2025లో అత్యధికంగా అమ్ముడుపోయిన కారు ఏదో తెలుసా? ఎస్యూవీ కాదు..
2025 క్యాలెండర్ ఇయర్ కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ డిజైర్ సత్తా చాటింది. సుమారు 2.14 లక్షల యూనిట్ల హోల్సేల్ అమ్మకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఎస్యూవీల హవా నడుస్తున్నా, సెడాన్ విభాగంలో తన ఆధిపత్యాన్ని డిజైర్ నిలబెట్టుకుంది.
భారతీయ వాహన మార్కెట్లో ప్రస్తుతం ఎస్యూవీల ట్రెండ్ ఏ స్థాయిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడ చూసినా స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్దే హవా. కానీ, ఎస్యూవీల సునామీలోనూ ఓ సెడాన్ తన ప్రత్యేకతను చాటుకుంది. 2025 క్యాలెండర్ ఇయర్లో భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడుపోయిన (హోల్సేల్ వాల్యుమ్స్ పరంగా) వెహికిల్గా నిలిచింది. అదే మారుతీ సుజుకీ డిజైర్.
టాప్-10లో నిలిచిన మోడళ్లు ఇవే..
గతేడాది మొత్తం 2.14 లక్షల యూనిట్ల హోల్సేల్ విక్రయాలతో మారుతీ సుజుకీ డిజైర్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. వార్షిక అమ్మకాల్లో ఒక సెడాన్ కారు నెంబర్ వన్ స్థానంలో చాలా సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. డిజైర్ తర్వాతి స్థానాల్లో ఉన్న మోడళ్లు:
హ్యుందాయ్ క్రెటా, టాటా నెక్సాన్ చెరో 2.01 లక్షల యూనిట్లతో గట్టి పోటీనిచ్చాయి.
మారుతీ వ్యాగన్ఆర్ 1.94 లక్షల యూనిట్లతో హ్యాచ్బ్యాక్ విభాగంలో తన సత్తా చాటింది.
మారుతీ సుజుకీ ఎర్టిగా (1.92 లక్షలు), మారుతీ సుజుకీ స్విఫ్ట్ (1.89 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మారుతీ సుజుకీ ఫ్రాంక్స్ 1.80 లక్షల యూనిట్ల అమ్మకాలతో టాప్-10లో చేరింది.
మహీంద్రా స్కార్పియో (1.77 లక్షలు), మారుతీ బ్రెజ్జా (1.75 లక్షలు), టాటా పంచ్ (1.73 లక్షలు) కూడా 2025 టాప్-10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
2025కి ముందు 2024లో టాటా పంచ్ (2.02లక్షలు), 2023లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ (2.03లక్షలు), 2022లో మారుతీ వాగన్ఆర్ (2.12లక్షలు), 2021లో మారుతీ వాగన్ఆర్ (1.84లక్షలు), 2020లో మారుతీ సుజుకీ స్విఫ్ట్ (1.61లక్షలు) బెస్ట్ సెల్లింగ్గా నిలిచాయి. ఇవన్నీ హోల్సేల్ వాల్యుమ్స్ లెక్కలు.
సాధారణంగా హోల్సేల్ నంబర్లకు, కస్టమర్ల అసలు డిమాండ్కు మధ్య తేడా ఉంటుందని కొందరు భావిస్తుంటారు. అయితే మారుతీ సుజుకీ విషయంలో ఈ వ్యత్యాసం చాలా తక్కువ! డీలర్ల వద్ద కేవలం రెండు నుంచి మూడు రోజులకు సరిపడా స్టాక్ మాత్రమే ఉంటుందని, కంపెనీ నుంచి వచ్చే వాహనాలు వెంటనే కస్టమర్లకు చేరుతున్నాయని మారుతీ వర్గాలు వెల్లడించాయి.
- కార్ల మార్కెట్ డిసెంబర్ ధమాకా: ఎస్యూవీల జోరు, మారుతీ, టాటా, మహీంద్రా టాప్ గేర్! పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
మారుతీ సుజుకీ ఆల్-టైమ్ రికార్డ్..
2025 ఏడాది మారుతీ సుజుకీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది. గతేడాది కంపెనీ ఏకంగా 18,44,169 యూనిట్ల హోల్సేల్, 18,71,508 యూనిట్ల రీటైల్ అమ్మకాలను నమోదు చేసింది. ముఖ్యంగా డిసెంబర్ నెలలో మునుపెన్నడూ లేని విధంగా అత్యధిక విక్రయాలు జరిగాయి.
పెరిగిన సీఎన్జీ వాహనాల జోరు..
కారు కొనేవారి ఆలోచనల్లో మార్పు కనిపిస్తోందని గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది అన్ని కేటగిరీల వాహనాలు మంచి వృద్ధిని కనబరిచినప్పటికీ, సీఎన్జీ కార్లకు డిమాండ్ భారీగా పెరిగింది. ఏడాది పొడవునా సుమారు 7 లక్షల సీఎన్జీ వాహనాలు అమ్ముడయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. తక్కువ ఖర్చుతో ప్రయాణించే వీలుండటమే ఇందుకు ప్రధాన కారణం.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


