Tax saving FDs : ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇవి- ఏ బ్యాంకులో ఎంత వడ్డీ అంటే..

Fixed deposits : తక్కువ రిస్క్, స్థిరమైన ఆదాయం కోరుకునే భారతీయులకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎప్పుడూ మొదటి ఛాయిస్. ముఖ్యంగా 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల ద్వారా సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు ఏకంగా 7.90% వరకు వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

Published on: May 9, 2026, 08:14:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Fixed deposit interest rates : భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు పెట్టుబడి అనగానే గుర్తొచ్చే మొదటి మార్గం ఫిక్స్‌డ్ డిపాజిట్. షేర్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటి రిస్క్ ఎక్కువగా ఉండే సాధనాల కంటే.. తమ పెట్టుబడి పదిలంగా ఉండాలని కోరుకునే వారు ఎప్పుడూ ఎఫ్‌డీలకే ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా కొన్ని బ్యాంకులు 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై 7.90% వరకు వడ్డీ రేట్లను పెంచడంతో, ఇవి మరోసారి పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇవి..
ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఇవి..

అసలు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీ అంటే ఏంటి?

ఇవి కేవలం సాధారణ సేవింగ్స్ మాత్రమే కాదు. ఒక వ్యక్తి తన ఆదాయంపై వడ్డీని పొందుతూనే, అదే సమయంలో ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును తగ్గించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇది అత్యంత సురక్షితమైన, నమ్మదగ్గ సంపద సృష్టి మార్గం.

లాక్-ఇన్ పీరియడ్ గురించి తెలుసుకోండి..

సాధారణ ఎఫ్‌డీలను మనం ఎప్పుడు పడితే అప్పుడు వెనక్కి తీసుకోవచ్చు (కొంత పెనాల్టీతో). కానీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీల విషయంలో ఆ సదుపాయం ఉండదు. వీటికి కచ్చితంగా 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే, మీరు పెట్టిన పెట్టుబడి ఐదేళ్ల కాలపరిమితి ముగిసే వరకు బ్యాంకులోనే ఉంటుంది. మెచ్యూరిటీ కంటే ముందే దీనిని వెనక్కి తీసుకోవడం సాధ్యం కాదు.

సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు..

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ ట్యాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే రూ. 1.5 లక్షల వరకు మొత్తాన్ని మీ మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి మినహాయించుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్వెస్టర్లు ఒక విషయం గమనించాలి. మీరు పెట్టుబడి పెట్టే 'అసలు' మొత్తానికి మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. కానీ, ఆ పెట్టుబడిపై వచ్చే ‘వడ్డీ’ ఆదాయం మాత్రం పన్ను పరిధిలోకి వస్తుంది. అంటే మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం వడ్డీ ఆదాయంపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఏ బ్యాంకులో ఎంత వడ్డీ?

ప్రస్తుతం ఈ 5 ఏళ్ల ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లు 5.5% నుంచి 7.75% వరకు ఉన్నాయి. కొన్ని బ్యాంకులు అంతకంటే ఎక్కువ కూడా ఆఫర్ చేస్తున్నాయి.

ప్రైవేట్ బ్యాంకులు: ప్రముఖ ప్రైవేట్ బ్యాంకుల్లో డీసీబీ బ్యాంక్ అత్యధికంగా 7.25% వడ్డీని అందిస్తోంది. ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ 7.15% వడ్డీ ఇస్తుండగా.. యస్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్, తమిళనాడు మర్చంటైల్ బ్యాంకులు 6.70% నుంచి 6.75% మధ్య వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి.

ప్రభుత్వ రంగ బ్యాంకులు : ప్రభుత్వ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా 6.30% వడ్డీతో టాప్‌లో ఉంది. కెనరా బ్యాంక్ 6.25%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6.05% వడ్డీ రేట్లను కల్పిస్తున్నాయి.

స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు: వడ్డీ రేట్ల విషయంలో స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు దూసుకుపోతున్నాయి. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా 7.90% వడ్డీని ఇస్తోంది. జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.77%, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 7.20% చొప్పున వడ్డీని చెల్లిస్తున్నాయి.

గుర్తుంచుకోవాల్సిన కీలక అంశాలు..

వీటిలో రిస్క్ చాలా తక్కువ. పీపీఎఫ్ లేదా ఈఎల్ఎస్ఎస్ వంటి ఇతర 80సీ ఆప్షన్లతో పోలిస్తే ఇవి స్థిరమైన రాబడిని ఇస్తాయి. అయితే, 5 ఏళ్ల పాటు డబ్బును వెనక్కి తీసుకోలేము కాబట్టి, లిక్విడిటీ పరంగా కొంచెం ఆలోచించుకోవాలి.

ఎవరు పెట్టుబడి పెట్టవచ్చు?

తక్కువ రిస్క్ కోరుకునే వారు, ముఖ్యంగా రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నవారు లేదా ఇప్పటికే రిటైర్ అయి తమ పొదుపు మొత్తానికి భద్రత కోరుకునే వారికి ఇవి సరైన ఎంపిక. భారతీయ నివాసితులు, సీనియర్ సిటిజన్లు, హిందూ అవిభక్త కుటుంబాలు,ఎన్ఆర్ఐలు ఎవరైనా ఈ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్‌డీలలో పెట్టుబడి పెట్టవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More