వచ్చే కేంద్ర బడ్జెట్లో కేవలం ఆసుపత్రుల విస్తరణపైనే కాకుండా, తల్లీబిడ్డల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని డాక్టర్ కృష్ణ ప్రసాద్ వున్నం అభిప్రాయపడ్డారు. గతేడాది వైద్యారోగ్యం, వైద్య విద్యకు నిధుల కేటాయింపు పెంచడం శుభపరిణామమని పేర్కొన్న ఆయన, ఈసారి మరింత స్పష్టమైన ప్రణాళిక అవసరమని నొక్కి చెప్పారు.

క్షేత్రస్థాయిలో వైద్య సేవల బలోపేతం గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ప్రసూతి, నవజాత శిశువుల సంరక్షణ, పీడియాట్రిక్ వైద్యానికి భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో ప్రారంభ స్క్రీనింగ్ పరీక్షలు, పోషకాహార పథకాలు, హై-రిస్క్ గర్భధారణ నిర్వహణ, నవజాత శిశువుల ఐసీయూ (NICU) సదుపాయాలపై బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఇవి మరణాల రేటును తగ్గించడమే కాకుండా, భవిష్యత్ తరాల దీర్ఘకాలిక ఆరోగ్యానికి పునాది వేస్తాయని వివరించారు.
నెట్వర్క్ బలోపేతం చేయాలి
చిన్న పట్టణాలపై ప్రత్యేక దృష్టి "టైర్-2, టైర్-3 నగరాల్లో సమయానికి వైద్యం అందేలా డిజిటల్ హెల్త్ సిస్టమ్స్, రిఫరల్ నెట్వర్క్లను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. అలాగే నిపుణులైన వైద్య సిబ్బందిని తయారు చేసేలా నైపుణ్యాభివృద్ధికి మద్దతు ఇవ్వాలి" అని డాక్టర్ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
వ్యాధి నివారణ చర్యలు (Preventive care), నాణ్యమైన ప్రమాణాలు, గర్భం దాల్చినప్పటి నుండి శిశువు ఎదుగుదల వరకు నిరంతర సంరక్షణను అందించేలా బడ్జెట్ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అప్పుడే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమని, తద్వారా దేశ వైద్య వ్యవస్థ మరింత పటిష్టంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు.