...
...
Next Story

క్యూ1 ఫలితాలతో మెరిసిన 'అర్బన్ కంపెనీ': షేరు 18 శాతం అప్

జూన్ త్రైమాసికంలో అంచనాలను మించి బిజినెస్ గ్రోత్ సాధించడంతో అర్బన్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో భారీగా లాభపడ్డాయి. ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర ఏకంగా 18 శాతం పెరిగి, రూ.152తో 12 వారాల గరిష్ఠ స్థాయికి చేరింది.

Published on: Aug 3, 2026, 22:01:22 IST
Advertisement

హోమ్ సర్వీసెస్ రంగంలో ఉన్న 'అర్బన్ కంపెనీ' (Urban Company) జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి తర్వాత స్టాక్ మార్కెట్‌లో దుమ్మురేపింది. మార్కెట్ విశ్లేషకుల అంచనాలను మించి వ్యాపార పురోగతి నమోదు కావడంతో సోమవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో కంపెనీ షేరు ధర 18 శాతం పెరిగి, 12 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.152ని తాకింది.

ఆదాయంలో భారీ వృద్ధి, కానీ నష్టాలు ఎందుకంటే..?

క్యూ1 ఫలితాలతో మెరిసిన 'అర్బన్ కంపెనీ': షేరు 18 శాతం అప్
క్యూ1 ఫలితాలతో మెరిసిన 'అర్బన్ కంపెనీ': షేరు 18 శాతం అప్

గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ (Q1) త్రైమాసికంలో బలమైన నిర్వహణ పనితీరును ప్రదర్శించింది. గతేడాదితో పోలిస్తే కంపెనీ నికర లావాదేవీల విలువ (NTV) 42 శాతం పెరిగి రూ.1,465 కోట్లకు చేరింది. అలాగే నిర్వహణ ద్వారా వచ్చిన ఆదాయం 44 శాతం వృద్ధితో రూ.528 కోట్లుగా నమోదైంది.

కంపెనీ ప్రధాన వ్యాపారం అత్యంత లాభదాయకంగా సాగినప్పటికీ, నూతనంగా ప్రారంభించిన గృహ సహాయక విభాగం 'ఇన్‌స్టాహెల్ప్' (InstaHelp) విస్తరణకు చేసిన భారీ పెట్టుబడులతో పాటు డిఫర్డ్ టాక్స్ భారంతో ఈ త్రైమాసికంలో సంస్థ రూ.92.1 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ.6.9 కోట్ల నికర లాభాన్ని పొందింది.

రికార్డు స్థాయిలో ఆర్డర్లు.. కస్టమర్లు

ఈ త్రైమాసికంలో అర్బన్ కంపెనీ ఏకంగా 1.32 కోట్ల ఆర్డర్లను విజయవంతంగా పూర్తి చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 79 శాతం అధికం. అలాగే సుమారు 12 లక్షల మంది కొత్త వినియోగదారులు ప్లాట్‌ఫామ్‌లోకి వచ్చారు. కంపెనీ చరిత్రలోనే ఒకే త్రైమాసికంలో 10 లక్షలకు పైగా కొత్త కస్టమర్లు రావడం ఇదే తొలిసారి.

భారత్‌లోని కన్స్యూమర్ సర్వీసెస్ విభాగామే కంపెనీకి ప్రధాన ఆదాయ వనరుగా నిలిచింది. ఈ విభాగం ఆదాయం 31 శాతం పెరిగి రూ.356 కోట్లకు చేరగా, NTV 29 శాతం వృద్ధితో రూ.1,056 కోట్లుగా నమోదైంది. వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ ఈ విభాగం వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది.

మరోవైపు, నూతన సేవా విభాగం ఇన్‌స్టాహెల్ప్ కూడా వేగంగా విస్తరిస్తోంది. క్రితం త్రైమాసికంతో పోలిస్తే దీని ఆర్డర్లు 43 శాతం పెరిగి 38.2 లక్షలకు చేరగా, NTV 32 శాతం వృద్ధితో రూ.53 కోట్లను తాకింది. ఆగస్టు 2న ఒక్క రోజే ఈ విభాగంలో లక్షకు పైగా ఆర్డర్లను డెలివరీ చేసి కంపెనీ కొత్త మైలురాయిని చేరుకుంది.

స్టాక్ మార్కెట్లో కోలుకుంటున్న షేరు

మే మధ్యలో నమోదైన కనిష్ఠ స్థాయిల నుంచి అర్బన్ కంపెనీ షేరు బలంగా కోలుకుని, ఇప్పటివరకు 26.6 శాతం లాభపడింది. సెప్టెంబర్ 2025లో ఐపీవో ద్వారా స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ, రూ.103 ఆఫర్ ధరతో వచ్చి 57 శాతం ప్రీమియంతో రూ.162.30 వద్ద లిస్ట్ అయింది. ఆ తర్వాత రూ.201 రికార్డు గరిష్ఠాన్ని తాకిన ఈ షేరు, ప్రస్తుత రికార్డు స్థాయి కంటే ఇంకా 24.5 శాతం తక్కువలోనే ట్రేడ్ అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe