Stock market crash : స్టాక్ మార్కెట్లు ఢమాల్- ఇన్వెస్టర్లకు రూ. 12లక్షల కోట్ల నష్టం..
Stock market crash : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్ని నష్టాల్లో ప్రారంభించాయి. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలే ఇందుకు కారణం.
పశ్చిమాశియాలో ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చూస్తున్నాయి. ఈ తరుణంలోనే దేశీయ స్టాక్ మార్కెట్లు సైతం బుధవారం ట్రేడింగ్ సెషన్ని భారీ నష్టాలతో ప్రారంభించాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ 1694 పాయింట్లు పడి 78.545 వద్ద ప్రారంభమైంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ50 477 పాయింట్లు కోల్పోయి 24,389 వద్ద ట్రేడింగ్ సెషన్ని మొదలుపెట్టింది.
ఒకానొక సందర్భంలో సెన్సెక్స్ 1,750 పాయింట్లు కోల్పోయి 78,481 వద్ద ఇంట్రాడే- లోని నమోదు చేసింది. నిఫ్టీ50 ఏకంగా 500 పాయింట్లు డౌన్ అయ్యి 24,335కి కూడా చేరింది.
సెన్సెక్స్30లో 4 ఐటీ స్టాక్స్లు (ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్సీఎల్టెక్, టెక్ఎం) మినహా అన్ని నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎల్ అండ్ టీ 6శాతం నష్టపోగా, టాటా స్టీల్ దాదాపు 4శాతం డౌన్లో ఉంది.
మొత్తం మీద బుధవారం ట్రేడింగ్ సెషన్లో కనిపిస్తున్న రక్తపాతం కారణంగా మదుపర్లు ఏకంగా రూ. 12లక్షల కోట్లను పోగొట్టుకున్నారు. బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.457 లక్షల కోట్ల నుంచి రూ. 445 లక్షల కోట్లకు పడిపోయింది.
స్టాక్ మార్కెట్ క్రాష్- పతనానికి కారణాలు ఏంటి?
పశ్చిమాసియాలో అనిశ్చితి:- అమెరికా- ఇజ్రాయెల్ దేశాలు శనివారం ఇరాన్పై దాడి చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అల్ ఖమేనీ మృతిచెందారు. ఇరాన్ ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఈ పరిణామాలతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఉల్లికిపడ్డాయి. ఈ కారణాల వల్ల సోమవారం ట్రేడింగ్ సెషన్లో ప్రపంచ స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ సూచీలు భారీగా నష్టపోయాయి.
ముడి చమురు- హోలీ సందర్భంగా మంగళవారం స్టాక్ మార్కెట్లకు సెలవు లభించింది. అయితే, ముడి చమురు సరఫరాకు జీవనాధారంగా భావించే హర్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్టు ఇరాన్ చేసిన ప్రకటనలు మంగళవారం తీవ్ర కలకలం సృష్టించాయి. అమెరికా స్టాక్ మార్కెట్లతో పాటు ప్రపంచ దేశాలు సూచీలు భారీ నష్టాలను చూశాయి.
ఈ పరిణామాల మధ్య బుధవారం ట్రేడింగ్ సెషన్ని సెన్సెక్స్, నిఫ్టీలు అతి భారీ నష్టాలతో ప్రారంభించాయి.
ముడి చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే దేశాల్లో ఇండియా ఒకటి. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది. ఇది స్టాక్ మార్కెట్లకు మంచిది కాదు!
ఆర్థిక నిపుణుల ప్రకారం భారత దేశంలో వాడుతున్న చమురులో 90శాతం దిగుమతులదే వాటా. బ్యారెల్ మీద ఒక్క డాలరు పెరిగినా దేశానికి రూ. 16వేల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది!
“తాజా పరిణామాల మధ్య భారత్కి ఉన్న ప్రధాన సమస్య.. ముడి చమురు ధర పెరుగుదల, ద్రవ్యోల్బణం, ఆర్థిక వ్యవస్థపై వీటి ప్రభావం. మార్కెట్ పరంగా చూసుకుంటే వాణిజ్య లోటు పెరిగిపోతుంది. జీడీపీ తగ్గే అవకాశం ఉంది. ఇదే ఇన్వెస్టర్లకున్న భయం. ఇంకో 3, 4 వారాల్లో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటే సూచీలు కూడా పెరుగుతాయి,” అని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్కి చెందిన విజయ్కుమార్ తెలిపారు.
ఇక్కడ అన్నింటి కన్నా ఆందోళనకర విషయం ఏంటంటే.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయి? అన్న ప్రశ్నకు సమాధానం లేకపోవడం! ఈ అనిశ్చితి సైతం మార్కెట్లకు వేధిస్తోంది.
రూపాయి పతనం- అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి మారకం విలువ జీవితకాల గరిష్ఠానికి పడిపోయింది. ప్రస్తుతం డాలరుతో పోల్చితే రూపాయి విలువ 92.15 వద్ద ఉంది. రూపాయి పతనం సైతం స్టాక్ మార్కెట్లకు మంచిది కాదు. రూపాయి పడిపోతూ ఉంటే, ఎఫ్ఐఐల (ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు) అమ్మకాలు పెరుగుతాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


