...
...
Next Story

రూ.2,000 దాటితే యూపీఐ చార్జీలా?: సామాన్యులపై నిబంధనల ప్రభావం ఎంత? సమగ్రంగా తెలుసుకోండి

రూ.2,000 దాటిన కొన్ని రకాల యూపీఐ లావాదేవీలపై 0.4 శాతం చార్జీ పడుతున్నప్పటికీ, వినియోగదారులకు దీని నుంచి ఉపశమనం లభించింది. అసలు ఎవరికి ఎంత భారం పడుతుంది? పెట్రోల్ బంకులు, కరెంట్ బిల్లులు, ఇన్సూరెన్స్ ప్రీమియంల పరిస్థితి ఏమిటో క్లారిటీ ఇచ్చే కథనం.

Published on: Sep 16, 2026, 16:45:04 IST
Advertisement

యూపీఐ (UPI) డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో నూతన మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. కొత్త నిబంధనల ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట మర్చంట్ లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) వర్తిస్తుంది. అయితే, ఈ మార్పులు చూసి సామాన్య వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ పౌరులు చేసే చెల్లింపులపై ఈ ఎండీఆర్ ప్రభావం ఏమాత్రం ఉండదు.

రూ.2,000 దాటితే యూపీఐ చార్జీలా?: సామాన్యులపై నిబంధనల ప్రభావం ఎంత?
రూ.2,000 దాటితే యూపీఐ చార్జీలా?: సామాన్యులపై నిబంధనల ప్రభావం ఎంత?

వ్యక్తుల మధ్య జరిగే (P2P) రోజువారీ బదిలీలు ఎప్పటిలాగే రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉచితంగానే కొనసాగుతాయి. వర్తకులకు చేసే రూ.2,000 లోపు చెల్లింపులపై ఎలాంటి చార్జీలు ఉండవు. దేశంలో జరిగే మొత్తం మర్చంట్ లావాదేవీలలో దాదాపు 96 శాతం డిజిటల్ లావాదేవీలకు ఎండీఆర్ నుంచి మినహాయింపు లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. కేవలం 4 శాతం మేర ఉండే పెద్ద మొత్తాల లావాదేవీలు, కొన్ని నిర్దిష్ట రంగాలు మాత్రమే ఈ పరిధిలోకి వస్తాయి.

వివిధ రంగాలపై ఈ మార్గదర్శకాల ప్రభావం ఎలా ఉంటుందో నిశితంగా పరిశీలిస్తే:

వినియోగదారులు 0.4 శాతం ఎండీఆర్ చెల్లించాలా?

"ఎండీఆర్ అనేది బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, వ్యాపారుల మధ్య జరిగే వ్యవహారం. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సాధారణ వినియోగదారుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకూడదు" అని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సమాచారంలో స్పష్టం చేసింది.

ఈ చార్జీలను వినియోగదారులపైకి నెట్టకుండా చూడాలని బ్యాంకులకు సూచించారు. అదేవిధంగా, యూపీఐ యాప్ ప్లాట్‌ఫామ్‌లు ప్లాట్‌ఫామ్ ఫీజులు లేదా గుప్త చార్జీలు (Hidden charges) విధించడాన్ని ఖచ్చితంగా నిషేధించారు.

రైల్వే టికెట్ల బుకింగ్ ఖరీదవుతుందా?

పెట్రోల్ బంకుల్లో రూ.2,000 కంటే ఎక్కువ మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసినప్పుడు 0.4 శాతం పర్సంటేజ్ లెక్కన కాకుండా ఒకేసారి రూ.5 ప్లాట్ ఎండీఆర్ వర్తిస్తుంది. దీనివల్ల ఎక్కువ మొత్తంలో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసినా భారం శాతాల రూపంలో పెరగదు. రూ.2,000 లోపు చేసే ఇంధన చెల్లింపులపై ఎలాంటి ఎండీఆర్ ఉండదు. ఈ రూ.5 చార్జీని కూడా బంక్ యజమానులు లేదా సిస్టమ్ భరిస్తుందే తప్ప వాహనదారులపై వేయకూడదు.

ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు

ఇన్సూరెన్స్ పాలసీల పునరుద్ధరణ కోసం రూ.2,000 దాటి చెల్లించే ప్రీమియంలపై రూ.5 ప్లాట్ ఎండీఆర్ పడుతుంది. ఇది డిజిటల్ పేమెంట్ సిస్టమ్ అంతర్గతంగా వర్తించేది మాత్రమే కాబట్టి, పాలసీదారులు అదనంగా రూ.5 చెల్లించాల్సిన పనిలేదు.

విద్యుత్, మంచి నీటి బిల్లులు

కరెంట్, వాటర్ బిల్లుల వంటి యుటిలిటీ చెల్లింపులు రూ.2,000 దాటినప్పుడు 0.4 శాతానికి బదులుగా రూ.5 ప్లాట్ ఎండీఆర్ నిబంధన వర్తిస్తుంది. రూ.2,000 లోపు బిల్లులకు పూర్తి మినహాయింపు ఉంటుంది.

పాఠశాలలు, కళాశాలల ఫీజులు

స్కూల్ ట్యూషన్ ఫీజులు, యూనివర్సిటీ టర్మ్ ఫీజులు, ప్రవేశ పరీక్షల ఫీజులు రూ.2,000 దాటినప్పుడు క్యాపింగ్ విధానం లేదా ఫ్లాట్-ఫీ నిర్మాణం అందుబాటులోకి వస్తుంది. "ఫీజుల మొత్తం ఎక్కువగా ఉన్నప్పుడు అధిక శాతంలో చార్జీలు పడకుండా క్యాపింగ్ విధానం దోహదపడుతుంది. రూ.2,000 వరకు ఉండే విద్యా సంబంధిత చెల్లింపులపై సున్నా శాతం ఎండీఆర్ ఉంటుంది" అని అధికారులు వివరించారు.

పూర్తిగా ఉచితంగా ఉండే యూపీఐ లావాదేవీలు ఇవే:

  • వ్యక్తుల నుంచి వ్యక్తులకు (Person-to-Person) జరిగే అన్ని రకాల యూపీఐ బదిలీలు.
  • వర్తకులకు చేసే (Person-to-Merchant) రూ.2,000 లోపు చెల్లింపులు.
  • నెలకు రూ.1 లక్ష వరకు యూపీఐ క్యూఆర్ కోడ్ల ద్వారా స్వీకరించే చిన్న వ్యాపారులకు ఎండీఆర్ పూర్తిగా మినహాయింపు ఉంటుంది.

పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007 ప్రకారం ఈ నూతన విధివిధానాలను రూపొందించినట్లు కేంద్రం వెల్లడించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, బ్యాంకులు మరియు పేమెంట్ యాప్‌లకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడానికి ఈ పెద్ద లావాదేవీల నుంచి వచ్చే ఆదాయం ఉపయోగపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks