మొదటిసారి కారు కొంటున్నారా? మీ కోసం బెస్ట్ ఆప్షన్లు ఇవే.. బడ్జెట్​లో టాప్ 5 మోడల్స్​..

మీరు లైఫ్​లో మొదటిసారి ఒక కారు కొనాలని ప్లాన్​ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే. మార్కెట్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వాటిల్లో, మొదటిసారి కారు కొనేవారు పిక్​ చేసుకోగలిగే టాప్​ 5 బెస్ట్​ ఆప్షన్స్​ని ఇక్కడ చూసేయండి..

Published on: Feb 21, 2026, 10:00:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సొంత కారు అనేది మధ్యతరగతి ప్రజల చిరకాల కోరిక! కష్టపడి డబ్బు పోగు చేసి, ఒక మంచి కారు కొని, కుటుంబంతో సరదగా ట్రిప్స్​కి వెళ్లాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అయితే, డబ్బు రెడీగా ఉన్న తర్వాత వచ్చే సాధారణ సందేహం.. “ఏ కారు కొనాలి?” అని. పైగా ఇప్పుడు భారత ఆటోమొబైల్​ మార్కెట్​లో అనేక, అదిరిపోయే ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏది ఎంచుకోవాలి? ఈ నేపథ్యంలో.. మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్న వారి కోసం టాప్​-5 మోడల్స్​, వాటి ధరలు వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా ఎలివేట్​ ఎస్​యూవీ..
హోండా ఎలివేట్​ ఎస్​యూవీ..

మొదటిసారి కారు కొంటున్న వారికి.. టాప్​ 5 ఆప్షన్స్​..

1. మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ / మారుతీ సుజుకీ సెలెరియో

ఎక్స్​షోరూం ధరలు- రూ. 4.70 లక్షల నుంచి రూ. 6.84 లక్షల వరకు

నిర్వహణ భారం తక్కువగా ఉండాలనుకునే వారికి ఈ మారుతీ హ్యాచ్‌బ్యాక్‌లు సరైన ఎంపిక. మొదటిసారి కారు కొనేవారికి ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థకున్న విస్తృతమైన సర్వీస్ నెట్‌వర్క్ ఎంతో భరోసానిస్తుంది. ఈ కార్లు నడపడం సులభం, మైలేజీలో మేటి! వీటి స్పేర్ పార్ట్స్ తక్కువ ధరకే లభిస్తాయి. పైగా రీసేల్ వాల్యూ కూడా చాలా ఎక్కువ. మీకు ఎక్కువ హెడ్‌రూమ్, విశాలమైన క్యాబిన్ కావాలంటే వ్యాగన్ ఆర్ ఎంచుకోవచ్చు. కారు కాంపాక్ట్‌గా ఉండాలనుకుంటే సెలెరియో ఉత్తమం.

2. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఎక్స్​షోరూం ధర- రూ. 5.55 లక్షల నుంచి రూ. 7.92 లక్షల వరకు

వ్యాగన్ ఆర్ లేదా సెలెరియో వంటి ఎంట్రీ-లెవల్ కార్ల కంటే కొంచెం ప్రీమియం ఫీల్ కోరుకునే వారికి ఈ హ్యుందాయ్​ గ్రాండ్​ ఐ10 నియోస్​ సరిగ్గా సరిపోతుంది. ఇందులోని 1.2-లీటర్ ఇంజన్ చాలా స్మూత్‌గా ఉంటుంది. రైడ్ క్వాలిటీ సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా, క్యాబిన్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఆధునిక ఫీచర్లు దీనిని ఒక కంప్లీట్ ఫ్యామిలీ కార్‌గా మారుస్తాయి.

3. టాటా పంచ్

ఎక్స్​షోరూం ధర- రూ. 5.59 లక్షల నుంచి రూ. 10.54 లక్షల వరకు

భద్రత, దృఢత్వానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి టాటా పంచ్ ఎస్​యూవీ ఒక అద్భుతమైన ఎంపిక. ఈ ప్రైజ్​ పాయింట్​లో 5-స్టార్ క్రాష్ రేటింగ్ కలిగిన అతికొద్ది కార్లలో ఇదీ ఒకటి. దీని కాంపాక్ట్ సైజు వల్ల ట్రాఫిక్‌లో నడపడం, తక్కువ స్థలంలో పార్క్ చేయడం చాలా సులభం. ఎత్తైన సీటింగ్ పొజిషన్ వల్ల రోడ్డు వ్యూ క్లియర్‌గా కనిపిస్తుంది. ఇది గుంతల రోడ్లను కూడా హ్యాచ్‌బ్యాక్‌ల కంటే మెరుగ్గా తట్టుకుంటుంది. ఇప్పుడు ఇందులో టర్బో-పెట్రోల్ ఆప్షన్ కూడా ఉండటం వల్ల హైవే ప్రయాణాలు మరింత హాయిగా సాగుతాయి.

4. నిస్సాన్ మాగ్నైట్

ఎక్స్​షోరూం ధర- రూ. 5.62 లక్షల నుంచి రూ. 10.76 లక్షల వరకు

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికి మాగ్నైట్ గుడ్​ ఛాయిస్​ అనే చెప్పుకోవాలి. కాంపాక్ట్ ఎస్​యూవీ స్టైలింగ్, విశాలమైన స్పేస్, ఫీచర్ల జాబితా దీని ప్రత్యేకత. టూ-వీలర్ లేదా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ నుంచి సొంత కారుకు మారాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ 'వాల్యూ ఫర్ మనీ' కారు.

5. హోండా ఎలివేట్ ఎస్​యూవీ

ఎక్స్​షోరూం ధర- రూ. 11.59 లక్షల నుంచి ప్రారంభం

విశ్వసనీయత, భద్రత, సింప్లిసిటీ - ఈ మూడింటి కలయికే హోండా ఎలివేట్ ఎస్​యూవీ. ఇందులోని 1.5ఎల్​ ఐ-వీటెక్​ ఇంజన్ 119 బీహెచ్​పీ పవర్, 145 ఎన్​ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మార్కెట్​లో ప్రస్తుతం లభిస్తున్న అత్యుత్తమ కాంపాక్ట్ ఎస్​యూవీల్లో ఒకటి. మాన్యువల్, సీవీట ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఇందులో ఉన్నాయి. దీని డిజైన్ చాలా షార్ప్‌గా, ఫ్యూచర్-ప్రూఫ్‌గా ఉంటుంది, అంటే కొన్ని ఏళ్ల తర్వాత కూడా కారు పాతబడినట్లు అనిపించదు.

ఫీచర్లు: ఇందులో హోండా సెన్సింగ్ (లెవల్​ 2 అడాస్​) ఉండటం వల్ల ఇది అత్యంత సురక్షితమైనది. అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 10.25-ఇంచ్​ ఇన్ఫోటైన్‌మెంట్, వెంటిలేటెడ్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బూట్ స్పేస్ 458 లీటర్లు, ఇది ఈ సెగ్మెంట్‌లోనే అత్యధికం. జపనీస్ ఇంజనీరింగ్ వల్ల దీని రిలయబిలిటీ గురించి ఆలోచించాల్సిన పనే లేదు.

ఇవి కాకుండా మీరు ఒక వేళ తక్కువ ధరలో ఎలక్ట్రిక్​ కారును కొనాలని ప్లాన్​ చేస్తుంటే ఎంజీ కామెట్​ ఈవీని కూడా చెక్​ చేయవచ్చు. దీని ఎక్స్​షోరూం ధర రూ. 7.5 లక్షల నుంచి రూ. 9.9 లక్షల వరకు ఉంటుంది. నగర ప్రయాణాలకు ఇది ది బెస్ట్​ ఈవీ అని చెప్పుకోవాలి.

మరి వీటిల్లో మీరు ఏది ఎంచుకుంటున్నారు?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More