...
...
Next Story

చనిపోయిన ఉగ్రవాదులకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు: ఐసిస్ స్థావరాలపై భీకర దాడి

నైజీరియాలో క్రైస్తవులను లక్ష్యంగా చేసుకున్న ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం విరుచుకుపడింది. క్రిస్మస్ వేళ జరిగిన ఈ దాడిపై అధ్యక్షుడు ట్రంప్ స్పందిస్తూ, హింసను ఆపకపోతే ఉగ్రవాదులకు నరకం చూపిస్తామని ఘాటుగా హెచ్చరించారు.

Published on: Dec 26, 2025, 08:31:01 IST
Advertisement

నైజీరియాలోని ఐసిస్ (ISIS) ఉగ్రవాద ముఠాలే లక్ష్యంగా అమెరికా సైన్యం అత్యంత శక్తివంతమైన, ప్రాణాంతకమైన దాడులు నిర్వహించింది. క్రిస్మస్ పండుగ వేళ జరిగిన ఈ ఆపరేషన్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ధృవీకరించారు. వాయువ్య నైజీరియాలో అమాయక క్రైస్తవులను ఊచకోత కోస్తున్న "ఐసిస్ ఉగ్రవాద వ్యర్థాల"పై ఈ దాడులు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

చనిపోయిన ఉగ్రవాదులకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు: ఐసిస్ స్థావరాలపై భీకర దాడి (AP)
చనిపోయిన ఉగ్రవాదులకు ట్రంప్ క్రిస్మస్ శుభాకాంక్షలు: ఐసిస్ స్థావరాలపై భీకర దాడి (AP)

అమెరికా సైన్యాధ్యక్షుడి (Commander in Chief) హోదాలో తానే స్వయంగా ఈ దాడులకు ఆదేశాలిచ్చానని ట్రంప్ వెల్లడించారు. "చాలా ఏళ్లుగా, కొన్ని శతాబ్దాలుగా ఎన్నడూ లేని విధంగా నైజీరియాలో క్రైస్తవులపై దాడులు జరుగుతున్నాయి. ఈ హింసను ఆపకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని నేను గతంలోనే హెచ్చరించాను. ఈ రాత్రి అదే జరిగింది" అని ట్రంప్ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు.

"చనిపోయిన ఉగ్రవాదులకు మెర్రీ క్రిస్మస్"

తన ప్రకటనలో ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలాన్ని వాడారు. అమెరికా రక్షణ శాఖ ఈ ఆపరేషన్‌ను అత్యంత ఖచ్చితత్వంతో పూర్తి చేసిందని కొనియాడారు. తన నాయకత్వంలో ఉగ్రవాద ముఠాల పట్ల అమెరికా రాజీలేని పోరాటం చేస్తుందని నొక్కి చెప్పారు. "మా సైనికులకు దేవుడి ఆశీస్సులు ఉండాలి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు.. ఆఖరికి చనిపోయిన ఉగ్రవాదులకు కూడా! ఒకవేళ క్రైస్తవుల ఊచకోత ఆగకపోతే, మున్ముందు ఇలా చనిపోయే ఉగ్రవాదుల సంఖ్య ఇంకా పెరుగుతుంది" అంటూ ఘాటుగా హెచ్చరించారు.

అమెరికా ఆఫ్రికా కమాండ్ (AFRICOM) నివేదిక ప్రకారం, ఈ దాడులు డిసెంబర్ 25న నైజీరియాలోని సోకోటో రాష్ట్రంలో జరిగాయి. నైజీరియా ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారు, ఎలాంటి ఆయుధాలు వాడారు అనే వివరాలను వైట్ హౌస్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

హెచ్చరికలు నిజమయ్యాయి..

మరోవైపు, రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ సైతం ఉగ్రవాదులకు బలమైన సంకేతాలు పంపారు. నైజీరియాలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడైనా సరే క్రైస్తవులపై దాడులు జరిగితే ఊరుకోబోమని, మున్ముందు ఇలాంటి దాడులు మరిన్ని ఉంటాయని ఆయన హెచ్చరించారు.

నైజీరియా వాదన ఏమిటి?

నైజీరియాలో ముస్లింలు ఎక్కువగా ఉండే ఉత్తర ప్రాంతం, క్రైస్తవులు అధికంగా ఉండే దక్షిణ ప్రాంతాల మధ్య తరచుగా ఘర్షణలు జరుగుతుంటాయి. అయితే అమెరికా చేస్తున్న ఆరోపణలను నైజీరియా ప్రభుత్వం కొంతవరకు ఖండించింది. ఉగ్రవాద ముఠాలు కేవలం క్రైస్తవులనే కాకుండా, ముస్లింలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నాయని వాదించింది. అయినప్పటికీ, ఉగ్రవాద నిర్మూలన కోసం అమెరికా సైన్యంతో కలిసి పనిచేసేందుకు నైజీరియా అంగీకరించింది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe