EMIs : మీ జేబుకు చిల్లు పెడుతున్న ‘సైలెంట్​ ఈఎంఐ’! జాగ్రత్తగా లేకపోతే ఆర్థిక భద్రతకే ప్రమాదం!

భారతీయ కుటుంబాలు పెద్ద పెద్ద రుణాల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ, ‘సైలెంట్ ఈఎంఐ’ల రూపంలో జరిగే చిన్నపాటి ఖర్చులను విస్మరిస్తున్నాయి. నెలకు రూ. 99 లేదా రూ. 499 వంటి తక్కువ మొత్తాలుగా కనిపించే ఈ సబ్‌స్క్రిప్షన్లు, ఏడాది తిరిగేసరికి మీ ఆదాయంలో భారీ భాగాన్ని ఎలా హరిస్తున్నాయో వివరించే ప్రత్యేక కథనం..

Published on: Mar 6, 2026, 09:11:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
మీ జేబుకు చిల్లు పెడుతున్న ‘సైలెంట్​ ఈఎంఐ’!
మీ జేబుకు చిల్లు పెడుతున్న ‘సైలెంట్​ ఈఎంఐ’!

తీసుకున్న ప్రధాన రుణాలు, వాటి తిరిగి చెల్లింపుల షెడ్యూల్‌ను మనలో చాలా మంది ఎంతో నిశితంగా గమనిస్తుంటారు. డిఫాల్టర్లుగా మారకూడదనే ఉద్దేశంతో ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. కానీ కొన్ని ఇతర ఖర్చులు మాత్రం అస్సలు ఎవరికీ కనబడవు. వాటినే ఇప్పుడు ‘సైలెంట్ ఈఎంఐలు’ అని పిలుస్తున్నారు. ఇవి విడివిడిగా చూసినప్పుడు చాలా చిన్నవిగా, పెద్దగా భారం కాదన్నట్టు అనిపిస్తాయి. కానీ, ఒక కుటుంబ ఆర్థిక ఆరోగ్యంపై వీటి ప్రభావం ఊహించలేనంత బలంగా ఉంటుంది.

సైలెంట్ ఈఎంఐలు అంటే.. మన కుటుంబ ఆదాయంపై వాటి ప్రభావం ఎలా ఉంటుందో పెద్దగా ఆలోచించకుండానే మనం ఇచ్చే నెలవారీ చెల్లింపుల వాగ్దానాలు. గత దశాబ్ద కాలంలో ఇవి మొబైల్ ఫోన్ బిల్లులు, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు, జిమ్ మెంబర్‌షిప్‌లకే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు ఇవి స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్లు, క్లౌడ్ స్టోరేజ్, ప్రీమియం మెంబర్‌షిప్‌లు, స్మార్ట్‌ఫోన్ ఈఎంఐల వరకు విస్తరించాయి. రూ. 99 లేదా రూ. 499 వంటి చిన్న మొత్తం ఏ హాని చేయదు కదా అని మీరు భావించవచ్చు. కానీ, వీటన్నింటినీ కలిపి చూస్తే, మీకు తెలియకుండానే మీ ఆదాయంలో గణనీయమైన భాగాన్ని ఇవి మింగేస్తున్నాయి.

ఇది అప్పుకు మరో రూపమే!

అప్పు తీసుకోవడం పట్ల ప్రజల ఆలోచనా విధానంలో గత రెండు దశాబ్దాలుగా విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు లోన్ కావాలంటే బ్యాంకు చుట్టూ అనేకసార్లు తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ మీద ఒక చిన్న ట్యాప్ చేస్తే చాలు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం.. క్రెడిట్ కార్డ్ బకాయిలు రూ. 2.8 ట్రిలియన్లను దాటాయి. ఇటీవలి కాలంలో ఇది రెండంకెల వృద్ధిని నమోదు చేస్తోంది.

ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు, ఆన్‌లైన్ షాపింగ్, వినోదం కోసం చేసే చిన్న చిన్న ఖర్చులు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. మనం ప్రతి లావాదేవీని విడివిడిగా చూస్తూ, "ఇంత చిన్న మొత్తానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు," అని మనల్ని మనం ఒప్పించుకుంటాం. అసలు వీటిని అప్పులుగా గుర్తించడమే మనం మానేశాం.

ఇదే ఈ సైలెంట్ ఈఎంఐలను అత్యంత ప్రమాదకరంగా మారుస్తోంది. ఇవి చూడటానికి లోన్ లాగా కనిపించవు, లేదా మీరు అప్పు చేస్తున్నామనే భావనను కలిగించవు. కానీ ఇవి కూడా లోన్​ లాంటివే! రుణాల మాదిరిగానే ఇవి పునరావృతమవుతాయి, మిమ్మల్ని బంధిస్తాయి, మీ ఆర్థిక శక్తిని హరిస్తాయి.

సైలెంట్ ఈఎంఐలను మనం ఎందుకు గుర్తించలేం?

మనం చేసే ఖర్చును మన మెదడు ఎలా అర్థం చేసుకుంటుందనే దానిపై ఆధారపడి మనం అనేక సైలెంట్ ఈఎంఐలపై సంతకం చేస్తాం. రూ. 5,000 అంటే మనకు చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తుంది, కానీ నెలకు రూ. 499 అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది. మనం డబ్బును ఎప్పుడూ 'నెలకు' ఎంత అని ఆలోచిస్తాం తప్ప, 'సంవత్సరానికి' ఎంత అని ఆలోచించం.

మూడు సాధారణ ప్రవర్తనా విధానాలు ఈ చిన్న ఒప్పందాలు భారీగా పెరగడానికి కారణమవుతున్నాయి:

చిన్న ఖర్చులను నార్మలైజ్​ చేయడం: ఒకేసారి రూ. 99, రూ. 249 లేదా రూ. 499 ఖర్చు చేయడం సులభం. కానీ అలాంటి 10 చిన్న కమిట్‌మెంట్లు నెలకు వేల రూపాయలుగా మారుతాయి.

ఆటోమేటిక్ రెన్యూవల్స్: ఇది ఆటోమేషన్ యుగం. అందుకే చాలా వరకు సైలెంట్ ఈఎంఐలు యంత్రాల ద్వారానే నిర్వహించడం జరుగుతోంది. చిన్నపాటి పునరావృత చెల్లింపులకు ప్రతిసారీ కొత్త అనుమతులు అవసరం లేదని నిబంధనలు చెబుతుంటాయి. ఈ సౌలభ్యం మన అప్రమత్తతను తగ్గిస్తోంది.

స్థోమత అనే భ్రమ: రూ. 80,000 ఫోన్ ఖరీదైనదిగా అనిపిస్తుంది. కానీ, నెలకు రూ. 2,000 ఈఎంఐ అంటే అందుబాటులో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇక్కడ దృష్టి అసలు ధర నుంచి 'చెల్లింపు సౌలభ్యం' వైపు మళ్లుతుంది.

ఒక మధ్యతరగతి కుటుంబంపై దీని ప్రభావం ఎలా ఉంటుంది?

మెట్రో సిటీలో ఉండే ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే.. వారి నెలవారీ సైలెంట్ ఈఎంఐలు ఇలా ఉండవచ్చు:

స్ట్రీమింగ్ సబ్‌స్క్రిప్షన్లు: రూ. 1,200

మొబైల్, ఇంటర్నెట్: రూ. 2,000

క్లౌడ్ స్టోరేజ్, యాప్ సబ్‌స్క్రిప్షన్లు: రూ. 300

జిమ్ + ట్రైనర్ ఫీజు: రూ. 2,000

స్మార్ట్‌ఫోన్ ఈఎంఐ: రూ. 2,000

కేవలం ఇవి మాత్రమే నెలకు రూ. 7,500 లేదా సంవత్సరానికి రూ. 90,000 అవుతున్నాయి.

ఆర్బీఐ తాజా గృహ ఆర్థిక గణాంకాల ప్రకారం.. సగటు భారతీయ కుటుంబం తన ఆదాయంలో కేవలం 5-6% మాత్రమే ఆదా చేస్తోంది. సైలెంట్ ఈఎంఐలు మీ సంపాదనను నిశ్శబ్దంగా హరిస్తూ, మీ దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడాన్ని కష్టతరం చేస్తాయి. మీ భవిష్యత్తును నిర్మించుకోవడానికి ఉపయోగించాల్సిన డబ్బును, కేవలం అందుబాటులో ఉన్నట్లు కనిపించే సౌకర్యాలు, వినోదం, విలాసవంతమైన వస్తువుల కోసం వాడుతున్నారు.

స్థిరమైన ఈఎంఐలు ఎక్కువగా ఉండటం వల్ల, కుటుంబాలకు ఆర్థిక నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తగ్గుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు పెట్టుబడి పెట్టడం, చిన్న బ్రేక్ తీసుకోవడం, ఉద్యోగాలు మారడం లేదా శాలరీ అకౌంట్‌ను ఒక బ్యాంక్ నుంచి మరొక దానికి మార్చడం కూడా కష్టమవుతుంది.

సైలెంట్ ఈఎంఐల ఉచ్చు నుంచి బయటపడటం ఎలా?

దీనికి పరిష్కారం కేవలం ఎక్కువ సంపాదించడంలో లేదు, అవగాహన, క్రమశిక్షణలో ఉంది:

మీ సబ్‌స్క్రిప్షన్లను ఆడిట్ చేయండి: మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, యూపీఐ లావాదేవీలు, క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను తనిఖీ చేయండి. గత రెండు నెలలుగా మీరు ఉపయోగించని వాటిని వెంటనే రద్దు చేయండి.

ఒకటి కొనండి - ఒకటి వదిలేయండి : ఒక కొత్త సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే, పాత దానిని రద్దు చేయండి. మీ వనరులను బాధ్యతాయుతంగా నిర్వహించడానికి సర్దుబాట్లు చాలా అవసరం.

ఈఎంఐలకు పరిమితులు విధించండి: ఈఎంఐలను పూర్తిగా తొలగించడం కష్టం కావచ్చు. అందుకే మీ ఆదాయంలో సైలెంట్ ఈఎంఐలతో పాటు మొత్తం ఈఎంఐలు 10% మించకుండా పరిమితి విధించుకోండి.

మీ ఆలోచనా విధానాన్ని మార్చుకోండి: మీ జీతం లేదా లాభాలలో ఎక్కువ భాగం ఈఎంఐలకే పోతుంటే మీరు బందీగా ఉన్నట్లే. సైలెంట్ ఈఎంఐలను తగ్గించడం అంటే త్యాగం చేయడం కాదు, స్పష్టతతో మీ స్వేచ్ఛను తిరిగి పొందడం.

సైలెంట్ ఈఎంఐలు మీ ఆర్థిక వ్యవస్థనే కాకుండా మీ ఆలోచనలను కూడా గజిబిజి చేస్తాయి. ఆర్థిక స్వేచ్ఛ అనేది పెద్ద నిర్ణయాలతో మొదలవ్వదు, అది అవగాహనతో మొదలవుతుంది. మీ దగ్గరి నుంచి పోయే ప్రతి రూ. 199 లేదా రూ. 499 ఎక్కడికి వెళుతుందో మీకు తెలియాలి. మనం సైలెంట్ ఈఎంఐలను తగ్గించినప్పుడు లేదా తొలగించినప్పుడు మాత్రమే మన డబ్బు మన కోసం పనిచేయడం ప్రారంభిస్తుంది.

-రా మా పళనయప్పన్​, జీరో ఈఎంఐ.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More