Women's Day 2026 : బంగారంపై మోజు తగ్గుతోందా? భారతీయ మహిళలు ఎక్కువగా ఇన్వెస్ట్​ చేస్తోంది ఇందులోనే..

Investments for Woman : పెరుగుతున్న ఆర్థిక స్వతంత్రతతో భారతీయ మహిళలు ఇప్పుడు సంప్రదాయ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం కంటే రియల్ ఎస్టేట్ వైపు మొగ్గు చూపుతున్నారు. సుమారు 66% మంది మహిళలు ప్రాపర్టీనే అత్యుత్తమ పెట్టుబడిగా భావిస్తున్నట్లు అన్‌రాక్ కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే వెల్లడించింది.

Published on: Mar 8, 2026, 10:00:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ మహిళల్లో పెరుగుతున్న ఆర్థిక స్వతంత్రత, అధిక రాబడినిచ్చే ఆస్తుల పట్ల మక్కువ వారి.. పెట్టుబడి ధోరణిని పూర్తిగా మారుస్తోంది. ఒకప్పుడు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బంగారం వంటి సంప్రదాయ మార్గాలకే పరిమితమైన మహిళలు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి జై కొడుతున్నారు. అన్‌రాక్ సంస్థ నిర్వహించిన తాజా కన్స్యూమర్ సెంటిమెంట్ సర్వే ప్రకారం, సుమారు 66శాతం మంది మహిళలు రియల్ ఎస్టేట్‌ను తమ మొదటి ప్రాధాన్యత కలిగిన పెట్టుబడి సాధనంగా ఎంచుకుంటున్నారు.

మహిళలు అధికంగా ఇన్వెస్ట్​ చేస్తోంది ఎక్కడో తెలుసా?
మహిళలు అధికంగా ఇన్వెస్ట్​ చేస్తోంది ఎక్కడో తెలుసా?

పోర్ట్‌ఫోలియోలలో బంగారం, ఎఫ్‌డీలకు ఇప్పటికీ స్థానం ఉన్నప్పటికీ, స్టాక్ మార్కెట్ పట్ల మహిళా ఇన్వెస్టర్లలో ఆసక్తి చాలా తక్కువగా ఉంది. కేవలం 3శాతం మంది మాత్రమే స్టాక్ మార్కెట్‌ను ఒక ఎంపికగా పరిగణిస్తున్నారని ఈ సర్వే పేర్కొంది.

హై నెట్-వర్త్ విభాగంలో పెరుగుదల..

భారతదేశంలో 'హై-నెట్-వర్త్' విభాగంలో మహిళల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది ప్రాపర్టీ డిమాండ్‌ను మరింత పెంచుతోంది. ఈ మార్పునకు ప్రతిబింబంగా, దాదాపు 61% మంది మహిళా గృహ కొనుగోలుదారులు ఇప్పుడు రూ. 90 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన ఇళ్ల కోసం చూస్తున్నారు. 2019లో ఈ సంఖ్య కేవలం 25% మాత్రమే ఉండటం గమనార్హం.

ఆర్థిక భద్రతను కోరుకోవడం నుంచి ప్రీమియం, లగ్జరీ ఇళ్లను సొంతం చేసుకోవాలనే ఆకాంక్ష వరకు, భారతదేశ రియల్ ఎస్టేట్ రూపురేఖలను మార్చడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని సర్వే తెలిపింది.

ధరల వారీగా ప్రాధాన్యతలు..

సుమారు 37శాతం మంది మహిళలు రూ. 90 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల మధ్య ఉన్న ప్రాపర్టీల కోసం చూస్తున్నారు.

14% మంది రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2.5 కోట్ల మధ్య ధర కలిగిన ఇళ్లను ఇష్టపడుతున్నారు.

ఆసక్తికరంగా, కనీసం 10శాతం మంది రూ. 2.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లను కొనాలని భావిస్తున్నారు. ఇది దేశంలో పెరుగుతున్న మహిళా హెచ్ఎన్ఐ బలానికి నిదర్శనం.

2019 సర్వేలో 75శాతం మంది మహిళలు రూ. 90 లక్షల లోపు ఉండే అఫార్డెబుల్, మిడ్-సెగ్మెంట్ ఇళ్లకే మొగ్గు చూపేవారు.

బంగారం వర్సెస్​ రియల్ ఎస్టేట్..

నేడు 71% కంటే ఎక్కువ మంది మహిళలు పెట్టుబడి కోసం రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్‌ను ఇష్టపడుతున్నారు. 2019లో స్టాక్ మార్కెట్‌ను 20% మంది ఇష్టపడగా, ఇప్పుడు అది కేవలం 3 శాతానికి పడిపోయింది. మరోవైపు, బంగారం ప్రాధాన్యత ఇప్పుడు 18 శాతం ఉంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల ప్రాధాన్యత ప్రస్తుతం 13% వద్ద ఉంది.

"ఆధునిక భారతీయ మహిళ సంప్రదాయ ఎఫ్‌డీలు, బంగారం కంటే ఇటుకలు-సిమెంటుతో నిర్మితమైన ఆస్తులకే ప్రాధాన్యతనిస్తోంది. మహిళలు కేవలం భవిష్యత్తు కోసం పొదుపు చేయడం మాత్రమే కాదు, ఆ భవిష్యత్తును కాంక్రీట్ రూపంలో నిర్మిస్తున్నారు. ఓవరాల్​గా చూసుకుంటే 66శాతం మంది మహిళలకు రియల్​ ఎస్టేట్​ ఇప్పుడు అతిపెద్ద పెట్టుబడి మార్గంగా కనిపిస్తోంది, " అని అన్‌రాక్ గ్రూప్ వైస్ ఛైర్మన్ సంతోష్ కుమార్ వ్యాఖ్యానించారు.

పెద్ద ఇళ్లకే మొగ్గు..

విశాలమైన ఇళ్లకు మహిళా కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉంది.

54% కంటే ఎక్కువ మంది మహిళలు 3బీహెచ్​కే ఇళ్లను ఇష్టపడుతుండగా, 14% మంది 4బీహెచ్​కే లేదా అంతకంటే పెద్ద ఇళ్లను కోరుకుంటున్నారు.

1బీహెచ్​కే ఇళ్లపై ఆసక్తి 2022లో 8% ఉండగా, అది ఇప్పుడు 4 శాతానికి పడిపోయింది.

సుమారు 9,800 మందిపై నిర్వహించిన ఈ సర్వేలో (అందులో 50% మంది మహిళలు) మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. కొత్తగా లాంచ్ అవుతున్న ప్రాజెక్టుల పట్ల మహిళల్లో నమ్మకం పెరిగింది. 2019లో కేవలం 9% మంది మాత్రమే కొత్త ప్రాజెక్టులను ఎంచుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 20 శాతానికి పెరిగింది. అదే సమయంలో, 'రెడీ-టు-మూవ్-ఇన్' ఇళ్ల ప్రాధాన్యత 33% నుంచి 32 శాతానికి స్వల్పంగా తగ్గింది. ప్రముఖ, లిస్టెడ్ బిల్డర్లు కొత్త ప్రాజెక్టులను చేపడుతుండటమే మహిళల్లో ఈ నమ్మకానికి ప్రధాన కారణం.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More