రికార్డుల వేటలో టాటా నెక్సాన్ ఈవీ.. లక్ష మైలురాయిని దాటిన తొలి ఎలక్ట్రిక్ కారు!
భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో టాటా నెక్సాన్ ఈవీ సరికొత్త చరిత్ర సృష్టించింది. విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకంగా లక్ష విక్రయాల మైలురాయిని అధిగమించి, దేశంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది.
భారతదేశ ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ విప్లవానికి నాంది పలికిన టాటా నెక్సాన్ ఈవీ మరో అరుదైన ఘనతను సాధించింది. దేశీయ రోడ్లపై ఈ కారు 1లక్ష విక్రయాల మార్కును దాటింది. ఇండియాలో ఒక ఎలక్ట్రిక్ కారు 1లక్ష సేల్స్ మైలురాయిని దాటడం ఇదే తొలిసారి.

కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం అనుకున్న ఎలక్ట్రిక్ కార్లను సామాన్యులకు సైతం చేరువ చేయడంలో నెక్సాన్ ఈవీ కీలక పాత్ర పోషించింది.
టాటా నెక్సాన్ ఈవీ- నాడు అనుమానం.. నేడు నమ్మకం!
2020లో నెక్సాన్ ఈవీ తొలిసారి మార్కెట్లోకి వచ్చినప్పుడు పరిస్థితులు వేరుగా ఉండేవి. ఎలక్ట్రిక్ కార్లంటే మైలేజీ (రేంజ్) తక్కువని, ధరలు ఎక్కువని, ఛార్జింగ్ సదుపాయాలు ఉండవని వినియోగదారులు సందేహించేవారు. ఈ అడ్డంకులన్నింటినీ టాటా మోటార్స్ ధైర్యంగా ఎదుర్కొంది. సరైన రేంజ్, అందుబాటులో ఉండే ధర, నమ్మకమైన వారంటీతో ప్రజల్లో ఉన్న భయాలను తొలగించి, ఎలక్ట్రిక్ వాహనాలపై భరోసా కల్పించింది.
ఫలితంగా ఇండియాలో ఈవీ విభాగ వృద్ధిని ముందుండి నడిపించింది. అంతేకాదు టాటా ఎలక్ట్రిక్ కార్ల పోర్ట్ఫోలియోలో నెక్సాన్ ఈవీ నేటికీ వెన్నెముకగా నిలుస్తోంది.
టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్షోరూం ధరలు రూ. 12.49 లక్షల నుంచి రూ. 17.49 లక్షల వరకు ఉంటాయి.
టాటా నెక్సాన్ ఈవీ- మారుతున్న టెక్నాలజీ.. పెరుగుతున్న రేంజ్
తొలినాళ్లలో కేవలం 230 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చిన నెక్సాన్ ఈవీ.. ఇప్పుడు సరికొత్త అప్డేట్స్తో 375 కిలోమీటర్ల వరకు ప్రయాణించే స్థాయికి చేరింది.
వారంటీ విషయంలోనూ టాటా మోటార్స్ పెద్ద పీట వేసింది. సాధారణంగా ఇచ్చే 8 ఏళ్ల వారంటీతో పాటు, కొత్త వెర్షన్లలో బ్యాటరీపై మరింత మెరుగైన భరోసా ఇస్తోంది. దీని ఫలితంగానే మొదట్లో నెలకు 300 యూనిట్లు అమ్ముడైన ఈ కారు, ఇప్పుడు సగటున నెలకు 3,000 యూనిట్ల విక్రయాలతో దూసుకుపోతోంది.
కేవలం కార్లను అమ్మడమే కాకుండా, ఒక పరిపూర్ణమైన 'ఈవీ ఎకోసిస్టమ్'ను నిర్మించడంపై టాటా దృష్టి పెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,000కి పైగా నగరాల్లో 1,200కు పైగా సేల్స్, సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అలాగే, 5,000 మందికి పైగా శిక్షణ పొందిన టెక్నీషియన్లు అందుబాటులో ఉన్నారు. ఇంటి వద్ద ఛార్జింగ్తో పాటు బహిరంగ ప్రదేశాల్లో 5,000కు పైగా పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు, హై-స్పీడ్ ఛార్జింగ్ హబ్లను ఏర్పాటు చేయడంతో ఈవీ ఓనర్షిప్ ఇప్పుడు మరింత సులభతరమైంది.
టాటా ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పటి వరకు మొత్తం 12 బిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి, పర్యావరణానికి మేలు చేస్తూ భారీగా కార్బన్ ఉద్గారాలను తగ్గించాయని కంపెనీ గర్వంగా చెప్పింది.
మున్ముందు మరిన్ని మెరుపులు..
దేశ ఈవీలో టాటా మోటార్స్ రారాజుగా నిలుస్తోంది. నెక్సాన్ ఈవీ టాటా మోటార్స్కి సైనికుడిగా పనిచేస్తోంది. భవిష్యత్తులో ఈ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు టాటా మోటార్స్ భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. 2030 నాటికి ఐదు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకురానుంది. ఇందులో సియెర్రా ఈవీ, అప్డేటెడ్ పంచ్ ఈవీలతో పాటు అత్యాధునిక ‘అవిన్యా’ మోడల్స్ ఉన్నాయి. 2026లో ఈ కొత్త మోడల్స్ మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది.
500 కి.మీ రేంజ్, ఫ్యూచరిస్టిక్ ఫీచర్స్తో వస్తున్న టాటా అవిన్యా ఈవీ గురించి తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


