...
...
Next Story

Rinku Singh father : భారత క్రికెటర్​ రింకు సింగ్‌కు పితృవియోగం- క్యాన్సర్‌తో తండ్రి కన్నుమూత

టీమిండియా ఆటగాడు రింకు సింగ్ తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం మరణించారు. స్టేజ్​-4 క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఉన్న రింకు, ఈ వార్త తెలిసిన వెంటనే ఇంటికి బయలుదేరారు.

Published on: Feb 27, 2026, 09:16:58 IST
Advertisement

భారత క్రికెట్ స్టార్ రింకు సింగ్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రాణాంతకమైన స్టేజ్​-4 క్యాన్సర్‌తో గత కొంతకాలంగా పోరాడుతున్న ఆయన తండ్రి ఖాన్‌చంద్ సింగ్ శుక్రవారం కన్నుమూశారు. ఈ విషాద వార్తను భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ, రింకు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

తండ్రితో రింకు సింగ్​.. (Rinku Singh - Instagram)
తండ్రితో రింకు సింగ్​.. (Rinku Singh - Instagram)

“రింకు సింగ్​ తండ్రి శ్రీ ఖాన్​చంద్​ సింగ్​ మరణించారన్న వార్త చాలా బాధ కలిగించింది. టీ20 ప్రపంచ కప్ కోసం కట్టుబడి ఉన్నప్పటికీ,​ రింకుకు, అతని కుటుంబానికి ఇది అత్యంత బాధాకరమైన సమయం. రింకు కుటుంబం కోసం ప్రార్థిస్తున్నాను. అతని తండ్రి ఆత్మకు శాంతి కలగాలని, ఈ గడ్డు కాలంలో రింకు కుటుంబానికి ధైర్యం ఇవ్వాలని వాహేగురును కోరుకుంటున్నాను,” అని హర్భజన్​ సింగ్​ ఎక్స్​లో ట్వీట్​ చేశారు.

చివరి వరకు పోరాడి..

ఖాన్‌చంద్ సింగ్ గ్రేటర్ నోయిడాలోని యథార్థ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఈ వారం ప్రారంభంలో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యులు ఆయన్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.

కుటుంబం వద్దకు రింకు సింగ్​..

తండ్రి మరణవార్త తెలిసిన వెంటనే రింకు సింగ్ తన కుటుంబ సభ్యులకు అండగా ఉండేందుకు ఇంటికి చేరుకున్నట్లు సమాచారం. అయితే, మార్చ్​ 1న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో జరగనున్న కీలకమైన (వర్చువల్ క్వార్టర్ ఫైనల్) మ్యాచ్‌కు ముందే ఆయన తిరిగి జట్టుతో చేరుతారని భావిస్తున్నారు.

ఆదర్శ తండ్రి ఖాన్​చంద్​ సింగ్​..

రింకు సింగ్ ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప క్రికెటర్‌గా ఎదిగారంటే దాని వెనుక ఆయన తండ్రి పడ్డ కష్టం వర్ణనాతీతం! అలీఘఢ్​లో ఎల్పీజీ సిలిండర్లను డెలివరీ చేసే సామాన్య కార్మికుడైన ఖాన్‌చంద్ సింగ్, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రింకు క్రికెట్ ట్రైనింగ్​కి ఎప్పుడూ ఆటంకం కలగకుండా చూసుకున్నారు. తన ఎదుగుదలకు కారణమైన తండ్రిపై ఉన్న ప్రేమతో రింకు గత ఏడాది ఆయనకు రూ. 3.19 లక్షల విలువైన 'కవాసకి నింజా' బైక్‌ను బహుమతిగా ఇచ్చి మురిసిపోయారు.

జింబాబ్వే మ్యాచ్‌లో ఏం జరిగింది?

జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో రింకు తుది జట్టులో లేకపోయినప్పటికీ, సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా మైదానంలో కనిపించారు. తొలుత సూర్యకుమార్ యాదవ్ స్థానంలో, ఆ తర్వాత అభిషేక్ శర్మ గాయానికి చికిత్స తీసుకుంటున్న సమయంలో రింకు ఫీల్డింగ్ చేశారు.

ఈ మ్యాచ్‌లో భారత్ 72 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో భారత్ 256/4 భారీ స్కోరు చేయగా, అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో జింబాబ్వేను 184 పరుగులకే కట్టడి చేశారు.

భారత్ తన తదుపరి కీలక పోరులో ఆదివారం వెస్టిండీస్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe