...
...
Next Story

నాసిక్ టీసీఎస్ కేసులో సంచలనం: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. అరాచకాలపై 'సిట్' పంజా

నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో వెలుగుచూసిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల నేపథ్యంలో కంపెనీ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భద్రత దృష్ట్యా నాసిక్ యూనిట్‌ను తాత్కాలికంగా మూసివేసి, అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రకటించింది.

Published on: Apr 16, 2026 01:16 PM IST
Advertisement

మహారాష్ట్రలోని నాసిక్ టీసీఎస్ (TCS) బీపీఓ యూనిట్‌లో చోటుచేసుకున్న అరాచకాలు దేశవ్యాప్త ఐటీ రంగంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బెదిరింపులు, బలవంతపు మత మార్పిడి వంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో.. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగుల రక్షణ, సౌకర్యం కోసం కంపెనీ మేనేజ్‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. నాసిక్ స్టేషన్ పరిధిలోని ఉద్యోగులందరినీ తక్షణమే 'వర్క్ ఫ్రమ్ హోమ్' (WFH) చేయాలని ఆదేశించింది. కంపెనీలోని అంతర్గత విభాగాల్లో అలజడి రేగడం, నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి వేధింపులు

నాసిక్ టీసీఎస్ కేసులో సంచలనం: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. అరాచకాలపై సిట్ పంజా (Bloomberg)
నాసిక్ టీసీఎస్ కేసులో సంచలనం: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్.. అరాచకాలపై సిట్ పంజా (Bloomberg)

ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. ఇందులో నిందితులుగా ఉన్న ఏడుగురు పురుషులు ఒక పక్కా ప్రణాళికతో, వ్యవస్థీకృత ముఠాగా ఏర్పడి మహిళా ఉద్యోగులను వేధించినట్లు నాసిక్ పోలీసులు గుర్తించారు. "ఈ ముఠాలోని ఏడుగురు పురుష నిందితులు ఒక వ్యవస్థీకృత గ్యాంగ్‌లా వ్యవహరిస్తూ మహిళా ఉద్యోగులను టార్గెట్ చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది" అని ఒక సీనియర్ పోలీసు అధికారి పీటీఐ (PTI) వార్తా సంస్థకు వివరించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా, మరో మహిళా ఉద్యోగి పరారీలో ఉన్నారు.

మహిళా అధికారుల అండతోనే అరాచకాలు?

ఈ దారుణాల్లో నిందితులకు సహకరించిన మహిళా అధికారుల తీరుపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు తమకు జరుగుతున్న అన్యాయంపై ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆపరేషన్స్ హెడ్, హెచ్ఆర్ (HR) విభాగానికి చెందిన మహిళా అధికారులు వారిని నిరుత్సాహపరిచినట్లు ఆరోపణలు ఉన్నాయి.

"ఇలాంటివి కార్యాలయాల్లో సహజంగా జరుగుతుంటాయని, వీటిని పెద్దవి చేయవద్దంటూ బాధితులను అధికారులు భయపెట్టారు. నిందితులకు వత్తాసు పలికి బాధితుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు" అని నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ పేర్కొన్నారు.

ఈ కేసు కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాలేదు. దీని వెనుక ఏదైనా తీవ్రవాద సంస్థల హస్తం ఉందా? లేదా విదేశాల నుంచి నిందితులకు నిధులు అందుతున్నాయా? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్ (SID), యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)లకు పోలీసులు లేఖలు రాశారు. బలవంతపు మత మార్పిడి ఆరోపణలు ఉండటంతో దీనిని జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా అధికారులు భావిస్తున్నారు.

ఐటీ రంగంలో భద్రతపై ఆందోళన

హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో వేలాది మంది యువతీ యువకులు ఐటీ కంపెనీల్లో పనిచేస్తుంటారు. నాసిక్ టీసీఎస్ ఘటనతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ఐటీ ఉద్యోగుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్ సంస్థల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) ఎంతవరకు పారదర్శకంగా పనిచేస్తున్నాయన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. నాసిక్ పోలీసులు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసి, ఎనిమిది మంది మహిళా బాధితుల వాంగ్మూలాలను సేకరిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe