Southwest monsoon : జూన్​ 1 కూడా మిస్- రుతుపవనాలు కేరళను తాకడం.. ఇప్పట్లో కష్టమే! కానీ..

Southwest monsoon Kerala : భారతీయులను నైరుతి రుతుపవనాలు ఊరిస్తున్నాయి. ఇవి కేరళకు అతి సమీపంలో ఉన్నప్పటికీ, ఇంకా దేశంలోకి రావట్లేదు. అంతే కాదు జూన్ 1న కూడా కేరళను తాకడం కష్టంగా కనిపిస్తోంది. 3,4 రోజులు ఆలస్యంగా రుతుపవనాలు కేరళను తాకొచ్చు. కానీ ఈలోపలే దేశవ్యాప్తంగా భారీ వర్ష సూచను ఇచ్చిండి ఐఎండీ.

Published on: Jun 1, 2026, 09:18:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Southwest monsoon updates : గత 3 నెలలుగా భారీ ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న భారత ప్రజలు చూపు ఇప్పుడు నైరుతి రుతుపవనాలపైనే ఉంది. రుతుపవనాలు కేరళను తాకి, దేశవ్యాప్తంగా విస్తరించి, వర్షాలు కురిస్తే, ఊపిరిపీల్చుకోవచ్చని ఎదురుచూస్తున్నారు. కానీ నైరుతి రుతుపవనాలు మాత్రం భారతీయులను ఊరిస్తున్నాయి! వాస్తవానికి మే 26నే మాన్​సూన్ కేరళను తాకుతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇక ఇప్పుడు, అత్యంత కీలకమైన ‘జూన్ 1’ కూడా మిస్​ డేట్ అవ్వనుంది.

చెన్నై బీచ్​ దగ్గర ఆహ్లాదంగా ప్రజలు..
చెన్నై బీచ్​ దగ్గర ఆహ్లాదంగా ప్రజలు..

సాధారణంగా.. రుతుపవనాలు కేరళను తాకే తేదీని జూన్ 1గా పరిగణిస్తుంటారు. ఈసారి కూడా ఇదే జరుగుతుందని భావించారు. అయితే, రుతుపవనాలు కేరళకు అతి సమీపంలో ఉన్నప్పటికీ, అవి సోమవారం దేశంలోకి రావని ఐఎండీ తేల్చేసింది. జూన్ 3 లేదా 4వ తేదీన మాన్​సూన్ ఎంట్రీ ఇవ్వొచ్చని అంచనా వేసింది.

అయితే రుతుపవనాలు ఇంకా రాకపోయినప్పటికీ, వివిధ వాతావరణ మార్పుల కారణంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు, వడగండ్ల వానలు మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా హీట్‌వేవ్ లేదా వడగాల్పుల తీవ్రత తగ్గుతోందని, ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తున్నాయని ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాలకు జారీ చేసిన వాతావరణ హెచ్చరికల పూర్తి బ్రేక్‌డౌన్ ఇక్కడ చూడండి..

దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

దక్షిణ ద్వీపకల్పం, ఈశాన్య భారత ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ భారతదేశం: కేరళ, లక్ష్వద్వీప్, తమిళనాడు, సౌత్ ఇంటీరియర్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది.

ఈశాన్య రాష్ట్రాలు: నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేశారు.

వడగండ్ల వానలు - తీవ్రమైన ఈదురు గాలులు..

పశ్చిమ, మధ్య భారత దేశంలో వాతావరణం ఒక్కసారిగా పల్టీ కొట్టనుంది.

మహారాష్ట్ర, గుజరాత్: గుజరాత్​లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా.. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వాన పడే సూచనలు ఉన్నాయి.

మధ్యప్రదేశ్: పశ్చిమ మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలతో పాటు వడగండ్లు పడే అవకాశం ఉంది.

ఒడిశా, రాజస్థాన్: ఒడిశాలో గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో (గరిష్టంగా 80 కిమీ వేగంతో) బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి. ఇక్కడ పిడుగులు, వడగండ్ల వాన ముప్పు ఉంది. తూర్పు రాజస్థాన్‌లో కూడా గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన తుఫాను వాతావరణం ఉంటుంది.

దిల్లీ వాతావరణం, ఉష్ణోగ్రతల మార్పు..

జూన్ మొదటి వారంలో దేశ రాజధాని దిల్లీలో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే తక్కువగా 37 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే కనీస ఉష్ణోగ్రత 24 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరపడవచ్చు.

రాబోయే రోజుల్లో మార్పులు: మధ్య భారత దేశంలో ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గుముఖం పట్టనున్నాయి. అయితే, వారం చివర్లో వాయువ్య భారత ప్రాంతాలలో మళ్లీ 6 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది.

మత్స్యకారులకు కఠిన హెచ్చరికలు..

రతుపవనాలు ఎంట్రీ ఇచ్చే సమయంలో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున.. అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని లోతైన సముద్ర ప్రాంతాల్లోకి వేటకు వెళ్లవద్దని మత్స్యకారులను వాతావరణ శాఖ కఠినంగా ఆదేశించింది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More