నప్పటికీ, వాటి నుంచి వచ్చే ఆదాయం కేవలం రూ.110 కోట్లు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక అనుసరిస్తున్న పన్ను నమూనాలను తెలంగాణ రవాణా శాఖ నిశితంగా పరిశీలిస్తోంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు 'వన్ స్టేట్, వన్ పర్మిట్' విధానంపై అధ్యయనం చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇతర రాష్ట్రాల్లో తక్కువ పన్నులు ఉండటం వల్ల ఏఐటీపీ కింద నమోదవుతున్న ప్రైవేట్ బస్సుల వల్ల తెలంగాణకు ప్రస్తుతం కేవలం రూ.7 కోట్లు మాత్రమే రాబడి వస్తోంది. ఆంధ్రప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు ఇప్పటికే పన్నులను తగ్గించాయి. తెలంగాణలో ప్రస్తుతం సీటుకు ఉన్న రూ.4,000 పన్నును తగ్గించే అవకాశాలను పరిశీలిస్తున్నారు.

ఆపరేటర్ల నుంచి ఎక్కువ వసూలు చేయడం తమ ఉద్దేశం కాదని, వ్యవస్థను సరళీకృతం చేయడమే తమ ప్రధాన ధ్యేయమని రవాణా శాఖ స్పష్టం చేసింది. అలాగే ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు వద్ద జరిగిన విషాదకర బస్సు ప్రమాదం అనంతరం, ఇతర రాష్ట్రాల రవాణా కమిషనర్లతో ఏఐటీపీ బస్సుల నిఘాపై ప్రత్యేక సమావేశం త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు కమిషనర్ తెలిపారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More