Dhanurmasam: ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు తేదీలతో పాటు ఈ నెలలో తప్పక పాటించాల్సినవి ఏవో తెలుసుకోండి!
Dhanurmasam: సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం.
ధనుర్మాసం చాలా విశిష్టమైనది. సంక్రాంతి రావడానికి ఒక నెల ముందు ధనుర్మాసం మొదలవుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది? ధనుర్మాసం తేదీలతో పాటుగా ఆ సమయంలో ఏం చేస్తే మంచిదో తెలుసుకుందాం.

ధనుర్మాసం 2025 ప్రారంభం, ముగింపు వివరాలు:
ధనుర్మాసం ఈసారి డిసెంబర్ 16, మంగళవారం నుంచి మొదలవుతుంది. 2026 జనవరి 14, అంటే భోగి రోజుతో ధనుర్మాసం పూర్తవుతుంది. మకర సంక్రమణం జనవరి 14 రాత్రి 9:11కు ప్రారంభమవుతుంది. జనవరి 15 సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది.
ధనుర్మాసంలో తప్పక పాటించాల్సినవి:
- ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం రెండు సార్లు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేయాలి. మహాలక్ష్మి కటాక్షం కలగాలంటే తప్పకుండా దీనిని పాటించాలి.
- అలాగే ధనుర్మాసంలో విష్ణువుని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. విష్ణు పూజకు ఈ నెల ఎంతో విశిష్టమైనది.
- తిరుమలలో ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు.
- విష్ణువు ఆలయాల్లో ఉదయాన్నే అర్చనలు చేసి నివేదనలు సమర్పిస్తారు. వాటిని పిల్లలకు పంచిపెడుతూ ఉంటారు. దీనినే బాలభోగం అని అంటారు.
- ధనుర్మాసంలో స్నానం, దానం, వ్రతం, హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది.
లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది
ఈ నెల రోజులు దరిద్రాన్ని తొలగించుకోవాలంటే ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపారాధన చేయాలి. అలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి. తప్పకుండా గురువారం, శుక్రవారం మహావిష్ణువుని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది. ధనుర్మాసం నెలరోజులు ప్రతి ఒక్కరూ ఇంటిముందు తెల్లవారుజామునే ముగ్గులు వేస్తారు. గొబ్బెమ్మలు, గుమ్మడి పువ్వులతో అలంకరిస్తారు. మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు.
గోదాదేవి కళ్యాణం:
గోదా కళ్యాణం అనేది వైష్ణవ దేవాలయాల్లో ధనుర్మాసంలో నిర్వహించబడుతుంది. ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి, రంగనాథ స్వామి వారి వివాహాన్ని జరుపుతారు. విష్ణు ఆజ్ఞ మేరకు లక్ష్మీదేవి భూలోకంలో గోదాదేవిగా అవతరించారని అంటారు. ధనుర్మాస వ్రతాన్ని ఆచరించినట్లయితే గోదాదేవి, కృష్ణుడు లేదా రంగనాథ స్వామిని పూజించాలి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.













