...
...
Next Story

తమిళనాడులో ‘ఓటుకు నోటు’ కలకలం: టీవీకే, డీఎంకే పరస్పర ఆరోపణలు

అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు అధికార పార్టీ ఎమ్మెల్యేకు రూ.35 కోట్లు ఆఫర్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపగా, అధికార టీవీకే, ప్రతిపక్ష డీఎంకే పార్టీలు పరస్పరం గుర్రాల బేరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.

Published on: Jul 2, 2026, 07:44:23 IST
Advertisement

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో ‘ఓటుకు నోటు’ వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. అసెంబ్లీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటు వేసేందుకు అధికార తమిళగ వెట్రి కజగం (TVK) ఎమ్మెల్యేకు ఏకంగా రూ.35 కోట్లు లంచం ఆఫర్ చేసిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుల అనంతరం అధికార టీవీకే, ప్రతిపక్ష ద్రావిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీల మధ్య తీవ్రస్థాయిలో రాజకీయ యుద్ధం మొదలైంది. రెండు పార్టీలూ పరస్పరం ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి.

రూ. 35 కోట్ల ఆఫర్.. అసలేం జరిగింది?

తమిళనాడులోని అధికార కూటమిలోని పార్టీల తొలి సమావేశం (PTI)
తమిళనాడులోని అధికార కూటమిలోని పార్టీల తొలి సమావేశం (PTI)

టీవీకే ఎమ్మెల్యే ఎన్. ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జూన్ 29న ఆయన గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషనర్‌ను కలిసి రాతపూర్వక ఫిర్యాదు సమర్పించారు. 'ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్' (IPDS) అనే కన్సల్టెన్సీ సంస్థను నడుపుతున్నానంటూ తిరునావుక్కరసు అనే వ్యక్తి తనను సంప్రదించాడని ఇళయరాజా పేర్కొన్నారు. ఒక పెద్ద రాజకీయ పార్టీ తరఫున మాట్లాడుతున్నట్లు చెప్పిన తిరునావుక్కరసు, అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌పై ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని కోరినట్లు వెల్లడించారు. ఇందుకు ప్రతిఫలంగా రూ.35 కోట్లు ఇస్తామంటూ ఎర వేసినట్లు ఎమ్మెల్యే తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ఇళయరాజా ఫిర్యాదు ఆధారంగా డీ1 ట్రిప్లికేన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తిరునావుక్కరసుతో పాటు తిరుచిరాపల్లికి చెందిన నరేష్, చెన్నైకి చెందిన త్యాగరాజన్‌లను అరెస్ట్ చేశారు.

పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడైన నరేష్ కొద్దిరోజుల క్రితం చెన్నైలో వి. అశోక్ కుమార్‌ను కలిశాడు. ఈ అశోక్ కుమార్.. మాజీ మంత్రి, ప్రస్తుత కోయంబత్తూర్ సౌత్ డీఎంకే ఎమ్మెల్యే వి. సెంథిల్ బాలాజీ సోదరుడు. సెంథిల్ బాలాజీ, అశోక్ కుమార్ ల ఆదేశాల మేరకే తిరునావుక్కరసు సదరు ఎమ్మెల్యేను సంప్రదించి, డబ్బు ఆఫర్ చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. ఐపీడీఎస్ (IPDS) సంస్థను సెంథిల్ బాలాజీయే నడుపుతున్నారని టీవీకే ఆరోపిస్తోంది.

"మా ఎమ్మెల్యేలను లొంగతీసుకునే కుట్ర"

టీవీకే ఆరోపణలను డీఎంకే గట్టిగా తిప్పికొట్టింది. రివర్స్ అటాక్ చేస్తూ టీవీకే పార్టీయే ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడుతోందని ఆరోపించింది.

"ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తమ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించారని ఎండీఎంకే (MDMK) అధినేత వైకో స్వయంగా అంగీకరించారు" అని డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్‌ఎస్ భారతి పేర్కొన్నారు. కడయనల్లూర్ ఎమ్మెల్యే టీఎం రాజేంద్రన్, శీర్కాళి ఎమ్మెల్యే ఎస్. సెంథిల్ సెల్వన్ అనే ఇద్దరు ఎండీఎంకే శాసనసభ్యులు డీఎంకే గుర్తుపైనే గెలిచారని ఆయన గుర్తుచేశారు. ఈ మొత్తం వ్యవహారంపై డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ (DVAC) విభాగంతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించి విచారణ జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆర్‌వీ అర్లేకర్‌ను భారతి కోరారు.

డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA) కూటమి నుంచి ఎండీఎంకే బయటకు వచ్చి, అధికార టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించిన మూడు రోజులకే ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. డీఎంకే చేస్తున్న ఆరోపణలను మంత్రి నిర్మల్ కుమార్ తోసిపుచ్చారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే డీఎంకే ఇలాంటి అబద్ధాలు ఆడుతోందని ఆయన మండిపడ్డారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe