350% టారిఫ్ల బెదిరింపుతోనే భారత్-పాక్ యుద్ధం ఆగిపోయింది: మళ్లీ ట్రంప్ వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. 350 శాతం సుంకాలు (టారిఫ్లు) విధిస్తానని బెదిరించడం వల్లే ప్రధాని మోదీ భారత్-పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయిందని ఆయన పేర్కొన్నారు. వాణిజ్యాన్ని అడ్డుపెట్టుకుని తాను రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించానని మరోసారి వ్యాఖ్యానించారు.
తాను చేసిన 350 శాతం టారిఫ్ బెదిరింపుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోదీ తనకు స్వయంగా ఫోన్ చేసి, “మేము ఇక యుద్ధానికి వెళ్లడం లేదు” అని చెప్పారని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన యూఎస్-సౌదీ పెట్టుబడి ఫోరమ్లో పాల్గొన్న ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కూడా పాల్గొన్నారు.

ట్రంప్ ఏం చెప్పారంటే..
ఈ ఏడాది మే నెలలో భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలను “తగ్గించడానికి తాను సహాయం చేశానని” మరోసారి నొక్కి చెప్పారు. అయితే, ఈ వ్యవహారంలో ఏ మూడవ పక్షం జోక్యాన్ని తాము అంగీకరించబోమని భారత్ చాలా స్పష్టంగా తిరస్కరించిన విషయాన్ని ఆయన ప్రస్తావించలేదు.
“నేను వివాదాలను పరిష్కరించడంలో మంచివాడిని, ఎప్పుడూ అదే చేశాను. చాలా సంవత్సరాలుగా నేను చాలా బాగా చేశాను. భారత్, పాకిస్తాన్... అణు ఆయుధాలతో యుద్ధానికి దిగబోతున్నప్పుడు...” అని ట్రంప్ బుధవారం వ్యాఖ్యానించారు.
ఇదే వేదికపై, రెండు అణుశక్తి దేశాలకు తాను బెదిరించినట్లు ట్రంప్ పేర్కొన్నారు. “మీరు యుద్ధానికి వెళ్లవచ్చు, కానీ నేను ప్రతి దేశంపై 350 శాతం టారిఫ్లు విధిస్తాను. ఇకపై యునైటెడ్ స్టేట్స్తో ఎలాంటి వాణిజ్యం ఉండదు” అని చెప్పినట్లు ప్రస్తావించారు.
భారత్, పాకిస్తాన్ రెండూ అలాంటి చర్య తీసుకోవద్దని తనను కోరాయని, దీనికి తాను, “నేను ఖచ్చితంగా చేస్తాను. మీరు యుద్ధం ఆపేస్తే, తిరిగి నా దగ్గరికి రండి, నేను టారిఫ్లను తగ్గిస్తాను. కానీ, మీరు అణు ఆయుధాలు పేల్చుకుని, లక్షలాది మంది ప్రజలను చంపుకోవడం, ఆ అణు ధూళి లాస్ ఏంజెల్స్ మీదుగా తేలియాడటం నేను అంగీకరించను” అని స్పష్టం చేసినట్లు ట్రంప్ వివరించారు.
టారిఫ్లను విధించడానికి తాను "అంతా సిద్ధం చేసుకున్నానని" కూడా ట్రంప్ తెలిపారు. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి తాను 350 శాతం రేటును వర్తింపజేస్తానని, వారు యుద్ధాన్ని ఆపితే, "మేము మంచి వాణిజ్య ఒప్పందం చేసుకుంటాము" అని ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్కు చెప్పినట్లు ట్రంప్ పేర్కొన్నారు.
“మరే ఇతర అధ్యక్షుడు అలా చేసి ఉండేవారు కాదు... నేను ఈ యుద్ధాలన్నింటినీ పరిష్కరించడానికి టారిఫ్లను ఉపయోగించాను. నా హయాంలో జరిగిన ఎనిమిది వివాదాలలో ఐదు ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, టారిఫ్ల కారణంగానే పరిష్కరానికి నోచుకున్నాయి” అని ఆయన గర్వంగా చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కూడా, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ సూసీ వైల్స్ ముందు తనకి ఫోన్ చేసి కృతజ్ఞతలు చెప్పారని ట్రంప్ తెలిపారు.
“తర్వాత నాకు ప్రధానమంత్రి మోదీ నుండి ఒక కాల్ వచ్చింది. 'మేము ఆగిపోయాము' అని ఆయన అన్నారు. నేను, 'ఏం ఆగిపోయారు?' అని అడిగాను” అని ట్రంప్ చెప్పుకొచ్చారు. దానికి మోదీ “మేము యుద్ధానికి వెళ్లడం లేదు” అని సమాధానం ఇచ్చారని ట్రంప్ చెప్పారు.
ఆ తరువాత, తాను మోదీకి ధన్యవాదాలు చెప్పి, “మంచి ఒప్పందం చేసుకుందాం” అని ప్రతిస్పందించినట్లు ట్రంప్ వివరించారు.
మిలియన్ల కొద్దీ ప్రజలను ఇతర యుద్ధాలలో కూడా తాను కాపాడినట్లు చెప్పిన ట్రంప్, అంతకుముందు రోజు ఒవల్ ఆఫీస్లో సౌదీ క్రౌన్ ప్రిన్స్తో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో కూడా ఈ భారత్-పాకిస్తాన్ దావాను పునరుద్ఘాటించినట్లు తెలిపారు.
60 సార్లు... సంఖ్య పెరుగుతూనే ఉంది:
మే 10న, వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో జరిగిన “సుదీర్ఘ రాత్రి” చర్చల తర్వాత భారత్, పాకిస్తాన్లు “పూర్తి, తక్షణ” కాల్పుల విరమణకు అంగీకరించాయని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆ తర్వాత నుంచి, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను “తగ్గించడానికి తాను సహాయం చేశానని” ఆయన 60 సార్లకు పైగా పునరుద్ఘాటించారు.
భారత్ వైఖరి ఇదే:
పహల్గామ్ దాడిలో 26 మంది పౌరులు మరణించినందుకు ప్రతీకారంగా, భారత్ మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని 'ఆపరేషన్ సిందూర్'ను ప్రారంభించింది.
పాకిస్తాన్ నుండి వచ్చిన అభ్యర్థన మేరకు, ఇరు దేశాల సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్స్ (DGMOలు) మధ్య జరిగిన ప్రత్యక్ష చర్చల ద్వారానే మే 10న కాల్పుల విరమణపై అవగాహన కుదిరిందని భారత్ పదేపదే స్పష్టం చేసింది. ఈ విషయంలో ఏ మూడో పక్షం జోక్యాన్ని తాము అంగీకరించబోమని ఢిల్లీ తేల్చి చెప్పింది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper


