పెళ్లిళ్లలో రూ.116, రూ.1116 ఎందుకు చదివిస్తారు? అసలు కారణం ఇదే!
పెళ్లిళ్లు, పండుగల్లో రూ.100 రూ.116 లేదా రూ.1116 చదువుల రూపంలో ఎందుకు ఇస్తారో తెలుసా? ఈ సంప్రదాయం వెనుక ఉన్న అసలు కారణాలు, జ్యోతిష్య రహస్యాలు ఇక్కడ తెలుసుకోండి.
మనం మనకి తెలిసిన వాళ్ల పెళ్లిళ్లకు, పుట్టిన రోజులకు లేదా ఏదైనా శుభకార్యానికి వెళ్తే వాళ్లకు డబ్బులు చదివిస్తూ ఉంటాము. ఇది ఒక ఆనవాయితీ. అయితే ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులను ఇచ్చేటప్పుడు రూ.100, రూ.1000 లేదా రూ.10,000 రూపాయలు ఇలా సున్నాతో వచ్చే అంకెలను కాకుండా, అదనంగా మరో 16 రూపాయలు వేసి రూ.116 లేదా రూ.1116 ఇలా ఇస్తూ ఉంటారు.

అయితే ఎందుకు అలా 16 రూపాయలు వేసి ఇస్తారు? రూ.100 ఇవ్వకుండా ఇంకో 16 రూపాయలు వేసి రూ.116 ఎందుకు చదివిస్తారు? దాని వెనుక కారణమేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వినూత్న సంప్రదాయం వెనుక కేవలం లెక్కలే కాదు, ఎంతో లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యాలు ఉన్నాయి. మరి ఇక వాటి గురించి పూర్తిగా చూసేద్దాం.
శుభకార్యాల్లో ఎందుకు రూపాయలకు 16 రూపాయలు కలిపి చదివిస్తారు?
మన హిందూ పురాణాల ప్రకారం 16 సంఖ్యకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని షోడశ అని అంటారు. ఇది సంపూర్ణత్వానికి ప్రతీక అని చెప్పొచ్చు. శ్రీకృష్ణుడు సకల గుణసంపన్నుడు. షోడశ కళలు, అంటే 16 కళలతో విరాజిల్లాడని పురాణాలు తెలుపుతున్నాయి. మనం ఎవరికైనా డబ్బులను చదివించేటప్పుడు 16 సంఖ్యను కలపడం వలన వారి జీవితం కూడా అన్ని రకాలుగా సంపూర్ణంగా మారుతుందని నమ్ముతారు. అందుకే అలా ఇస్తారు.
మనిషి జీవితంలో పుట్టుక నుంచి మరణించే దాకా 16 రకాల సంస్కారాలు ఉంటాయి. అంతేకాదు, పెళ్లికూతురును కూడా 16 రకాల అలంకారాలతో అందంగా అలంకరిస్తారు. ఈ సంఖ్యతో కూడిన కానుకలు ఇస్తే నూతన దంపతులకు ఐశ్వర్యం లభిస్తుందని కూడా నమ్ముతారు.
సున్నాకు బ్రేక్ చేయాలని
ఆర్థికపరంగా చూస్తే రూ.100, రూ.1000 లాంటి సంఖ్యల చివర సున్నా ఉంటుంది. సున్నా ఒక ముగింపు లేదా నిలిచిపోవడానికి సంకేతంగా భావిస్తారు. వారి అదృష్టం అక్కడితో ఆగిపోకూడదని కనీసం ఒక రూపాయి అయినా ఎక్కువ వేస్తారు. మరి కొంత మంది 16 రూపాయలను కలుపుతారు. దీని వలన సంపద, సంతోషం ఎప్పుడూ పెరుగుతూనే ఉంటాయని, సున్నాకు బ్రేక్ పడుతుందని నమ్మకం. ఆర్థిక పురోగతికి ఎలాంటి బ్రేకులు పడకుండా ఉండాలని కోరుకుంటూ ఇలా డబ్బులను చదివిస్తారు.
విభజించ లేరు
రూ.116 లేదా రూ.1116 లాంటి సంఖ్యలను సమాన భాగాలుగా విభజించడం సులభం కాదు. బేసి సంఖ్యలు విడదీయరాని బంధానికి గుర్తు అని నమ్మకం. కానుకలను ఇచ్చేటప్పుడు వారితో మనకున్న బంధం అలాగే బలంగా ఉండాలని, వాళ్ల ఆనందం కూడా ముక్కలు అవ్వకూడదని కోరుకుంటూ ఇలా డబ్బును చదివిస్తాము. ఈసారి ఎవరికైనా డబ్బులను చదివించేటప్పుడు ఈ విషయాలను తప్పక గుర్తుంచుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


