1,000 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 7 లక్షల కోట్లు ఆవిరి.. 10 కారణాలు ఇవే
అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1,048 పాయింట్లు పతనమవగా, నిఫ్టీ 25,500 దిగువకు చేరింది. ఏఐ (AI) ఆందోళనలు, అమెరికా వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.
వారంతంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావంపై తలెత్తిన ఆందోళనలు ఇన్వెస్టర్లలో భయాందోళనలు రేకెత్తించాయి.
1048 పాయింట్ల పతనం
ఫిబ్రవరి 13, శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,048 పాయింట్లు (1.25%) పతనమై 82,626.76 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ 50 కూడా 336 పాయింట్లు (1.30%) నష్టపోయి 25,471.10 వద్ద ముగిసింది. మధ్య తరహా, చిన్న తరహా షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఇంకా ఎక్కువగా కనిపించింది. బీఎస్ఈ మిడ్క్యాప్ 1.58%, స్మాల్క్యాప్ 1.50% మేర క్షీణించాయి.
ఈ ఒక్క రోజే మదుపర్ల సంపద దాదాపు రూ. 7 లక్షల కోట్లు ఆవిరైపోయింది. బీఎస్ఈలో లిస్టయిన కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ. 472 లక్షల కోట్ల నుంచి రూ. 465 లక్షల కోట్లకు పడిపోయింది.
నేటి స్టాక్ మార్కెట్ పతనానికి సంబంధించి 10 కీలక అంశాలు:
1. మార్కెట్లు ఎందుకు పడిపోయాయి?
ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంపై ఏఐ (AI) ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై నెలకొన్న సందిగ్ధత ఇన్వెస్టర్లను కలవరపెడుతోంది. దీనికి తోడు అమెరికాలో ఉపాధి గణంకాలు బలంగా ఉండటంతో, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను ఇప్పట్లో తగ్గించకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి.
"అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు బలహీనపడ్డాయి. అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల వచ్చిన సానుకూలత క్రమంగా తగ్గుతోంది. ముఖ్యంగా ఏఐ వల్ల తలెత్తే మార్పులు భారత ఐటీ కంపెనీలపై ఒత్తిడి పెంచుతాయనే భయాలు ఇన్వెస్టర్లలో కనిపిస్తున్నాయి," అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ విశ్లేషించారు.
2. టాప్ గెయినర్స్ (లాభపడినవి)
భారీ పతనంలోనూ నిఫ్టీ 50లో కేవలం ఐదు షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. బజాజ్ ఫైనాన్స్ (3.09%), ఐషర్ మోటార్స్ (1.56%), ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ (0.84%), ఎస్బీఐ (0.33%), సిప్లా (0.13%) రాణించాయి.
3. టాప్ లూజర్స్ (నష్టపోయినవి)
హిందాల్కో ఇండస్ట్రీస్ (6.08%), హిందుస్థాన్ యూనీలీవర్ (4.34%), ఎటర్నల్ (4.30%), అదానీ ఎంటర్ప్రైజెస్ (3.83%), ఓఎన్జీసీ (3.20%) భారీగా నష్టపోయాయి.
4. కుప్పకూలిన రంగాలవారీ సూచీలు
అమ్మకాల సునామీతో అన్ని రంగాల సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి. నిఫ్టీ మెటల్ (3.31%), రియల్టీ (2.23%), ఎఫ్ఎంసీజీ (1.90%), ఆయిల్ అండ్ గ్యాస్ (1.88%), ఐటీ (1.44%) రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బ్యాంక్ నిఫ్టీ 0.91% నష్టపోయింది.
5. యాక్టివ్ కౌంటర్లు
వాల్యూమ్ పరంగా వొడాఫోన్ ఐడియా (35.2 కోట్ల షేర్లు), టాటా సిల్వర్ ఈటీఎఫ్, ఇంజనీర్స్ ఇండియా షేర్లు మార్కెట్లో అత్యంత చురుగ్గా ట్రేడ్ అయ్యాయి.
6. మార్కెట్ బ్రెడ్త్
బీఎస్ఈలో ట్రేడింగ్ జరిగిన షేర్లలో 1,300 షేర్లు లాభాల్లో ముగియగా, దాదాపు 2,800 షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంటే ప్రతి ఒక్క షేరు లాభపడితే, రెండు కంటే ఎక్కువ షేర్లు నష్టపోయాయి.
7. 15% పైగా పెరిగిన షేర్లు
మార్కెట్ పతనమైనా జీఈ పవర్ ఇండియా, డీసీ ఇన్ఫోటెక్ వంటి 16 షేర్లు 15 శాతానికి పైగా పెరిగాయి. మరోవైపు స్పైస్జెట్ సహా 6 షేర్లు 15 శాతానికి పైగా పడిపోయాయి.
8. ఏడాది గరిష్టానికి 83 షేర్లు
ఐషర్ మోటార్స్, భారత్ ఫోర్జ్, మాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, అవంతి ఫీడ్స్ వంటి 83 షేర్లు ట్రేడింగ్ మధ్యలో తమ 52 వారాల గరిష్ట స్థాయిని తాకాయి.
9. ఏడాది కనిష్టానికి ఐటీ దిగ్గజాలు
దాదాపు 193 షేర్లు తమ 52 వారాల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఇందులో టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ (Infosys), విప్రో (Wipro), ఐఆర్ఈడీఏ (IREDA) వంటి దిగ్గజ షేర్లు ఉండటం గమనార్హం.
10. నిపుణుల విశ్లేషణ: నిఫ్టీ తదుపరి లక్ష్యం ఎంత?
సాంకేతికపరంగా నిఫ్టీ తన కీలక మద్దతు స్థాయి 25,500 దిగువకు చేరిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ విశ్లేషకుడు రూపక్ దే తెలిపారు. ఇది మరింత బలహీనపడితే స్వల్ప కాలంలో 25,000 స్థాయిని తాకే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. రికవరీ వస్తే 25,800 వద్ద నిరోధం ఎదురుకావచ్చన్నారు.
నిఫ్టీ 25,400 స్థాయిని కూడా కోల్పోతే, అది 25,100 మార్కు వరకు పడిపోయే ప్రమాదం ఉందని రెలిగేర్ బ్రోకింగ్ నిపుణుడు అజిత్ మిశ్రా పేర్కొన్నారు.
(గమనిక: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రిస్క్తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించగలరు.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


