ఇరాన్​తో ట్రేడ్​ చేస్తే 25శాతం సుంకాలు వేస్తామన్న ట్రంప్​- భారత్​పై ప్రభావం ఎంత?

ఇరాన్‌తో సంబంధాలు కలిగి ఉన్న దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం భారత్, చైనా వంటి దేశాల వాణిజ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Published on: Jan 13, 2026, 10:00:55 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలకు మరోసారి గట్టి హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్‌తో వ్యాపార లావాదేవీలు జరిపే ఏ దేశమైనా, అమెరికాతో చేసే వ్యాపారంపై 25 శాతం అదనపు సుంకం (టారిఫ్) చెల్లించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇరాన్ ప్రభుత్వం తన దేశంలోని నిరసనకారులపై సాగిస్తున్న అణచివేత చర్యలకు నిరసనగా ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్​ తాజా నిర్ణయం భారత్​పై ఎంత ప్రభావం చూపిస్తుంది? అని సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్​..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​..

ఇరాన్​లో నిరసనలు- ట్రంప్​ టారిఫ్​ అస్త్రం..

ఇరాన్‌లో సాగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోగా, వేల సంఖ్యలో ప్రజలు అరెస్టయ్యారు. ఈ హింసను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా ఈ ఆర్థిక అస్త్రాన్ని ప్రయోగించిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

"వెంటనే అమల్లోకి వచ్చేలా.. ఇరాన్‌తో వ్యాపారం చేసే ఏ దేశమైనా అమెరికాతో చేసే లావాదేవీలపై 25 శాతం టారిఫ్ కట్టాలి. ఈ ఆదేశం ఫైనల్​," అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో పేర్కొన్నారు.

కాగా, ఒకవైపు ఆర్థిక ఆంక్షలు విధిస్తూనే, మరోవైపు ఇరాన్‌పై సైనిక చర్యకు కూడా ట్రంప్ వెనుకాడటం లేదని తెలుస్తోంది.

"వాయు దాడులు (ఎయిర్ స్ట్రైక్స్) కూడా మా దగ్గర ఉన్న అనేక ప్రత్యామ్నాయాల్లో ఒకటి," అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ సోమవారం తెలిపారు.

అయితే, అమెరికా ప్రతినిధి స్టీవ్ విట్‌కాఫ్‌తో ఇరాన్ నాయకత్వం రహస్యంగా చర్చలు జరుపుతోందని, బహిరంగంగా చెబుతున్న మాటలకు, వ్యక్తిగత చర్చలకు చాలా తేడా ఉందని ఆమె పేర్కొన్నారు.

భారత్‌పై ప్రభావం ఎంత?

ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కలిగిన జాబితాలో చైనా, యూఏఈ, టర్కీ దేశాలతో పాటు ఇండియా కూడా ఉంది. ఫలితంగా ట్రంప్​ 25శాతం సుంకాల నిర్ణయం భారత్​పైనా పడే అవకాశం ఉంది.

భారత రాయబార కార్యాలయ గణాంకాల ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్-ఇరాన్ మధ్య దాదాపు 1.68 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 15,000 కోట్లు) వ్యాపారం జరిగింది. భారత్ ప్రధానంగా రసాయనాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వస్తువులను ఇరాన్‌కు ఎగుమతి చేస్తోంది.

ఇండియా నుంచి ఇరాన్​కు 512.92 మిలియన్​ డాలర్లు విలువ చేసే ఆర్గానిక్​ కెమికల్స్​ వెళుతున్నాయి. వీటితో పాటు పండ్లు, డ్రై ఫ్రూట్స్​ వంటివి కూడా ఉన్నాయి. వీటి విలువ దాదాపు 311.60 మిలియన్​ డాలర్లు. పలు నివేదికల ప్రకారం చమురు, డిస్టిలేషన్​ ఉత్పత్తులు, మినరల్​ ఫ్యూయెల్స్​ రంగాల్లో కూడా భారత్​- ఇరాన్​ మధ్య లావాదేవీలు జరుగుతున్నాయి.

అయితే, ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న కారణంగా భారతీయ వస్తువులపై అమెరికా 50 శాతం వరకు పన్నులు విధిస్తోంది. ఇప్పుడు తాజాగా ప్రకటించిన 25 శాతం కలిపితే ఈ సుంకాలు 75 శాతానికి చేరే ప్రమాదం ఉంది.

ఉన్న 50శాతం సుంకాలను తగ్గించుకునేందుకే చాలా కాలంగా అమెరికాతో టారిఫ్ ఉపశమనం కోసం చర్చలు జరుపుతున్న భారత్‌కు ఇది పెద్ద ఎదురుదెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

న్యాయస్థానం నిర్ణయంపై ఉత్కంఠ..

ట్రంప్ తీసుకున్న ఈ ప్రపంచవ్యాప్త సుంకాల నిర్ణయంపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సుంకాలు చట్టబద్ధమేనా కాదా అనే విషయంపై కోర్టు బుధవారం తన అభిప్రాయాన్ని వెల్లడించనుంది. ఒకవేళ కోర్టు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకత తెలిపితే, ఇరాన్ మిత్రదేశాలపై ఈ సుంకాలను అమలు చేయడం ఆయనకు కష్టతరంగా మారుతుంది.

కానీ ట్రంప్ దూకుడుతో అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఇప్పుడు ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ముఖ్యంగా భారత్ వంటి మిత్రదేశాల పరిస్థితి 'ముందు నుయ్యి వెనుక గొయ్యి'లా తయారైంది!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More