Vande Bharatam : గ్రాస్రూట్ స్టార్టప్ల కోసం 'వందే భారతమ్' ప్రోగ్రామ్.. పూర్తి వివరాలు ఇవే!
భారతీయ వ్యాపార దిగ్గజం అదానీ గ్రూప్.. దేశంలోని చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల ఆవిష్కర్తలు, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ‘వందే భారతమ్’ పేరిట ఒక దేశవ్యాప్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ద్వారా దేశంలోని ప్రతిభావంతులకు మెంటర్షిప్, పెట్టుబడులు, ఇంక్యుబేషన్ సపోర్ట్ లభించనున్నాయి.
భారతదేశంలో స్టార్టప్ సంస్కృతి కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించేలా అదానీ గ్రూప్ ఒక భారీ అడుగు వేసింది! దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, సమస్యలకు వినూత్న పరిష్కారాలు చూపే వారిని గుర్తించి, వారికి అండగా నిలిచేందుకు ‘వందే భారతమ్’ పేరుతో ఒక కొత్త జాతీయ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన 64వ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రముఖ నటుడు రాజీవ్ ఖండేల్వాల్ ఈ కార్యక్రమానికి అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 800కు పైగా జిల్లాల్లో విస్తరించనుంది. ప్రాంతీయ భాషల అభ్యర్థులకు కూడా ఇందులో ప్రాధాన్యత ఉంటుంది. దీనికి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జూన్ 24 నుంచే, అధికారిక వెబ్సైట్ (vandebharatam.org) లో ప్రారంభమైంది.
వందే భారతమ్- ఎవరు అర్హులు? ఏ రంగాల వారికి అవకాశం?
'వందే భారతమ్' ప్రోగ్రామ్లో పాల్గొనడానికి ఎలాంటి వయస్సు, విద్యార్హత నిబంధనలు లేవు. అలాగే కంపెనీ తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలనే రూల్ కూడా లేదు. కేవలం ఒక మంచి ఐడియా, ప్రోటోటైప్ (నమూనా), ప్రాథమిక దశలో ఉన్న వ్యాపారం లేదా ఇప్పటికే నడుస్తున్న బిజినెస్ ఉన్నవారెవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
రంగాలు: టెక్నాలజీ, మాన్యుఫ్యాక్చరింగ్ (తయారీ రంగం), అగ్రికల్చర్ (వ్యవసాయం), సస్టైనబిలిటీ (పర్యావరణ హితం), సాంప్రదాయ హస్తకళలు, కమ్యూనిటీ ఆధారిత పరిష్కారాలు చూపే స్టార్టప్లకు ఇందులో అవకాశం కల్పిస్తారు.
ప్రత్యేక ప్రాధాన్యత: మహిళా పారిశ్రామికవేత్తలు, గిరిజన ఆవిష్కర్తలు, గ్రామీణ ప్రతిభావంతులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక విభాగాలు ఉంటాయి.
వందే భారతమ్- ఎంపిక విధానం, ప్రయోజనాలు..
వందే భారతమ్ కోసం వచ్చిన దరఖాస్తులను ఆవిష్కరణ, వ్యాపార సామర్థ్యం, సమాజంపై దాని ప్రభావం, స్కేలబిలిటీ ఆధారంగా నిపుణుల కమిటీ పరిశీలిస్తుంది.
టాప్ 75 ఫైనలిస్ట్లు: ప్రాంతీయ స్థాయి మూల్యాంకనాల అనంతరం దేశవ్యాప్తంగా 75 మంది ఫైనలిస్ట్లను ఎంపిక చేస్తారు.
అహ్మదాబాద్లో శిక్షణ: ఎంపికైన ఈ 75 మందిని గుజరాత్లోని అహ్మదాబాద్కు ఆహ్వానించి ఒక ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తారు. అక్కడ వారికి ప్రముఖ వ్యాపారవేత్తలతో ముఖాముఖి, పరిశ్రమ నిపుణులతో మెంటర్షిప్, ఇన్వెస్టర్లతో (పెట్టుబడిదారులు) నేరుగా మాట్లాడే అవకాశం లభిస్తుంది.
గ్రాండ్ ఫినాలే: స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) నాటికి ఈ ప్రోగ్రామ్ ముగింపు దశకు చేరుకుంటుంది. ఫైనలిస్ట్లకు ప్రైజ్ మనీ, ఇంక్యుబేషన్ సపోర్ట్, వ్యూహాత్మక భాగస్వామ్యాలు అందుతాయి.
వందే భారతమ్- స్టార్టప్ రంగానికి ఊతం..
ప్రస్తుతం భారతదేశంలో డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) గుర్తించిన స్టార్టప్లలో సగానికి పైగా టైర్-2, టైర్-3 చిన్న పట్టణాల నుంచే వస్తున్నాయి. దేశంలో ప్రస్తుతం 2 లక్షలకు పైగా గుర్తింపు పొందిన స్టార్టప్లు ఉండగా, అవి దాదాపు 21 లక్షల ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను సృష్టించాయి. ఈ నేపథ్యంలో అదానీ గ్రూప్ తీసుకొచ్చిన 'వందే భారతమ్' కార్యక్రమం చిన్న పట్టణాల, గ్రామీణ ప్రాంతాల వ్యాపార కలలకు మరింత రెక్కలు ఇవ్వనున్నాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


