...
...
Next Story

UPI Payment Charges : అక్టోబర్ 15 నుంచి రూ.2000 యూపీఐ పేమెంట్‌పై ఛార్జీలు.. ఎవరికి వర్తిస్తుంది?

UPI Payment Charges : యూపీఐ వాడుతున్న వారికి కేంద్రం బిగ్ అప్డేట్ ఇచ్చింది. రూ.2,000ల కంటే ఎక్కువ లావాదేవీలపై ఎండీఆర్ ఖరారు చేసింది.

Published on: Sep 15, 2026, 19:47:33 IST
Advertisement

భారత్‌లో విస్తృతంగా ఉపయోగిస్తున్న డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ వినియోగదారులకు కేంద్రం నుంచి బిగ్ న్యూస్ వచ్చింది. చిన్న తరహా చెల్లింపులు, వ్యక్తిగత నగదు బదిలీలపై ఎలాంటి రుసుములు విధించబోమని స్పష్టం చేసింది. అయితే వ్యాపారులకు(Merchants) సంబంధించి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన పెద్ద లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) రుసుమును విధించే అంశంపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయం తీసుకుంది.

యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు
యూపీఐ ఎండీఆర్ ఛార్జీలు

వ్యాపారులకు వ్యక్తులు రూ.2000 కంటే ఎక్కువ యూపీఐ పేమెంట్స్‌ చేస్తే.. ఆ చెల్లింపులపై 0.4 శాతం ఛార్జీ వర్తిస్తుందని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. అంటే రూ.2000 లోపు పేమెంట్స్ ఎండీఆర్ పరిధిలోకి రావు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫైనాన్షియల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ సెప్టెంబర్ 14న విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ నూతన నిబంధనలు అక్టోబర్ 15 నుండి అమలులోకి రానున్నాయి.

సాధారణ జనాల పరిస్థితేంటి?

ఈ కొత్త విధానం వల్ల సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పటిలాగే యూపీఐ లావాదేవీలు ఉచితంగా చేసుకోవచ్చు. మీరు షాపుల్లో, టీ కొట్టు వద్ద, కూరగాయల మార్కెట్‌లో లేదా కిరాణా షాపుల్లో చేసే సాధారణ యూపీఐ చెల్లింపులపై ఎలాంటి ఛార్జీలు పడవు. ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి (P2P) పంపే డబ్బులపై ఎలాంటి రుసుములు ఉండవు.

బ్యాంకులకు లేదా పేమెంట్ యాప్‌లకు రూ.2,000 వరకు ఉండే యూపీఐ లావాదేవీల పై ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఛార్జీలు వసూలు చేసే అధికారం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. రూపే డెబిట్ కార్డుల ద్వారా జరిగే లావాదేవీలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది.

చిన్న వ్యాపారులు సేఫేనా?

దేశవ్యాప్తంగా జరిగే మొత్తం యూపీఐ లావాదేవీలలో సుమారు 96 శాతం చెల్లింపులు రూ.2,000 కంటే తక్కువ విలువైనవే. వ్యాపార సంస్థలకు జరిగే (P2M) చెల్లింపుల్లో కేవలం 4 శాతం లావాదేవీలు మాత్రమే రూ.2,000 కంటే ఎక్కువ విలువ కలిగి ఉన్నాయి. కాబట్టి మెజారిటీ ప్రజలపై ఈ నిర్ణయం ఎలాంటి ఆర్థిక భారం వేయదు.

భారం ఎవరిపై?

ఈ రుసుమును కేవలం వ్యాపారుల నుంచి మాత్రమే వసూలు చేస్తారు తప్ప కొనుగోలుదారుల (వినియోగదారుల) నుంచి కాదు. ఈ రుసుముల ద్వారా వచ్చే ఆదాయంలో 40 శాతం బ్యాంకులకు, మిగిలిన 60 శాతం మొత్తాన్ని సంబంధిత పేమెంట్ యాప్‌లు, అగ్రిగేటర్లు చెరిసగం పంచుకునేలా ప్రణాళిక రూపొందించారు. రూ.3వేలు పేమెంట్ చేస్తే రూ.12, రూ.50వేలకు రూ.200, రూ.75వేల పైన పేమెంట్ చేస్తే రూ.300లు వ్యాపారులు చెల్లించాలి.

యూపీఐ రికార్డు స్థాయి వృద్ధి

ఎన్‌పీసీఐ నివేదిక ప్రకారం గత ఆగస్టు (2026) ఒక్క నెలలోనే యూపీఐ ద్వారా 2,450 కోట్లకు పైగా లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ దాదాపు రూ.29.82 లక్షల కోట్లు. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో భారత్ సాధించిన ఈ అసాధారణ ప్రగతిని దృష్టిలో ఉంచుకుని, చిన్న వ్యాపారులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను కాపాడటమే లక్ష్యంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదని అధికారులు చెబుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks