Stock market holiday : ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు అలర్ట్- ఈ రోజు స్టాక్ మార్కెట్ హాలీడే..
Stock market holiday today : మహావీర్ జయంతి పురస్కరించుకుని ఈరోజు (మార్చి 31, మంగళవారం) భారత స్టాక్ మార్కెట్ పని చేయదు. ఈ వారంలోనే గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం కూడా సెలవు ఉండటంతో ఇన్వెస్టర్లకు లాంగ్ వీకెండ్ రానుంది. కాగా, సోమవారం సెషన్లో మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి. వివరాల్లోకి వెళితే..
భారతీయ స్టాక్ మార్కెట్ ట్రేడర్లు, ఇన్వెస్టర్లకు ముఖ్య గమనిక. మహావీర్ జయంతి సందర్భంగా ఈరోజు, మార్చి 31 మంగళవారం నాడు దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు.

అంతేకాదు, ఈ వారం మరొక రోజు కూడా స్టాక్ మార్కెట్ సెలవులో ఉంటుంది.
కమోడిటీ మార్కెట్ పరిస్థితి..
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో ట్రేడింగ్ మంగళవారం ఉదయం సెషన్లో మూసివేసి ఉంటుంది. అయితే, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు యథావిధిగా ట్రేడింగ్ కొనసాగుతుంది.
ఈ వారం స్టాక్ మార్కెట్ సెలవులు..
ఈ వారం మార్కెట్కు రెండు సెలవులు ఉన్నాయి. మంగళవారం మహావీర్ జయంతి కాగా, ఏప్రిల్ 3 శుక్రవారం నాడు 'గుడ్ ఫ్రైడే' సందర్భంగా మార్కెట్ మూసివేసి ఉంటుంది. దీనివల్ల ఇన్వెస్టర్లకు వరుసగా మూడు రోజులు (శుక్ర, శని, ఆది) సెలవులు లభిస్తాయి. ఏప్రిల్ 3న అమెరికా సహా పలు అంతర్జాతీయ మార్కెట్లు కూడా పనిచేయవు.
2026లో మరికొన్ని ప్రధాన సెలవులు..
ఏప్రిల్ 14: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి.
మే: మే 1 (మహారాష్ట్ర డే),
మే 28 (ఈద్-అల్-అదా).
జూన్: జూన్ 26 (మొహర్రం).
సెప్టెంబర్: సెప్టెంబర్ 14 (గణేష్ చతుర్థి).
జూలై, ఆగస్టు నెలల్లో ఎటువంటి ట్రేడింగ్ సెలవులు లేవు. అక్టోబర్, నవంబర్లలో రెండేసి సెలవులు ఉండగా, డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా చివరి సెలవు ఉంటుంది.
| నెంబర్ | తేదీ | రోజు | సెలవు |
|---|---|---|---|
| 1 | మార్చ్ 31 | మంగళవారం | మహావీర్ జయంతి |
| 2 | ఏప్రిల్ 3 | శుక్రవారం | గుడ్ ఫ్రైడే |
| 3 | ఏప్రిల్ 14 | మంగళవారం | బీఆర్ అంబేడ్కర్ జయంతి |
| 4 | మే 1 | శుక్రవారం | మహారాష్ట్ర డే |
| 5 | మే 28 | గురువారం | బక్రీద్ |
| 6 | జూన్ 26 | శుక్రవారం | మొహర్రం |
| 7 | సెప్టెంబర్ 14 | సోమవారం | వినాయక చవితి |
| 8 | అక్టోబర్ 2 | శుక్రవారం | మహాత్మా గాంధీ జయంతి |
| 9 | అక్టోబర్ 20 | మంగళవారం | దసరా |
| 10 | నవంబర్ 10 | మంగళవారం | దీపావళి |
| 11 | నవంబర్ 24 | మంగళవారం | గురు నానక్ జయంతి |
| 12 | డిసెంబర్ 25 | శుక్రవారం | క్రిస్మస్ |
సోమవారం కుప్పకూలిన స్టాక్ మార్కెట్..
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా భారత స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను మూటగట్టుకుంది. సోమవారం, మార్చి 30న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికి పైగా పడిపోయాయి.
సెన్సెక్స్: 1,636 పాయింట్లు (2.22%) క్షీణించి 71,947.55 వద్ద ముగిసింది.
నిఫ్టీ 50: 488 పాయింట్లు (2.14%) తగ్గి 22,331.40 వద్ద స్థిరపడింది.
మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్: బీఎస్ఈ మిడ్ క్యాప్ 2.51%, స్మాల్ క్యాప్ 2.57% చొప్పున భారీగా నష్టపోయాయి. గత రెండు సెషన్లలో సెన్సెక్స్ ఏకంగా 3,326 పాయింట్లు (4.42%) కోల్పోవడం గమనార్హం.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 11,163.06 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 14,894.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
మార్కెట్ల పతనానికి కారణమేంటి?
మధ్యప్రాచ్యంలో ఐదో వారానికి చేరుకున్న ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీనిపై ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి ఆర్ స్పందిస్తూ.. "ఇరాన్ దాడులు విస్తరించడం, హౌతీ రెబల్స్ ఈ వివాదంలోకి ప్రవేశించడం, అమెరికా సైనిక మోహరింపు వంటి పరిణామాలు యుద్ధ భయాలను పెంచాయి. దీనివల్ల ఇంధన ధరలు తగ్గే అవకాశం లేకపోవడంతో ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడక విక్రయాలకు మొగ్గు చూపారు," అని వివరించారు.
తరచూ అడిగే ప్రశ్నలు-
1. ఈ వారంలో మార్కెట్ ఎన్ని రోజులు పనిచేస్తుంది? ట్రేడింగ్ సమయాల్లో ఏమైనా మార్పు ఉందా?
ఈ వారం (మార్చి 30 - ఏప్రిల్ 3) భారత స్టాక్ మార్కెట్ కేవలం మూడు రోజులు మాత్రమే పనిచేస్తుంది. మార్చి 31 (మంగళవారం) మహావీర్ జయంతి సందర్భంగా, ఏప్రిల్ 3 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే సందర్భంగా బీఎస్ఈ (BSE), ఎన్ఎస్ఈ (NSE) లలో ట్రేడింగ్ జరగదు. మిగిలిన రోజుల్లో (సోమ, బుధ, గురు) ట్రేడింగ్ సమయాల్లో ఎటువంటి మార్పు లేదు, యథావిధిగా ఉదయం 9:15 నుంచి సాయంత్రం 3:30 వరకు కొనసాగుతుంది.
2. సోమవారం మార్కెట్ అంత భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలేమిటి?
ప్రధానంగా మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు మార్కెట్ల పతనానికి కారణమయ్యాయి. ఇరాన్ దాడులు విస్తరించడం, అమెరికా తన బలగాలను మోహరించడం వంటి వార్తలతో ఇన్వెస్టర్లలో ఆందోళన పెరిగింది. దీనివల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ఇన్వెస్టర్లు తమ షేర్లను విక్రయించి నగదును సురక్షితం చేసుకునేందుకు మొగ్గు చూపారు. దీని ప్రభావం వల్ల సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


