వెండి ధర $100కు చేరనుందా?.. ఆపై భారీ పతనం? ఇన్వెస్టర్లకు నిపుణుల కీలక హెచ్చరిక
అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర సరికొత్త రికార్డుల దిశగా దూసుకెళ్తోంది. త్వరలోనే 100 డాలర్ల మార్కును తాకే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత భారీగా ధరలు పడిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు మీకోసం..
బంగారంతో పోటీ పడుతూ వెండి ధగధగలు మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం వెండి ధరలు ఒక ప్రత్యేకమైన ‘రౌండింగ్ బాటమ్’ (Rounding Bottom) పాటర్న్ను ఏర్పరిచాయి. టెక్నికల్ భాషలో చెప్పాలంటే.. ఇది ధరలు భారీగా పెరగబోతున్నాయనడానికి సంకేతం. ఒకవేళ కీలకమైన రెసిస్టెన్స్ స్థాయిలను దాటితే, వెండి ధర త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు 100 డాలర్ల ($100/oz) మార్కును తాకవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ గరిష్ట స్థాయిని చేరిన తర్వాత మార్కెట్లో తీవ్రమైన ఒడుదొడుకులు (Correction) వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మార్కెట్లో నేటి ట్రెండ్ ఇలా..
శుక్రవారం భారతీయ కమోడిటీ మార్కెట్ (MCX)లో వెండి ధర కాస్త తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు (Profit booking) మొగ్గు చూపడం, అమెరికా సుంకాల (Tariffs)పై ఆందోళనలు కాస్త తగ్గడంతో ధరల్లో ఈ మార్పు కనిపించింది. ఎంసీఎక్స్లో వెండి కేజీకి రూ. 1,139 (0.39%) తగ్గి, రూ. 2,90,438 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతకుముందు గురువారం ఇది రూ. 2,92,960 వద్ద ఆల్టైమ్ రికార్డును సృష్టించింది. అంతర్జాతీయంగా వెండి ధర 90.70 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
ధరల పెరుగుదలకు కారణాలేంటి?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధానాలపై నెలకొన్న సందిగ్ధత విలువైన లోహాల ధరలకు మద్దతునిస్తోంది. దీనికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం వెండి వైపు ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. "ఒకవేళ అమెరికా సుంకాలు విధిస్తే, అది వినియోగదారుల ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది వెండికి మరింత బలాన్నిస్తుంది" అని కేడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కేడియా పేర్కొన్నారు.
మరోవైపు సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు (EV), ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వెండి వినియోగం ఎక్కువగా ఉండటం వల్ల డిమాండ్ నిలకడగా ఉంది.
ఇన్వెస్టర్లు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
ధరలు పెరగడం ఒక ఎత్తయితే, దానివల్ల తలెత్తే పరిణామాలు వెండి మార్కెట్కు ముప్పుగా మారవచ్చు.
ప్రత్యామ్నాయాల వెతుకులాట: వెండి ధరలు విపరీతంగా పెరగడంతో సోలార్ ప్యానెల్ తయారీదారులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ప్యానెల్ తయారీ ఖర్చులో వెండి వాటా 3.4% మాత్రమే ఉండగా, ఇప్పుడు అది 29%కి చేరింది. దీంతో చైనాకు చెందిన లాంగీ (Longi) వంటి పెద్ద కంపెనీలు వెండికి బదులుగా చౌకగా లభించే రాగి (Copper) వంటి లోహాలను వాడాలని చూస్తున్నాయి. ఇది దీర్ఘకాలంలో వెండి డిమాండ్ను తగ్గించవచ్చు.
ఇండెక్స్ రీబ్యాలెన్సింగ్: బ్లూమ్బర్గ్ కమోడిటీ ఇండెక్స్ (BCOM)లో జరుగుతున్న మార్పుల వల్ల వెండిపై భారీగా అమ్మకాల ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. దాదాపు 7.1 బిలియన్ డాలర్ల విలువైన వెండి ఫ్యూచర్ల విక్రయాలు జరగవచ్చని అంచనా.
కియోసాకి హెచ్చరిక: ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు. వెండి ధరలు గరిష్టానికి చేరుకున్నాయని, మార్కెట్లో భారీ దిద్దుబాటు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అయితే, వెండిపై తనకు నమ్మకం ఉందని, ధరలు పడినా తాను కొనుగోలు చేస్తూనే ఉంటానని ఆయన తెలిపారు.
(సూచన: ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్ లేదా కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం మంచిది.)
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper












