Oracle layoffs : ఒరాకిల్లో మళ్లీ లేఆఫ్స్- ఉదయం 6 గంటలకు మెయిల్స్.. ఏఐ కోసం ఉద్యోగులపై వేటు!
గ్లోబల్ టెక్ దిగ్గజం ఒరాకిల్ తమ సిబ్బందికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బిలియన్ల డాలర్లు ఖర్చు చేస్తున్న కంపెనీ, జీతాల భారాన్ని తగ్గించుకోవడానికి ఉద్యోగులను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా లేఆఫ్ చేసింది!
ఐటీ రంగాన్ని లేఆఫ్స్ భయం మళ్లీ తీవ్రంగా వెంటాడుతోంది. ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం ఒరాకిల్ తమ సిబ్బందికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే మరో విడత భారీ ఉద్యోగాల కోతకు తెరలేపింది. సంస్థ పునర్వ్యవస్థీకరణ పేరుతో సోమవారం నుంచే ఈ తొలగింపుల ప్రక్రియను ప్రారంభించింది. బాధిత ఉద్యోగులకు పిడుగులాంటి ఈమెయిల్స్ పంపడమే కాకుండా, ఆ రోజే చివరి పనిదినమని తేల్చిచెప్పేసింది.
హైదరాబాద్, బెంగళూరు సహా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఈ పరిణామం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈమెయిల్లో దిగ్భ్రాంతికర ఆదేశాలు!
కంపెనీ ఉన్నపళంగా లేఆఫ్స్ నిర్ణయాన్ని అమలులోకి తెచ్చిందని ఉద్యోగులకు అందిన తొలగింపు లేఖల ద్వారా తెలుస్తోంది.
"ఒరాకిల్ ప్రస్తుత వ్యాపార అవసరాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, సంస్థాగత మార్పుల్లో భాగంగా మీ ఉద్యోగాన్ని తొలగించాలని నిర్ణయించాం. కాబట్టి ఈ రోజే మీ చివరి పనిదినం," అని ఒరాకిల్ పలువురు ఉద్యోగులకు ఉదయం 6 గంటలకు ఈమెయిల్స్ పంపించింది!
మెయిల్ పంపిన వెంటనే సిస్టమ్లు, కంపెనీ ఈమెయిల్, వాయిస్మెయిల్, ఇతర అంతర్గత రికార్డులకు సంబంధించిన యాక్సెస్ను కంపెనీ నిలిపివేసింది. సంస్థకు చెందిన ఏ విధమైన గోప్యమైన సమాచారాన్ని కాపీ చేయకూడదని, వ్యక్తిగత ఈమెయిల్స్కు పంపుకోకూడదని కఠినమైన హెచ్చరికలు జారీ చేసింది. నిష్క్రమణ పత్రాలపై సంతకం చేసిన తర్వాతే పరిహారం చెల్లిస్తామని వెల్లడించింది.
అయితే "మా సంస్థ అభివృద్ధికి మీరు అందించిన సేవలకు, కష్టపడి చేసిన పనికి కృతజ్ఞతలు," అని ఒరాకిల్ లేఆఫ్స్ లేఖ ముగింపులో ఒక స్పష్టమైన వాక్యాన్ని చేర్చింది.
లింక్డ్ఇన్, రెడ్డిట్, బ్లైండ్ వంటి సోషల్ మీడియా వేదికల్లో బాధితులు తమ ఆవేదనను పంచుకుంటున్నారు.
ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం భారీ ఖర్చులు!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో ముందంజలో నిలిచేందుకు ఒరాకిల్ భారీగా అప్పులు చేస్తోంది. సొంతంగా డేటా సెంటర్లు నిర్మించడానికి, నిధుల సమీకరణకు బిలియన్ల డాలర్లు వెచ్చిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మూలధన ఖర్చులను ఏకంగా 90 బిలియన్ డాలర్ల నుంచి 95 బిలియన్ డాలర్ల స్థాయికి పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
ఈ క్రమంలోనే ప్రాజెక్టులకు వేల కోట్లు మళ్లిస్తూ, మరోవైపు అంతర్గతంగా జీతాల భారాన్ని తగ్గించుకునేందుకు మానవ వనరులపై వేటు వేస్తోంది. కొన్ని అంతర్గత విభాగాల్లో ఏకంగా డబుల్ డిజిట్ శాతంలో సిబ్బందిని తగ్గించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే 21,000 మందికి గుడ్బై!
ఒరాకిల్ ఉద్యోగులను తొలగించడం ఇదే మొదటిసారి కాదు. గత ఆర్థిక సంవత్సరంలోనే కంపెనీ దాదాపు 21,000 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 13 శాతం) ఇంటికి పంపింది. ఇక తాజా ఒరాకిల్ లేఆఫ్స్కి ముందు కంపెనీలో 1,41,000 మంది పనిచేస్తుండగా, ఈ విడత లేఆఫ్స్తో ఆ సంఖ్య మరింత పడిపోనుంది.
ఏఐ సాంకేతికత వైపు కంపెనీలు మొగ్గు చూపుతున్న కొద్దీ, సాధారణ ఐటీ ఉద్యోగాలకు ముప్పు పెరుగుతోందనడానికి ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. కాగా ఈ లేఆఫ్స్పై స్పందించడానికి ఒరాకిల్ యాజమాన్యం నిరాకరించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


