యూపీలో షాకింగ్ ఘటన- భర్తను ఇరికించెందుకు భార్య కుట్ర, 'గోమాంసం'తో..
భార్యాభర్తల గొడవ నేపథ్యంలో భర్తను జైలుకు పంపేందుకు ఒక మహిళ చేసిన కుట్ర లక్నోలో కలకలం రేపింది. గోమాంసం కేసులో అమాయకుడిని ఇరికించే ప్రయత్నం బెడిసికొట్టగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులు సస్పెన్షన్కు గురయ్యారు.
ఉత్తర్ప్రదేశ్ లక్నోలో అనుమానిత గోవధ కేసుగా ప్రారంభమైన దర్యాప్తు, ఇప్పుడు ఒక లోతైన నేరపూరిత కుట్రగా మలుపు తిరిగింది. వైవాహిక వివాదాల నేపథ్యంలో, ఒక వ్యక్తిని ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆధారాలతో రెండుసార్లు ఇరికించారని పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. మరోవైపు, ఈ కేసులో నిందితురాలిగా ఉన్న మహిళను హైకోర్టు ప్రాంగణం లోపలి నుంచి అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించిన ముగ్గురు పోలీసు సిబ్బందిని పైఅధికారులు సస్పెండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..
ఈ వివాదం జనవరి 14న వెలుగులోకి వచ్చింది. లక్నో శివార్లలో ఒక ఆన్లైన్ పోర్టర్ వాహనాన్ని కాకోరి పోలీసులు అడ్డుకున్నారు. అందిన ముందస్తు సమాచారం మేరకు జరిపిన ఈ తనిఖీలో సుమారు 12 కిలోల అనుమానిత గోమాంసం లభించింది. ఈ డెలివరీని అమీనాబాద్కు చెందిన వ్యాపారి వాసిఫ్ పేరు మీద బుక్ చేశారు. అయితే, ఈ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని వాసిఫ్ ఖరాఖండిగా చెప్పారు. దీనితో పోలీసులు సాంకేతిక విచారణతో పాటు క్షేత్రస్థాయి దర్యాప్తును వేగవంతం చేశారు.
కుట్రను బయటపెట్టిన సాంకేతిక ఆధారాలు..
బుకింగ్, డెలివరీ ప్రక్రియను నిశితంగా పరిశీలించిన పోలీసు అధికారులకు అనేక అనుమానాస్పద అంశాలు కనిపించాయి. వాసిఫ్ను ఈ కేసులో కావాలనే చిక్కుల్లో పడేయడానికి ఈ గోమాంసాన్ని ప్లాన్ చేసి పంపినట్లు దర్యాప్తులో స్పష్టమైంది. ఈ కుట్ర వెనుక వాసిఫ్ భార్య అమీనా, అలాగే మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన ఆమె అనుచరుడు అమాన్ కీలక పాత్ర పోషించారని స్థానిక పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
గతంలోనూ ఇదే తరహా దాడి..
ఈ కుట్ర ఎంత లోతుగా ఉందో తెలుసుకునే క్రమంలో, గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన మరో ఘటనను కూడా పోలీసులు తిరిగి పరిశీలించారు. అప్పట్లో హజ్రత్గంజ్ ప్రాంతంలో పార్క్ చేసి ఉన్న వాసిఫ్ వాహనంలో గోమాంసం లభించడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులకే అతను విడుదలయ్యాడు. అయితే, ఆ సమయంలో జరిగిన అరెస్టు కూడా అతడిని ఇరికించడానికి వేసిన పెద్ద ప్లాన్లో భాగమేనని ఇప్పుడు పోలీసులు బలంగా నమ్ముతున్నారు.
ప్రస్తుతం పోలీసులు అమాన్ను అరెస్టు చేయగా, అమీనా కోసం గాలింపు కొనసాగుతోంది.
కోర్టు ఆవరణలో హైడ్రామా.. పోలీసులపై వేటు..
ఈ కేసు మరో మలుపు తిరుగుతూ, లక్నో హైకోర్టు ప్రాంగణం నుంచి అమీనాను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారనే ఆరోపణలు వచ్చాయి. నిబంధనలను అతిక్రమించారంటూ ఆమె తరపు న్యాయవాది ఫిర్యాదు చేయడంతో, గోమతి నగర్లోని విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లో సంబంధిత పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 329(3) (అక్రమ ప్రవేశం), 351(3) (నేరపూరిత బెదిరింపు), 352 (శాంతి భంగానికి ప్రేరేపించడం) కింద ఈ కేసులు పెట్టారు.
అధికారుల వివరణ..
ఈ ఘటనపై లక్నో వెస్ట్ డీసీపీ విశ్వజీత్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. "ఇందుకు సంబంధించి ముగ్గురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేసి, వారిని రిజర్వ్ పోలీస్ లైన్స్కు పంపాము. భర్తపై జరిగిన నేరపూరిత కుట్రతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన పోలీసుల ప్రవర్తనపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పరారీలో ఉన్న మహిళను పట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాము," అని తెలిపారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


