Marco Rubio : మార్కో రూబియో భారత్ పర్యటన.. దిల్లీలో కాకుండా కోల్కతాతో ప్రారంభం! ఎందుకు?
Marco Rubio India visit : సాధారణంగా కీలక విదేశీ నేతలు భారత్కు వస్తే, వారి పర్యటన దిల్లీతో మొదలవుతుంది. కానీ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన మాత్రం ఈసారి కోల్కతాలో ప్రారంభంకానుంది. దీని వెనుక ఒక ఆసక్తికర విషయం ఉంది. కోల్కతా ఘన చరిత్రను ఇది సూచిస్తోంది.
అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాలలో భాగంగా యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మే 23న భారతదేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కోల్కతా, ఆగ్రా, జైపూర్తో పాటు దేశ రాజధాని దిల్లీని సందర్శించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి కోల్కతాలో పర్యటించడం ఇదే తొలిసారి. దీనికి ముందు 2012లో హిల్లరీ క్లింటన్ ఇక్కడ పర్యటించారు. అయితే, సాధారణంగా కీలక విదేశీ నేతల పర్యటనలు దిల్లీలో మొదలవుతాయి. కానీ ఈసారి మార్కో రూబియో కోల్కతాలో పర్యటించనున్నారు. ఎందుకు? దీని వెనుక ఆసక్తి కథ ఉంది.
ఇండియాలో మార్కో రూబియో- దిల్లీ కాకుండా కోల్కతా నుంచే పర్యటన ఎందుకు?
అమెరికా దౌత్య ఇతిహాసంలో కోల్కతా నగరానికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన అమెరికన్ కాన్సులేట్లు ఇక్కడే ఉన్నాయి.
నవంబర్ 19, 1792న అమెరికా మొదటి అధ్యక్షుడు జార్జ్ వాషింగ్టన్.. బెెంజమిన్ జాయ్ను కోల్కతాకు మొదటి యూఎస్ కౌన్సిల్గా నియమించారు.
ఆయన 1794లో భారత్కు చేరుకున్నారు. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీ ఆయనను అధికారికంగా గుర్తించనప్పటికీ, ఈ నియామకమే భారత్-అమెరికా దేశాల మధ్య దౌత్య సంబంధాలకు పునాదిగా నిలిచింది.
కోల్కతాలోని హో చి మిన్ సరణి వీధిలో ఉన్న ఈ కాన్సులేట్ జనరల్.. పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, సిక్కిం, ఈశాన్య రాష్ట్రాలతో అమెరికా సంబంధాలను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ చారిత్రక బంధాన్ని గౌరవిస్తూ, అమెరికా 250వ వసంతాల వేడుకల్లో భాగంగా రూబియో తన పర్యటనను ఇక్కడి నుంచి ప్రారంభిస్తున్నారు.
భారత్కు భారీగా ఇంధన ఎగుమతులు - రూబియో ప్రకటన..
మరోవైపు భారత పర్యటనకు బయలుదేరే ముందు మైదానంలో విలేకరులతో మాట్లాడిన మార్కో రూబియో.. ఇంధన రంగంలో భారత్కు పూర్తి మద్దతు ఇస్తామని ప్రకటించారు. ఇరాన్ యుద్ధం కారణంగా ‘స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్’ మూతపడి భారత్ ఇంధన ధరల ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూబియో వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
"భారతదేశం మాకు అత్యంత గొప్ప భాగస్వామి, నమ్మకమైన మిత్రదేశం. భారత్ ఎంత ఇంధనం (ఎనర్జీ) కొనాలనుకుంటే అంత విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉంది. ప్రస్తుతం యూఎస్ ఇంధన ఉత్పత్తి, ఎగుమతులు చారిత్రాత్మక గరిష్ట స్థాయిల్లో ఉన్నాయి. భారత్తో ఇంధన భాగస్వామ్యాన్ని మరింత పెంచేందుకు చర్చలు జరుపుతున్నాం. వెనిజులా చమురు విషయంలోనూ భారత్కు అవకాశాలు ఉన్నాయి," అని రూబియో స్పష్టం చేశారు.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడు కూడా భారత్కు?
వచ్చే వారం వెనిజులా తాత్కాలిక (ఇంటరిమ్) అధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్ కూడా భారతదేశంలో పర్యటించనున్నట్లు సమాచారం ఉందని, తద్వారా భారత్తో కలిసి పనిచేయడానికి మరిన్ని అవకాశాలు మెరుగవుతాయని రూబియో పేర్కొన్నారు.
మే 26న కీలకమైన ‘క్వాడ్’ సమావేశం..
తన పర్యటన ముగింపు రోజైన మే 26న దిల్లీలో జరగబోయే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ అధ్యక్షత వహించే ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మోటెగి తోషిమిట్సు హాజరుకానున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్లో రక్షణ, భద్రత, చైనా దూకుడును అడ్డుకోవడం వంటి అంశాలపై ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


