Anurag Dobhal : 150 కి.మీ స్పీడ్- ఇన్స్టా లైవ్.. 82వేల మంది చూస్తుండగా ఆత్మహత్యాయత్నం..
ప్రముఖ మోటో వ్లాగర్, బిగ్ బాస్ 17 కంటెస్టెంట్ అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన, ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉంటూనే కారుతో డివైడర్ను ఢీకొట్టి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ కార్లు, వేగంగా దూసుకెళ్లే బైక్లు, మిలియన్ల కొద్దీ ఫాలోవర్లు, దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్'లో అవకాశం.. బయట ప్రపంచానికి అనురాగ్ దోభాల్ (యూకే07 రైడర్) జీవితం ఒక రంగుల కలలా కనిపిస్తుంది. కానీ, ఆ గ్లామర్ వెనుక ఒక మనిషి ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తున్నాడో శనివారం జరిగిన షాకింగ్ ఘటనతో వెలుగులోకి వచ్చింది.

దిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్వేపై శనివారం తన టయోటా ఫార్చ్యూనర్ కారును గంటకు 150 కిలోమీటర్ల పైగా వేగంతో నడుపుతూ ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ఇచ్చారు. కళ్లు ఎర్రబడి, కన్నీళ్లు ఆపుకుంటూ.. తన తల్లికి ఒక ఆవేదన నిండిన సందేశాన్ని ఇచ్చారు. "అమ్మా, వచ్చే జన్మలోనైనా నాకు నీ ప్రేమను ఇవ్వు.. నాకు నీ ప్రేమ చాలా అవసరమైంది," అని ఆవేదన వ్యక్తం చేస్తూనే, ఒక్కసారిగా కారును కుడివైపునకు తిప్పి డివైడర్ బారియర్లను బలంగా ఢీకొట్టారు.
కుటుంబ వేధింపులే కారణమా?
ఈ ప్రమాదానికి కొన్ని రోజుల ముందే అనురాగ్ దోభాల్ 'ది లాస్ట్ మెసేజ్' పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. వేరే కులానికి చెందిన రితికా అనే అమ్మాయిని వివాహం చేసుకున్నందుకు తన కుటుంబ సభ్యులు తనను తీవ్రంగా వేధిస్తున్నారని అందులో ఆరోపించారు.
"గత కొన్ని నెలలుగా నా జీవితం ఊహించని విధంగా మారిపోయింది. జీవితం నన్ను ఇలా పక్కకు పడేస్తుందని ఎప్పుడూ అనుకోలేదు," అని ఆయన కృంగిపోయారు.
తన తల్లిదండ్రులు తన వివాహాన్ని అంగీకరించలేదని, తనను అందరి ముందు కాళ్లావేళ్ల పడమని హింసించారని అనురాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. "మేము సంతోషంగా ఉండం, నిన్ను కూడా ఉండనివ్వం," అని తన తల్లిదండ్రులు అన్నారని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఈ వేధింపుల కారణంగానే తన భార్య రితికా కూడా తనను వదిలి వెళ్లిపోయిందని, ఇప్పుడు తనకు తోడుగా ఎవరూ లేరని అనురాగ్ దోభాల్ ఆవేదన చెందారు.
82,000 మంది చూస్తుండగానే..
శనివారం లైవ్ స్ట్రీమ్ జరుగుతున్నప్పుడు దాదాపు 82,000 మంది నెటిజన్లు ఆయన వీడియోని చూస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న బాధను చూసి చాలామంది ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కానీ, అనురాగ్ ఎవరి మాట వినే స్థితిలో లేరు. "ఇక చివరి ప్రయాణానికి వెళ్దాం" అంటూ స్పీడోమీటర్ను కెమెరా వైపు తిప్పారు. 150 కి.మీ వేగంతో వెళుతున్న కారుతో ఒక బస్సును ఓవర్టేక్ చేసి, "గుడ్ బై" అని అరుస్తూ ఆ వెంటనే వెహికిల్ని డివైడర్కు కేసి కొట్టారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన అనురాగ్ను మీరట్లోని సుభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
బయటి ప్రపంచానికి లగ్జరీ కార్లు, లగ్జరీ లైఫ్లు చూపిస్తున్న యూట్యూబ్- ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెంజర్ల జీవితాల్లో కూడా ఇలాంటి చీకటి కోణాలు ఉంటాయని ఈ ఘటన మరోసారి నిరూపించింది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


