Simhachalam Chandanotsavam: సింహాద్రి అప్పన్న 'చందనోత్సవం'.. ఏడాదికి ఒక్కరోజే నిజరూప దర్శనం: ఆ రహస్యం మీకు తెలుసా?

Simhachalam Chandanotsavam: సింహగిరిపై కొలువైన వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఏడాది పొడవునా 120 కిలోల గంధపు లేపనంతో కప్పి ఉంచుతారు. కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే జరిగే 'నిజరూప దర్శనం' వెనుక ఉన్న విశిష్టతను మరియు పురాణ నేపథ్యాన్ని తెలుసుకోండి.

Published on: Apr 16, 2026 2:00 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Simhachalam Chandanotsavam: విశాఖపట్నం అనగానే ముందుగా గుర్తొచ్చే ఆధ్యాత్మిక క్షేత్రం సింహాచలం. ఇక్కడ కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం దేశంలోని అత్యంత పురాతన, విశిష్టమైన ఆలయాల్లో ఒకటి. మన రాష్ట్రంలోని భక్తులే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు "సింహాద్రి అప్పన్న"ను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. అయితే, ఈ ఆలయంలో జరిగే 'చందనోత్సవం' అత్యంత అరుదైనది. ఏడాది పొడవునా గంధపు లేపనంలో దాగి ఉండే స్వామి వారు, కేవలం ఒక్క రోజు మాత్రమే తన నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తారు.

Simhachalam Chandanotsavam: సింహాద్రి అప్పన్న 'చందనోత్సవం' (pinterest)
Simhachalam Chandanotsavam: సింహాద్రి అప్పన్న 'చందనోత్సవం' (pinterest)

పురాణ నేపథ్యం: భక్త ప్రహ్లాదుడి ప్రార్థన

సింహాచల క్షేత్ర (Simhachalam Chandanotsavam) ఆవిర్భావం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. హిరణ్యాక్షుడు భూమిని చుట్టి సముద్ర గర్భంలో దాచినప్పుడు, మహావిష్ణువు వరాహ అవతారమెత్తి అతడిని సంహరించాడు. ఆ తర్వాత తన సోదరుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని హిరణ్యకశిపుడు భావించి, విష్ణు భక్తులను హింసించడం ప్రారంభించాడు. కానీ, తన సొంత కుమారుడైన ప్రహ్లాదుడే పరమ విష్ణు భక్తుడిగా మారడాన్ని అతడు సహించలేకపోయాడు.

ప్రహ్లాదుడిని హరినామ స్మరణ నుంచి మళ్లించడానికి హిరణ్యకశిపుడు ఎన్నో రకాల కష్టాలకు గురి చేశాడు. చివరకు ప్రహ్లాదుడిని సముద్రంలో పడేయాలని తన భటులను ఆదేశించాడు. ఆ సమయంలో శ్రీహరి ప్రహ్లాదుడిని కాపాడి, నృసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని సంహరించాడు. తనను కాపాడిన స్వామివారిని వరాహ, నరసింహ రూపాలు కలిసిన ఏక అవతారంలో దర్శనమివ్వాలని ప్రహ్లాదుడు ప్రార్థించాడు. భక్తుడి కోరిక మేరకు స్వామివారు సింహాద్రిపై వరాహ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిశారు. ప్రహ్లాదుడే ఈ క్షేత్రంలో స్వామివారికి తొలి ఆలయాన్ని నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి.

నిప్పుల కొలిమిని తలపించే ఉగ్రరూపం.. చందనంతో శాంతి

హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత స్వామివారిలో ఆవేశం తగ్గలేదు. ఆ ఉగ్రరూపం నుంచి వెలువడే వేడికి ముక్కోటి దేవతలు, మునులు భయపడిపోయారు. స్వామివారి ఉగ్రజ్వాలలను శాంతింపజేయడానికి వారు చందనాన్ని (గంధం) లేపనంగా అద్దారు. "చందన లేపనం వల్ల మాత్రమే ఆ ఉగ్రరూపం శాంతిస్తుంది," అని వేద పండితులు పేర్కొంటున్నారు. నాటి నుంచి నేటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది. ఏడాది పొడవునా స్వామివారు నాలుగు అంగుళాల మందపాటి చందన కవచంతోనే భక్తులకు దర్శనమిస్తారు.

అక్షయ తృతీయ వేళ.. నిజరూప దర్శనం

వైశాఖ శుద్ధ తదియ అంటే అక్షయ తృతీయ (Akshaya Tritiya 2026) రోజున సింహాచలంలో చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ రోజే స్వామివారి నిజరూప దర్శనం కలుగుతుంది. తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు మొదలవుతాయి. సుప్రభాత సేవ అనంతరం, అర్చకులు ప్రత్యేక పరికరాలతో స్వామివారిపై ఉన్న చందన కవచాన్ని తొలగిస్తారు.

గంధం లేని స్వామివారి నిజరూపాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవని భక్తులు విశ్వసిస్తారు. పన్నీరు, వివిధ సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి మళ్లీ కొత్తగా చందన లేపనాన్ని సమర్పిస్తారు. ఏడాదికి మొత్తం నాలుగు విడతల్లో (వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణిమలు) కలిపి సుమారు 120 కిలోల గంధాన్ని స్వామివారికి పూస్తారు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More