Nelaganta Muggulu: ఈ సంవత్సరం నెలగంట ముగ్గులు ఎప్పటి నుంచి పెట్టుకోవాలి? ఈ నెలలో ఆచరించాల్సినవి కూడా చూడండి!

Nelaganta Muggulu: ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. భోగితో ధనుర్మాసం పూర్తవుతుంది. తర్వాత సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది.

Published on: Dec 05, 2025 3:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Nelaganta Muggulu: ఇంటి గుమ్మం అందమైన రంగవల్లికలతో ముస్తాబైతే, పసిపిల్ల నవ్వులా అందంగా ఉంటుంది. పండుగ శోభ కళ్లకు కనపడుతుంది... “సంక్రాంతికి సిద్ధం అవ్వండి” అని పలుకుతున్నట్లు ఆ ముత్యాల ముగ్గు మధురంగా చెబుతున్నట్లు ఉంటుంది... తెలుగు ప్రజలకు ధనుర్మాసం అంటే ఎంతో ప్రీతి.

నెలగంట ముగ్గులు ఎప్పటి నుంచి వేసుకోవాలి? (pinterest)
నెలగంట ముగ్గులు ఎప్పటి నుంచి వేసుకోవాలి? (pinterest)

సంక్రాంతి నెల మొదలై ఇళ్లన్నీ కూడా ధన ధాన్యాలతో, రాసులతో ఉంటాయి. సూర్యుడు ధనుస్సు రాశిలోకి రాగానే ఆలయంలో మోగించే గంటానాదాన్ని “నెలగంట” అని పిలుస్తారు. ఈ ఏడాది ధనుర్మాసం (Dhanurmasam) ఎప్పటి నుంచి మొదలవుతుంది? ఎప్పటి నుంచి నెలగంట ముగ్గులు వేసుకోవాలి? అనే విషయాన్ని తెలుసుకుందాం.

ధనుర్మాసం, నెలగంట

సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించే నెలనే ధనుర్మాసం అని పిలుస్తారు. మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం ముగుస్తుంది. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి ధనుర్మాసం మొదలవుతుంది. జనవరి 14, అంటే భోగితో ధనుర్మాసం పూర్తవుతుంది. ఆ తర్వాత సంక్రాంతి నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. ఆ రోజు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవుతుంది.

ఈ నెలలో వచ్చే శుద్ధ ఏకాదశిని “ముక్కోటి ఏకాదశి” అని అంటారు. ధనుర్మాసంలో విష్ణువు ఆలయాల్లో నెలరోజులు తిరుప్పావై పాశురాలను పఠిస్తారు. అలాగే ఈ నెలలోనే విష్ణుమూర్తిని మధుసూదనుడుగా ఆరాధిస్తారు. 15 రోజులు చక్కెర పొంగలిని నైవేద్యంగా పెట్టి, ఆ తర్వాత 15 రోజులు దద్ధోజనాన్ని నైవేద్యంగా పెడతారు.

నెలగంట ముగ్గులు (pinterest)
నెలగంట ముగ్గులు (pinterest)

నెలగంట ముగ్గులు ఎప్పటి నుంచి పెట్టుకోవాలి?

సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పుడు ఈ ధనుర్మాసం మొదలవుతుంది. ధనుర్మాసం డిసెంబర్ 16 నుంచి మొదలవుతుంది. కాబట్టి ఆ రోజు నుంచి గుమ్మంలో నెలగంట ముగ్గులు పెట్టుకోవచ్చు. ఈ నెలగంటనే ధనుర్మాసం అని అంటారు. ప్రతి ఏటా మార్గశిర మాసంలో వస్తుంది.

ధనుర్మాసంలో సింహాద్రి అప్పన్నకు తెల్లవారుజామున సుప్రభాతం ఆరాధన సేవ చేస్తారు. తర్వాత గంట మోగిస్తారు. దీనిని “నెలగంట పెట్టడం” అని అంటారు. ఈ నెలంతా శుభకార్యాలను నిర్వహించకూడదు. కేవలం భగవంతుని ఆరాధనకు మాత్రమే ఇది అనుకూలమైన సమయం.

నెలగంట ముగ్గులు (pinterest)
నెలగంట ముగ్గులు (pinterest)

నెలగంట సమయంలో ఏం చెయ్యాలి?

పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటివి చేయకూడదు. అలాగే ఈ నెల రోజులు విష్ణువుని మాత్రమే ఆరాధించాలని అంటారు. నెలగంట సమయంలో పంచామృతాలతో విష్ణుమూర్తిని ఆరాధించాలి. అభిషేకానికి శంఖాన్ని ఉపయోగించాలి. విష్ణుకి తులసి దళాలు సమర్పించాలి. పువ్వులతో అష్టోత్తర, సహస్రనామాలతో ఆరాధించాలి. దీప, ధూప, నైవేద్యాలను సమర్పించాలి. విష్ణువు కథలను వినడం, తిరుప్పావై పఠించడం చాలా మంచిది. నెలరోజులు చేయడం వీలు కాని వారు కనీసం 15 రోజులు, 8 రోజులు లేదా ఒక్క రోజైనా ఆచరించవచ్చు.

నెలగంట ముగ్గులు (pinterest)
నెలగంట ముగ్గులు (pinterest)

ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి

ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, మంగళవారం నాడు వచ్చింది. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. విష్ణు పురాణం ప్రకారం ఆ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధించి ఉపవాసం ఉంటే సిరిసంపదలు కలుగుతాయట. మహావిష్ణువు గరుడవాహనుడై మూడు కోట్ల మంది దేవతలతో భూలోకానికి వచ్చి తమ భక్తులకు ఆ రోజున దర్శనమిస్తాడు. ఆ రోజున దామోదర సహిత తులసీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. నిష్టగా ఏకాదశిని ఆచరించే వారికి జ్ఞానం కూడా కలుగుతుంది. కుదిరితే భక్తిశ్రద్ధలతో వైష్ణవ ఆలయాలను దర్శించుకుంటే మంచిది.