Women's Day 2026 : స్కాలర్షిప్లు, ఉచిత ఎంబీఏ కోర్సులు- మహిళలకు సువర్ణావకాశం!
Scholarships for Women in India : అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా భారతీయ మహిళల కోసం బ్రిటిష్ కౌన్సిల్, యూపీఈఎస్, భారత ప్రభుత్వం భారీ స్కాలర్షిప్లు, ఉచిత విద్యా ప్రోగ్రామ్లను ప్రకటించాయి.
సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను స్మరించుకుంటూ ప్రతి ఏటా మార్చి 8న 'అంతర్జాతీయ మహిళా దినోత్సవం' జరుపుకుంటాము. ఈ ఏడాది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని విద్య, పరిశోధన రంగాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు పలు ప్రతిష్టాత్మక సంస్థలు భారీ ఆర్థిక ఊతమిచ్చే పథకాలను ప్రకటించాయి. బ్రిటన్లో ఉచిత ఉన్నత చదువుల నుంచి, స్వదేశంలో ఉచిత ఎంబీఏ వరకు ఎన్నో అవకాశాలు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల విద్యార్థినులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆ వివరాలను ఇక్కడ చూసేయండి..

బ్రిటిష్ కౌన్సిల్ స్టెమ్ స్కాలర్షిప్లు: బ్రిటన్లో చదువు ఇక ఉచితం!
సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ (స్టెమ్) రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు బ్రిటిష్ కౌన్సిల్ 2026-27 విద్యా సంవత్సరానికి గానూ పూర్తిస్థాయి స్కాలర్షిప్లను ప్రకటించింది.
ప్రయోజనం: ఎంపికైన అభ్యర్థులకు సుమారు రూ. 36.16 లక్షల (40,000 పౌండ్లు) విలువైన ఆర్థిక సాయం అందుతుంది.
ఏం కవర్ అవుతాయి? : కోర్సు ఫీజు, నివాస ఖర్చులు, ప్రయాణ, వీసా ఖర్చులు, ఆరోగ్య బీమాతో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సపోర్ట్ కూడా ఇందులో భాగంగా ఉంటుంది.
ప్రముఖ యూనివర్సిటీలు: ఎడిన్బర్గ్, గ్లాస్గో, మాంచెస్టర్, క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ వంటి టాప్ విద్యా సంస్థల్లో చదువుకునే అవకాశం దక్కుతుంది.
ఆసక్తి గల అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు, కానీ ప్రతి దానికి విడివిడిగా అప్లై చేయాల్సి ఉంటుంది.
యూపీఈఎస్ '1,000 డ్రీమ్స్' పథకం: 1000 మందికి ఉచిత ఎంబీఏ..
డెహ్రాడూన్లోని యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్ (యూపీఈఎస్) మహిళా దినోత్సవం సందర్భంగా '1,000 ఉమెన్ - 1,000 డ్రీమ్స్' పేరుతో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 1,000 మంది అర్హతగల మహిళలకు తమ ఆన్లైన్ ఎంబీఏ కోర్సులో పూర్తి ఫీజు మినహాయింపు ఇస్తోంది.
ఈ స్కాలర్షిప్ల వర్గీకరణ ఇలా ఉంది:
సాయుధ దళాల నేపథ్యం: ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న మహిళలు లేదా రిటైర్డ్ సిబ్బంది భార్యలు, కుమార్తెల కోసం 300 సీట్లు కేటాయించారు.
టెక్ అండ్ స్టార్టప్స్: టెక్నాలజీ కంపెనీల్లో పనిచేస్తున్న లేదా సొంతంగా స్టార్టప్స్ నడుపుతున్న మహిళల కోసం 250 సీట్లు ఉన్నాయి.
ఓపెన్ కేటగిరీ: మిగిలిన 450 సీట్లు అర్హత గల దేశంలోని ఏ మహిళకైనా దక్కవచ్చు.
"ఆర్థిక ఇబ్బందులు మహిళల నాయకత్వ లక్షణాలకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాము," అని యూపీఈఎస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ సునీల్ రాయ్ పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ స్కాలర్షిప్లు, ఫెలోషిప్లు..
కేవలం ప్రైవేట్ సంస్థలే కాకుండా, భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ), యూజీసీ, ఏఐసీటీఈ ద్వారా కూడా అనేక పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇండియా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ (ఐఎస్టీఐ) పోర్టల్ ద్వారా వీటిని పొందవచ్చు.
ప్రధాన పథకాలు ఇవే:
ఇన్స్పైర్ (INSPIRE - SHE): డిగ్రీ, పీజీ చదివే విద్యార్థినుల కోసం.
ప్రగతి (PRAGATI): టెక్నికల్ ఎడ్యుకేషన్ చదివే అమ్మాయిల కోసం.
ఇందిరా గాంధీ స్కాలర్షిప్: కుటుంబంలో ఏకైక ఆడపిల్ల ఉన్న వారికి పీజీ చదువు కోసం ఆర్థిక సాయం.
ఉమెన్ సైంటిస్ట్ స్కీమ్ (WOS-A, B, C): పరిశోధనా రంగంలో స్థిరపడాలనుకునే మహిళా శాస్త్రవేత్తల కోసం.
వైజ్ స్కోప్ (WISE SCOPE): పీహెచ్డీ, పోస్ట్-డాక్టోరల్ స్థాయి పరిశోధనల కోసం.
ఈ పథకాలన్నీ మహిళలకు కేవలం ఆర్థిక తోడ్పాటును అందించడమే కాకుండా, పురుషాధిక్యత ఎక్కువగా ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ వంటి రంగాల్లో ఆడవారు రాణించేలా ప్రోత్సహిస్తున్నాయి. ఉన్నత చదువులు చదవాలనే ఆశయం ఉన్న ప్రతి మహిళా ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన సమయం ఇది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


