సూర్యగ్రహణం 2026 : రేపు అరుదైన ఖగోళ వింతలు - సమయం..? గ్రహణ ప్రభావం ఎక్కడ..?

ఆగస్టు 12, 13 తేదీల్లో అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం, ఉల్కాపాతం సంభవించనున్నాయి. గ్రహణం వేళలు, భారత్‌లో కనిపిస్తుందో లేదో తెలిపే వివరాలు ఇక్కడ చూడండి.

Published on: Aug 11, 2026, 11:26:03 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link
అరుదైన ఖగోళ వింతలు
అరుదైన ఖగోళ వింతలు

ఖగోళ శాస్త్రవేత్తలు, ఆకాశ వీక్షకులకు ఆగస్టు 12 అత్యంత కీలకమైన రోజుగా నిలవనుంది. పగలు, రాత్రి సమయాల్లో ఆకాశంలో సాధారణంగా కనిపించని అరుదైన, అద్భుతమైన దృశ్యాలు ఈ రోజున ఆవిష్కృతం కానున్నాయి. ఖగోళంలో ఒకేసారి ఆరు గ్రహాలు—బుధుడు, అంగారకుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్—ఒకే వరుసలో క్యూ కట్టినట్లు దర్శనమివ్వడం ఈ రోజు ప్రత్యేకత. అదే సమయంలో ఆకాశంలో ఉల్కాపాతం (రాలే నక్షత్రాలు) గరిష్ఠ స్థాయికి చేరనుంది. సూర్యగ్రహణం కారణంగా ఆకాశం చీకటిమయంగా మారడంతో ఈ ఉల్కాపాతాన్ని కళ్లతో స్పష్టంగా వీక్షించే అరుదైన అవకాశం లభిస్తుంది.

హరియాళీ అమావాస్య రోజున సంభవించే ఈ సంపూర్ణ సూర్యగ్రహణం కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రంలో ఏర్పడనుంది. 1999 సంవత్సరం తర్వాత స్పెయిన్ ప్రధాన భూభాగంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి కావడం విశేషం. సూర్యాస్తమయానికి సరిగ్గా ముందు ఉత్తర స్పెయిన్ పరిధిలో సూర్యుడు ఈ ప్రత్యేక రూపంలో దర్శనమిస్తాడు. దీంతో ఈ గ్రహణం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, భారత్‌లో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనే అంశాలపై ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.

ఈ సూర్యగ్రహణ ఘట్టం ఆగస్టు 12, 13 తేదీల మధ్యరాత్రి వేళ సంభవిస్తుంది. భారతీయ కాలమానం ప్రకారం ఆగస్టు 13న రాత్రి 09:04 గంటలకు గ్రహణం ప్రారంభమై…. అర్ధరాత్రి దాటిన తర్వాత 01:27 గంటలకు ముగుస్తుంది. ఆగస్టు 12 రాత్రి గడిచాక, అంటే ఆగస్టు 13న వేకువజామున 11:16 గంటల సమయానికి గ్రహణం గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది.

మన దేశంలో కనిపిస్తుందా….?

ఈ సూర్యగ్రహణం ప్రారంభమయ్యే సమయానికి భారతదేశంలో రాత్రి వేళ కావడం, సూర్యుడు క్షితిజ సమాంతర రేఖకు దిగువన ఉండటం వల్ల ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు. భారత్‌లో గ్రహణం గోచరించకపోవడం వల్ల ఇక్కడ సూతక కాలం నిబంధనలు వర్తించవని పండితులు స్పష్టం చేశారు. సాధారణంగా సూర్యగ్రహణం ప్రారంభం కావడానికి 12 గంటల ముందే సూతక కాలం మొదలవుతుంది. ఈ సమయంలో పూజలు, శుభకార్యాలు నిలిపివేయడంతో పాటు దేవాలయాల ద్వారాలను మూసివేస్తుంటారు. అయితే ఈ గ్రహణానికి అలాంటి నియమాలు వర్తించవు.

గ్రహణ ప్రభావం ఎక్కడ?

ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ప్రధానంగా ఐస్‌లాండ్, గ్రీన్‌లాండ్, స్పెయిన్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యుడిని 95 నుంచి 100 శాతం వరకు పూర్తిగా కప్పివేస్తాడు. దాంతో పగటిపూట కూడా గాఢాంధకారం అలుముకుని, రాత్రిని తలపిస్తుంది. ఈ సమయంలో ఆయా ప్రాంతాల్లో పక్షులు ప్రశాంతంగా తమ గూళ్లకు చేరుకుంటాయి, స్వల్పంగా ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతాయి. గ్రహణం వీడుతున్న కొద్దీ ఆకాశం నిర్మలంగా మారి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకుంటాయి.

ఈ గ్రహణం రోజున రాత్రి వేళ ఆకాశంలో పడే నక్షత్రాల (ఉల్కల) అద్భుత దృశ్యాన్ని నేరుగా చూడవచ్చు. ఈ దృశ్యాలను మరింత స్పష్టంగా తిలకించాలనుకునేవారు కాంతి వెలుగులు తక్కువగా ఉండి, ఆకాశం నిర్మలంగా ఉన్న ప్రదేశాలను ఎంచుకోవాలి. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌ల సహాయంతో ఈ అరుదైన ఖగోళ వింతలను స్పష్టంగా వీక్షించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More