Crime news : పిల్లల కళ్ల ముందే భార్యను కిరాతకంగా చంపిన భర్త! 8 నెలల గర్భవతి అని కూడా చూడకుండా..
Crime news : ఉత్తరప్రదేశ్లోని మహోబాలో దారుణం జరిగింది. తాగుడు, జూదానికి బానిసైన ఓ వ్యక్తి, గొడవ పడి ఎనిమిది నెలల గర్భిణి అయిన భార్యను.. తన ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురి కళ్లముందే కొడవలితో నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఉత్తర్ప్రదేశ్ మహోబా జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. మద్యపానానికి, జూదానికి బానిసైన ఒక వ్యక్తి, కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన భార్యను.. ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె కళ్లముందే అత్యంత దారుణంగా నరికి చంపాడు! మృతురాలు ఎనిమిది నెలల గర్భిణి అని తెలిసి కూడా ఆ కిరాతకానికి ఒడిగట్టాడు.

మహోబాలోని పాన్వారీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిజ్రారీ గ్రామంలో ఈ ఘోరం జరిగింది. నిందితుడిని హనీఫ్ మన్సూరీగా, బాధితురాలిని మనీషాగా పోలీసులు గుర్తించారు.
తాగుడు వద్దన్నందుకు కొడవలితో దాడి!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు హనీఫ్ మన్సూరీ తాగుడు, జూదానికి తీవ్రంగా అలవాటు పడ్డాడు. తన వ్యసనాల కోసం ఇప్పటికే కుటుంబానికి ఉన్న పొలాన్ని కూడా అమ్మేశాడు. శనివారం రాత్రి అతడు బాగా తాగి ఇంటికి వచ్చాడు. మళ్లీ మద్యం సేవించబోతుండగా భార్య మనీషా అతడిని వారించింది.
దీనితో కోపం తెచ్చుకున్న హనీఫ్, ఇంట్లోని కొడవలి తీసుకుని ఎనిమిది నెలల గర్భిణి అని కూడా చూడకుండా భార్యపై దాడి చేశాడు. తల, చేతులు, శరీరంపై విచక్షణారహితంగా నరకడంతో మనీషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఈ ఘోరం అంతా వారి ఐదేళ్ల కొడుకు, రెండేళ్ల కూతురి కళ్లముందే జరిగింది!
బాలుడు ఇచ్చిన సాక్ష్యంతో చిక్కిన నిందితుడు..
హత్య చేసిన తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి డ్రామా ఆడటానికి ప్రయత్నించాడు. అయితే, కళ్లముందే తల్లి హత్యను చూసి తీవ్ర భయాందోళనకు గురైన ఐదేళ్ల బాలుడు జరిగిందంతా పోలీసులకు చెప్పాడు. బాధితురాలి కుమారుడు ఇచ్చిన సాక్ష్యంతో నిజం వెలుగులోకి వచ్చింది. పాన్వారీ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్ నిందితుడిని తీవ్రంగా విచారించగా నేరం అంగీకరించడంతో వెంటనే అరెస్ట్ చేశారు.
అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
వేధింపులే అలవాటుగా మార్చుకున్నాడు: కుటుంబసభ్యులు
హనీఫ్కు అనుమానాస్పద బుద్ధి ఎక్కువని, చిన్న చిన్న విషయాలకే తన సోదరిని శారీరకంగా చిత్రహింసలకు గురిచేసేవాడని మృతురాలి సోదరుడు నసీమ్ మన్సూరీ ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలో పలుమార్లు ఇంట్లో నుంచి వెళ్లగొట్టడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారని, కానీ కుటుంబం నిలవాలనే ఉద్దేశంతోనే తన సోదరి తిరిగి భర్త దగ్గరికి వెళ్లిందని చెప్పాడు.
"2021లో పెళ్లయిన నా చెల్లెలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఎనిమిది నెలల గర్భిణి. తాగి వచ్చి నా చెల్లెలిని కొడవలితో దారుణంగా చంపేశాడు. నిందితుడికి చట్ట ప్రకారం కఠినమైన శిక్ష పడాలి," అని నసీమ్ డిమాండ్ చేశాడు.
నిందితుడి మామ షాకిర్ మాట్లాడుతూ.. తాము హనీఫ్కు ఎన్నోసార్లు నచ్చజెప్పడానికి ప్రయత్నించామని, అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని బాధపడ్డాడు.
తండ్రిని కూడా ఇంట్లోంచి వెళ్లగొట్టిన నిందితుడు..!
నిందితుడు హనీఫ్ చేసిన దారుణంపై సొంత తండ్రి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నాలుగేళ్ల క్రితమే కొడుకు తనను ఇంట్లోంచి వెళ్లగొట్టాడని చెప్పాడు. "నా కొడుకు తీవ్రమైన నేరానికి పాల్పడ్డాడు. అతనికి ఉరిశిక్ష పడినా ఫర్వాలేదు, కఠినంగా శిక్షించాల్సిందే," అని ఆయన స్పష్టం చేశారు.
ఆ ఇద్దరు పసిపిల్లలను తానే పెంచుకుంటానని ఆయన హామీ ఇచ్చాడు.
ఈ ఘటనపై కుల్ పహాడ్ సర్కిల్ ఆఫీసర్ అనిరుధ్ సింగ్ స్పందిస్తూ.. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, కేసు విచారణ శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


