Minimum monthly pension : నెలవారీ పింఛను రూ. 7,500కి పెంపు? కేంద్రం ఇచ్చిన క్లారిటీ ఇదే..

ఈపీఎస్-95 పెన్షనర్ల ఆశలపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. నెలకు కనీస పెన్షన్‌ను రూ. 1,000 నుంచి రూ. 7,500కి పెంచాలన్న డిమాండ్‌పై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే లోక్‌సభలో వెల్లడించారు.

Published on: Jul 21, 2026, 14:02:52 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ 1995 (ఈపీఎస్-95)లో భాగంగా కనీస పింఛను పెంపు కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది వయోవృద్ధులకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్టకేలకు స్పష్టత వచ్చింది! ప్రస్తుతం ఇస్తున్న కనిష్ట నెలవారీ పింఛను రూ. 1,000ని రూ. 7,500కి పెంచడంతో పాటు కరువు భత్యం (డీఏ) ఇవ్వాలని ఈపీఎస్-95 నేషనల్ అజిటేషన్ కమిటీ సుదీర్ఘకాలంగా పోరాడుతున్న తరుణంలో.. ఈ సున్నితమైన అంశంపై లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రి శోభా కరండ్లజే సమాధానమిచ్చారు.

ఈపీఎస్-95 నెలవారీ పింఛనను కేంద్రం పెంచుతుందా? ((AI-Generated Image))
ఈపీఎస్-95 నెలవారీ పింఛనను కేంద్రం పెంచుతుందా? ((AI-Generated Image))

వివిధ కార్మిక సంఘాలు, ప్రజాప్రతినిధుల నుంచి ఈపీఎస్-95 కనీస పింఛనును పెంచాలని ప్రతిపాదనలు వచ్చిన మాట వాస్తవమేనని మంత్రి అంగీకరించారు. అయితే, పింఛను మొత్తాన్ని రూ. 7,500కి పెంచే విషయమై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయమూ తీసుకోలేదని ఆమె స్పష్టం చేశారు.

పింఛను నిధి నిర్మాణం – కేంద్రం ఇచ్చే మద్దతు

పింఛను మొత్తాన్ని పెంచేందుకు వీలుగా అదనపు బడ్జెట్ కేటాయింపులు గానీ, లేదా పెన్షన్ ఫండ్ నిధి పునర్వ్యవస్థీకరణ గానీ ప్రభుత్వం చేస్తుందా అని లోక్‌సభ సభ్యులు ప్రశ్నించారు.

దీనికి స్పందిస్తూ.. ఈపీఎస్ పథకం అనేది "నిర్ణీత విరాళం – నిర్ణీత ప్రయోజనం" (Defined Contribution–Defined Benefit) ఆధారంగా నడిచే సామాజిక భద్రతా పథకమని మంత్రి వివరించారు. ఈ పెన్షన్ ఫండ్ నిధి ప్రధానంగా రెండు రకాల విరాళాలతో రూపొందుతుందని చెప్పారు:

యజమానుల వాటా: ఉద్యోగి వేతనంలో 8.33 శాతం ఫండ్‌కు జమ అవుతుంది.

కేంద్ర ప్రభుత్వ వాటా: నెలకు రూ. 15,000 వేతన పరిమితికి లోబడి బడ్జెట్ మద్దతు ద్వారా 1.16 శాతం నిధులు సమకూరుతాయి.

ఈ జమ అయిన మొత్తం నుంచే పింఛనుదారులకు ప్రయోజనాలన్నీ చెల్లిస్తున్నామని మంత్రి తెలిపారు. పథకం నిబంధనల ప్రకారం ప్రతి ఏటా నిధి విలువను సమీక్షిస్తామని పేర్కొన్న ఆమె, గతంలో ఉన్న ఈపీఎస్-1995 స్థానంలో కొత్తగా 'ఈపీఎస్, 2026' నిబంధనలు అమలులోకి వచ్చాయని సభకు తెలియజేశారు.

రూ. 1,000 కనీస పెన్షన్‌కు బడ్జెట్ తోడ్పాటు!

ఈపీఎస్ పింఛనుదారులకు నెలకు ఇచ్చే కనీస పింఛను రూ. 1,000 హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా నేరుగా ఆర్థిక సాయం అందిస్తోందని కరండ్లజే ప్రస్తావించారు. ఈ బడ్జెట్ తోడ్పాటు అనేది ఈపీఎఫ్ఓకి ప్రభుత్వం ప్రతి ఏటా చెల్లించే 1.16 శాతం వేతన విరాళానికి పూర్తిగా అదనమైనదని ఆమె వివరించారు.

పెంపుపై నిర్దిష్ట గడువు లేదు!

లక్షలాది మంది వయోవృద్ధుల జీవన ప్రమాణాలకు సంబంధించిన ఈ డిమాండ్‌పై ప్రభుత్వం ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటుందని ప్రశ్నించగా.. మంత్రి నిర్దిష్టమైన సమయ పరిమితి ఏదీ వెల్లడించలేదు.

"ఈపీఎఫ్ఓ సభ్యుల సామాజిక భద్రతను బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అయితే పింఛను నిధి దీర్ఘకాలిక మనుగడ, భవిష్యత్తులో వచ్చే ఆర్థిక బాధ్యతలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది," అని శోభా కరండ్లజే తేల్చారు.

ప్రభుత్వం నుంచి తక్షణ పెంపుపై హామీ రాకపోవడంతో, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చుల మధ్య రూ. 1,000 పింఛనుతో నెట్టుకొస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు మళ్లీ ఎదురుచూపులే మిగిలాయి!

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More