Vivo T5 Pro : 9020ఎంఏహెచ్ బ్యాటరీతో వివో కొత్త స్మార్ట్ఫోన్- ఇంకొన్ని రోజుల్లో లాంచ్..
Vivo T5 Pro India launch : స్మార్ట్ఫోన్ మార్కెట్లో ప్రకంపనలు సృష్టించేందుకు వివో సిద్ధమైంది. ఏప్రిల్ 15న భారత్లో విడుదల కానున్న వివో టీ5 ప్రో 5జీ.. అత్యంత శక్తివంతమైన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, గెమర్ల కోసం ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్తో వస్తోంది. దీని ధర, లాంచ్ డేట్, ఫీచర్లపై ఒక లుక్కేయండి..
Vivo T5 Pro price in India : మొబైల్ ఫోన్ వినియోగదారులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బ్యాటరీ బ్యాకప్! ఈ నేపథ్యంలో.. రోజుకు రెండుసార్లు చార్జింగ్ పెట్టే తిప్పలు లేకుండా, ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు మూడు రోజులు నిశ్చింతగా ఉండేలా వివో ఒక భారీ ప్రయోగానికి తెరలేపింది. తన కొత్త మోడల్ వివో టీ5 ప్రో 5జీలో ఏకంగా 9,020ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ ధృవీకరించింది. సాధారణంగా ట్యాబ్లెట్లలో ఉండే ఈ స్థాయి బ్యాటరీని స్మార్ట్ఫోన్లో తీసుకురావడం టెక్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ప్రయాణాలు చేసే వారికి లేదా ఆఫీసు పనిలో బిజీగా ఉండేవారికి ఈ ఫోన్ ‘పవర్ బ్యాంక్’ అవసరం లేకుండానే తోడుంటుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన వివరాలను ఇక్కడ చూసేయండి..
వివో టీ5 ప్రో- గేమింగ్ ప్రియులకు పండగే!
కేవలం బ్యాటరీ మాత్రమే కాదు, ఈ ఫోన్ను పక్కా గేమింగ్ మెషీన్లా వివో తీర్చిదిద్దింది. ఇందులో క్వాల్కమ్ నుంచి వచ్చిన సరికొత్త ఆక్టా-కోర్ స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 4 చిప్సెట్ను వాడారు. అన్టుటు బెంచ్మార్క్ ప్లాట్ఫారమ్పై ఈ ఫోన్ 11,80,000 కంటే ఎక్కువ స్కోరు సాధించడం దీని సత్తాను చాటుతోంది.
ముఖ్యంగా గేమింగ్ సమయంలో కాల్స్ రాకుండా, నోటిఫికేషన్లు ఇబ్బంది పెట్టకుండా 'గేమ్ లోడ్ ఆప్టిమైజేషన్ అల్గారిథమ్'ను జోడించారు. బ్యాటిల్గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ), కాల్ ఆఫ్ డ్యూటీ వంటి భారీ గ్రాఫిక్స్ గేమ్స్లో 90 ఎఫ్పీఎస్ వేగాన్ని, హానర్ ఆఫ్ కింగ్స్ వంటి గేమ్స్లో 120 ఎఫ్పీఎస్ వేగాన్ని ఈ ఫోన్ సునాయాసంగా అందిస్తుంది. "4డీ గేమ్ వైబ్రేషన్" ఫీచర్ గేమర్లకు రియలిస్టిక్ అనుభూతిని ఇస్తుందని వివో ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వేడిని తగ్గించే భారీ కూలింగ్ సిస్టమ్..
గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా ఫోన్ ఎక్కువ సేపు వాడుతున్నప్పుడు వేడెక్కడం సహజం. ఈ సమస్యను అధిగమించడానికి వివో ఈ సెగ్మెంట్లోనే అతిపెద్ద వెపర్ ఛాంబర్ (వీసీ) కూలింగ్ సిస్టమ్ను పరిచయం చేస్తోంది. 7,000 చదరపు మిల్లీమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ కూలింగ్ షీట్, సీపీయూ ఉష్ణోగ్రతను 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గిస్తుంది. దీనివల్ల ఫోన్ హ్యాంగ్ అవ్వదు, పనితీరులో వేగం తగ్గదు. ఈ ధరలో ఇంత పెద్ద కూలింగ్ సిస్టమ్ మరే ఇతర ఫోన్లోనూ లేదని కంపెనీ పేర్కొంది.
ధర ఎంత ఉండవచ్చు?
వివో టీ5 ప్రో 5జీని ఏప్రిల్ 15న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఫ్లిప్కార్ట్ వేదికగా ఈ ఫోన్ అమ్మకాలు జరగనున్నాయి. ఇక ధర విషయానికి వస్తే, ఇది రూ. 37,000 లోపు ధరలో లభించే అవకాశం ఉంది.
బేస్ వేరియంట్: సుమారు రూ. 30,000 వద్ద ప్రారంభం కావచ్చు.
హై-ఎండ్ వేరియంట్ (12జీబీ + 256జీబీ): గరిష్టంగా రూ. 36,999 వరకు ఉండవచ్చని అంచనా.
కాస్మిక్ బ్లాక్, గ్లేసియర్ బ్లూ అనే రెండు అద్భుతమైన రంగుల్లో ఈ ఫోన్ వినియోగదారులను అలరించనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు-
1. వివో టీ5 ప్రో 5జీ లాంచ్ తేదీ ఎప్పుడు?
ఈ స్మార్ట్ఫోన్ ఏప్రిల్ 15, 2026న మధ్యాహ్నం 12 గంటలకు భారతదేశంలో అధికారికంగా విడుదల కానుంది.
2. ఇందులో ఉన్న బ్యాటరీ ప్రత్యేకత ఏంటి?
వివో టీ5 ప్రో 5జీలో ఏకంగా 9,020ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. సాధారణ స్మార్ట్ఫోన్లతో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు శక్తిని ఇస్తుంది.
3. గేమింగ్ కోసం ఈ ఫోన్ ఎలా పనిచేస్తుంది?
ఇందులో స్నాప్డ్రాగన్ 7ఎస్ జెన్ 4 ప్రాసెసర్తో పాటు 120 ఎఫ్పీఎస్ గేమింగ్ సపోర్ట్ ఉంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా 7,000 sq mm భారీ వీసీ కూలింగ్ సిస్టమ్ను అమర్చారు.
4. ఈ ఫోన్ ధర ఎంత ఉండవచ్చు?
మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ ఫోన్ బేస్ మోడల్ రూ. 30,000 నుంచి ప్రారంభమై, టాప్ వేరియంట్ రూ. 36,999 లోపు ఉండే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


