చక్కెర ధర పెరిగింది.. కంపెనీలకు తీపి కబురు.. 6 శాతం పెరిగిన షుగర్ స్టాక్స్
రాబోయే పండుగల సీజన్ను దృష్టిలో ఉంచుకుని పంచదార నిల్వలపై ప్రభుత్వం కఠిన పరిమితులు విధించడంతో చక్కెర కంపెనీల షేర్లు విపరీతంగా పెరిగాయి. మార్కెట్లో చక్కెర హోల్ సేల్ ధరలు రికార్డు స్థాయికి చేరడం, రాబోయే రోజుల్లో సరఫరా కొరత ఏర్పడే అవకాశాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.
పండుగల సీజన్ దగ్గరపడుతున్న వేళ దేశీయంగా పంచదార ధరలు రికార్డు స్థాయికి చేరుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచదార వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై కఠిన పరిమితులను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే ఆగస్టు 20న స్టాక్ మార్కెట్లో చక్కెర కంపెనీల షేర్లు భారీగా పుంజుకున్నాయి. ద్వారికేష్ షుగర్ ఇండస్ట్రీస్ షేరు అత్యధికంగా 6.3 శాతం లాభపడగా, ధాంపూర్ షుగర్ 6 శాతం, బజాజ్ హిందుస్థాన్ 5.3 శాతం, శ్రీ రేణుకా షుగర్స్ 4 శాతం, బలరాంపూర్ చిని మిల్స్ 3 శాతం వరకు లాభాలతో రాణించాయి.

ప్రభుత్వం సవరించిన నూతన నిబంధనల ప్రకారం, నెలకు 10 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ పంచదారను కొనుగోలు చేసే డీలర్లు తమ వద్ద గరిష్టంగా 15 రోజులకు సరిపడా సరుకును మాత్రమే నిల్వ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఈ కొత్త పరిమితులు సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు అమలులో ఉంటాయి. ఈ సమయంలో ప్రతినెలా జరిగే చక్కెర విక్రయాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలించనుంది.
విపరీతంగా పెరిగిన హోల్సేల్, రిటైల్ ధరలు
ప్రస్తుతం దేశీయ హోల్సేల్ మార్కెట్లో పంచదార ధరలు ఆందోళనకర రీతిలో పెరిగాయి. కాన్పూర్, కోల్కతా వంటి ప్రధాన మార్కెట్లలో క్వింటాల్ పంచదార ధర రూ. 6,000 మార్కును దాటిపోయింది. ముజఫర్పూర్, కొల్హాపూర్ ప్రాంతాల్లో క్వింటాల్ సగటు ధర రూ. 5,000 కంటే ఎక్కువగా నమోదైంది. గత ఏడాది క్వింటాల్ ఎక్స్-మిల్ సగటు ధర రూ. 3,900గా ఉండగా, ప్రస్తుతం అది రూ. 5,400 నుంచి రూ. 5,500 వరకు చేరింది. ఇక రిటైల్ మార్కెట్లోనూ ధరల మంట కొనసాగుతోంది. ఆగస్టు 18 నాటికి కిలో పంచదార రిటైల్ ధర గతేడాదితో పోలిస్తే 13 శాతం పెరిగి రూ. 52.30 వద్ద నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
సరఫరాపై ఆందోళనలు - వర్షభావ ప్రభావం
అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే 2026-27 చక్కెర సీజన్లో దేశీయంగా పంచదార లభ్యతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశీయంగా ప్రతినెలా సగటున 50 లక్షల టన్నుల అవసరం ఉండగా, సీజన్ ప్రారంభంలో 40 నుంచి 42 లక్షల టన్నుల నిల్వలు మాత్రమే అందుబాటులో ఉండవచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. కొందరు విశ్లేషకులైతే ఇది మరింత తగ్గి 32 నుంచి 35 లక్షల టన్నులకు పరిమితమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మరోవైపు సరిగ్గా పడని వర్షాలు, పొడి వాతావరణం చెరకు దిగుబడిపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. రాబోయేది పండుగల కాలం కావడం, భారతదేశంలో రాజకీయంగా పంచదార అత్యంత సున్నితమైన అంశం కావడంతో ప్రభుత్వం ఇప్పటి నుంచే కఠిన చర్యలకు దిగింది.
మిల్లులకు లాభాల పంట - నిపుణులు ఏమంటున్నారు?
సాధారణంగా డిమాండ్-సరఫరా మధ్య వ్యత్యాసం పెరిగి ధరలు పెరగడం చక్కెర మిల్లులకు లాభదాయకమని ఎస్బీఐ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ సన్నీ తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఎక్స్-ఫ్యాక్టరీ ధర కిలో రూ. 54-55, మహారాష్ట్రలో రూ. 46గా ఉంటే, మిల్లుల వద్ద కిలో రూ. 37 నాటి తక్కువ ఖర్చుతో కూడిన పాత నిల్వలు ఉన్నాయి. ఈ పెంపు వల్ల మిల్లులకు మంచి లాభాలు వస్తాయని ఆయన విశ్లేషించారు.
గత మూడేళ్లుగా ఇథనాల్ ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో ఆ విభాగంలో ఎదురవుతున్న నష్టాల ఒత్తిడిని ఈ చక్కెర ధరల పెరుగుదల భర్తీ చేస్తుందని సన్నీ అగర్వాల్ స్పష్టం చేశారు. షుగర్ రంగంలో బలరాంపూర్ చిని, త్రివేణి ఇంజనీరింగ్, ఈఐడీ ప్యారీ షేర్లు సానుకూలంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అయితే, పెరిగే ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం 10 లక్షల టన్నుల రా-షుగర్ (పచ్చి చక్కెర) ను పన్ను రహిత దిగుమతులకు అనుమతించే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. "ప్రభుత్వం కనుక ఏదైనా కొత్త నిబంధనలతో జోక్యం చేసుకుంటే ధరల్లో మళ్లీ క్షీణత వచ్చి షుగర్ షేర్లు పడిపోవచ్చు" అని సన్నీ అగర్వాల్ వ్యాఖ్యానిస్తూ, ఇన్వెస్టర్లు కచ్చితమైన స్టాప్-లాస్ స్థాయిలను పాటించాలని సూచించారు.
ABOUT THE AUTHORPraveen Kumar Lenkalaప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్లో సాక్షి టాస్క్ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్గా, సబ్ ఎడిటర్గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More

E-Paper


