...
...
Next Story

Petrol excise duty : పెట్రోల్​, డీజిల్​పై కేంద్రం సుంకాలను ఎందుకు తగ్గించింది?

Today petrol rate : అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు మండుతున్నా భారత్‌లో ఇంధన ధరలు స్థిరంగా ఉండటం వెనుక ఉన్న కారణాలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి వివరించారు. పన్ను ఆదాయాన్ని వదులుకుని అయినా సరే, భారతీయులను అంతర్జాతీయ ఒడిదుడుకుల నుంచి రక్షించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Published on: Mar 27, 2026 10:30 AM IST
Advertisement

పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ.. భారత్ తీసుకున్న 'పన్నుల తగ్గింపు' నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. ఆయన ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగాస్పందిస్తూ.. ఇది మోదీ ప్రభుత్వ 'దార్శనికత' నిర్ణయం అని కొనియాడారు.

ప్రభుత్వ ముందున్న రెండు ఆప్షన్లు..

ముంబైలోని ఓ పెట్రోల్​ బంకు వద్ద ప్రజలు.. (Bachchan Kumar/ HT PHOTO)
ముంబైలోని ఓ పెట్రోల్​ బంకు వద్ద ప్రజలు.. (Bachchan Kumar/ HT PHOTO)

గత నెల రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి ఏకంగా 122 డాలర్లకు పెరిగిందని మంత్రి గుర్తు చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ముందు రెండు దారులు మాత్రమే ఉన్నాయని ఆయన వివరించారు. అవి..

ప్రపంచంలోని ఇతర దేశాల తరహాలో పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై భారం వేయడం.

లేదా ప్రభుత్వ ఖజానాపై పడే ఆర్థిక భారాన్ని భరిస్తూ, పౌరులకు రక్షణ కవచంలా నిలవడం.

ప్రధాని నరేంద్ర మోదీ రెండో మార్గాన్నే ఎంచుకున్నారని, దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికే పన్నుల కోత విధించారని పూరి స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ధరలు, భారత్‌లో మాత్రం..

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్ తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదో మంత్రి గణాంకాలతో వివరించారు:

ఆగ్నేయాసియా దేశాల్లో ఇంధన ధరలు 30%-50% పెరిగాయి.

ఉత్తర అమెరికాలో 30%, ఐరోపాలో 20%, ఆఫ్రికా దేశాల్లో 50% మేర ధరలు పెరిగాయి.

కానీ, భారత్‌లో మాత్రం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి గత నాలుగేళ్లుగా అనుసరిస్తున్న నిబద్ధతతోనే, ఇప్పుడు కూడా ప్రజలపై పైసా భారం పడకుండా ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని వదులుకుందని ఆయన పేర్కొన్నారు.

చమురు కంపెనీల నష్టాలు - ఎగుమతి సుంకం..

అయిచే ఈ పన్ను కోతల ప్రభావం పౌరుల వరకు ప్రత్యక్షంగా రాకపోవచ్చు. అంటే పెట్రోల్​ బంకుల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు తగ్గకపోవచ్చు. కానీ తాజా పరిస్థితుల్లో నష్టాలు భరిస్తున్న చమురు మార్కెటింగ్​ సంస్థలకు కాస్త ఊరట దక్కినట్టు అవుతుంది.

హైదరాబాద్​లో లీటరు పెట్రోల్​ ధర రూ. 107.50గాను, లీటరు డీజిల్​ ధర రూ. 95.70గాను ఉంది.

ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​పై పన్ను..

విమాన ఇంధనంపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ సుంకాన్ని లీటరుకు రూ. 50గా నిర్ణయించినప్పటికీ, కొన్ని మినహాయింపుల ద్వారా దీనిని రూ. 29.5 వద్ద స్థిరీకరించినట్లు ప్రభుత్వ ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయి.

యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న తరుణంలో, సామాన్య ప్రజల ప్రయోజనాలే పరమావధిగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంత్రి హర్దీప్ పూరి ప్రధాని మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

తరచూ అడిగే ప్రశ్నలు-

1. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా, భారత్‌లో పెట్రోల్ రేట్లు ఎందుకు పెరగలేదు?

జవాబు: అంతర్జాతీయంగా ముడిచమురు ధర బ్యారెల్‌కు 70 డాలర్ల నుంచి 122 డాలర్లకు పెరిగిన మాట వాస్తవం. అయితే, కేంద్ర ప్రభుత్వం తన ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా ఆ భారాన్ని ప్రజలపై పడకుండా చూసింది. ప్రభుత్వం తన పన్ను ఆదాయాన్ని వదులుకుని, చమురు కంపెనీల నష్టాలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ధరలు 30%-50% పెరిగినా, భారత్‌లో మాత్రం స్థిరంగా ఉన్నాయి.

2. ఎగుమతి సుంకం ఎందుకు విధించారు? దీనివల్ల మనకేంటి లాభం?

జవాబు: అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ తరుణంలో మన దేశంలోని రిఫైనరీ కంపెనీలు దేశీయ అవసరాలను పక్కన పెట్టి, లాభాల కోసం విదేశాలకు ఇంధనాన్ని ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనిని అరికట్టడానికి ప్రభుత్వం ఎగుమతి పన్ను విధించింది. దీనివల్ల మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఇంధనం మొదట మన దేశ అవసరాలకే అందుబాటులో ఉండేలా చూడవచ్చు.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe