...
...
Next Story

Southwest Monsoon : హమ్మయ్య! ఎట్టకేలకు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..

Southwest Monsoon Kerala : ఎండలకు అల్లాడిపోయిన భారతీయులకు తీపి కబురు! నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయి. పూర్తి వివరాలు ఇలా..

Published on: Jun 4, 2026, 11:55:19 IST
Advertisement

వేసవితో ఇన్ని నెలలు ఎండలతో అల్లాడిపోయిన దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది! నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి. గురువారం నాడు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అయితే, సాధారణంగా వచ్చే తేదీతో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక మూడు రోజులు ఆలస్యమైంది.

కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..

అంతేకాదు, ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే కూడా ఈ ప్రక్రియ కొద్దిగా నెమ్మదించింది. గత మే 15న ఐఎండీ ఇచ్చిన ముందస్తు అంచనా ప్రకారం.. మే 26 నాటికే (నాలుగు రోజులు అటు ఇటుగా) రుతుపవనాలు కేరళకు వస్తాయని భావించారు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఈ ఆలస్యం తప్పలేదు. కేరళ తీరాన్ని తాకిన తర్వాత రుతుపవనాలు క్రమంగా ఉత్తర దిశగా విస్తరిస్తాయి. జులై మధ్య నాటికి దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు ఇవి విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఆలస్యానికి గల కారణాలు ఏంటి?

రుతుపవనాల రాక ఆలస్యం కావడానికి వాతావరణ నిపుణులు కొన్ని బలమైన కారణాలను విశ్లేషించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక టైఫూన్ (తీవ్ర తుపాను) కారణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని తేమను అది తనవైపు లాగేసుకుంది. దీనికి తోడు లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా రుతుపవనాల కదలికలను నెమ్మదింపజేసింది. ఈ రెండు కారణాల వల్ల రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి అవసరమైన బలాన్ని తొలిదశలో అందుకోలేకపోయాయి.

ఆంధ్ర, తెలంగాణలోకి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఇక్కడ క్లిక్​ చేసి తెలుసుకోండి..

భారీ వర్షాల హెచ్చరిక..

భారతదేశ నైరుతి తీరంలో కేరళ భౌగోళికంగా ఉన్న స్థానమే దీనికి ప్రధాన కారణం! హిందూ మహాసముద్రంపై పుట్టే తేమతో కూడిన గాలులు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, అరేబియా సముద్రం మీదుగా దేశం వైపు దూసుకొస్తాయి. ఈ క్రమంలో భారత ప్రధాన భూభాగంలో వీటికి మొదట ఎదురయ్యే ప్రాంతం కేరళ తీరమే.

ఈ గాలులు కేరళ తీరానికి చేరుకోగానే, అక్కడ తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు (వెస్ట్రన్ ఘాట్స్) ఒక పెద్ద గోడలా అడ్డుపడతాయి. ఈ పర్వత శ్రేణులు రుతుపవన గాలులను పైకి లేచేలా బలవంతం చేస్తాయి. గాలులు పైకి లేచే కొద్దీ అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గి, గాలి చల్లబడుతుంది. దీనినే శాస్త్రీయంగా ‘అడియాబాటిక్ కూలింగ్’ అంటారు. ఈ ప్రక్రియ వల్ల గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి దట్టమైన మేఘాలుగా మారుతుంది. ఫలితంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి.

భారతదేశానికి రుతుపవనాలు ఎందుకు అంత ముఖ్యం?

భారతదేశంలో ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 80 శాతం వాటా ఈ నైరుతి రుతుపవనాలదే. దేశంలోని మెజారిటీ వ్యవసాయ భూములకు నేటికీ ఎటువంటి సాగునీటి వసతి లేదు. ఆ భూములన్నీ కేవలం వర్షం పైనే ఆధారపడి ఉన్నాయి.

రుతుపవనాలు సకాలంలో వచ్చి, తగినంత వర్షం పడితేనే దేశంలో ఖరీఫ్ (వేసవి) సీజన్ సాగు సజావుగా సాగుతుంది. వరి, పప్పుధాన్యాలు, చెరకు వంటి కీలకమైన పంటల సాగుకు ఈ నీరే కీలకం. పంటలు బాగా పండితే దేశంలో ఆహార భద్రత ఏర్పడటమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని కోట్ల మంది రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది.

వ్యవసాయానికే కాకుండా, దేశంలోని ప్రధాన జలాశయాలు (డ్యాములు), ప్రాజెక్టులు నిండాలన్నా ఈ వర్షాలు పడాల్సిందే. ఈ నీటిని వేసవిలో తాగునీటి అవసరాలకు, అలాగే జలవిద్యుత్ (హైడ్రోఎలక్ట్రిక్ పవర్) ఉత్పత్తికి ఉపయోగిస్తారు. పంటల దిగుబడి బాగున్నప్పుడు మార్కెట్​లో ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉంటాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ము ముందుకు సాగుతుంది. అందుకే, నైరుతి రుతుపవనాలను భారత దేశ భాగ్యరేఖగా పరిగణిస్తారు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe