సంధ్యా సమయం ఎందుకు పవిత్రం? సాయంత్రం ఏడవొద్దని చెప్పే సంప్రదాయం వెనుక రహస్యం!
హిందూ సంప్రదాయం ప్రకారం సాయంత్రం సంధ్యా సమయం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో ఏడవడం, గొడవలు పడడం, ప్రతికూల భావోద్వేగాలకు లోనవడం మంచిది కాదని పెద్దలు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని విశ్వాసం.
సాయంత్రం పూట మనం ఏదైనా తప్పు చేస్తే, పెద్దవారు "అలా చేయకూడదు, ఇలా చేయకూడదు" అని చెబుతూ ఉంటారు. చాలామంది సాయంత్రం పూట ఏడవకూడదని, దరిద్రం పట్టుకుంటుందని కూడా అంటుంటారు. మీ ఇంట్లో కూడా ఇలా చెబుతున్నారా? అయితే, ఎందుకు సాయంత్రం పూట ఏడవకూడదు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం.

సాయంత్రం పూట ఏడవకూడదని, దాని వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని పెద్దలు తరచూ చెబుతుంటారు. కాలం మారుతున్నా, చాలా కుటుంబాల్లో ఇంకా ఈ నియమాన్ని పాటిస్తున్నారు. ఈ మాట వెనుక కేవలం ఆచారం మాత్రమే ఉందా? లేకపోతే ఆధ్యాత్మిక, జ్యోతిష్య రహస్యం ఉందా? సాయంత్రం పూట అసలు ఎందుకు ఏడవకూడదు? వివరంగా చూసేద్దాం.
ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది
హిందూ సంప్రదాయంలో సాయంత్రం పూటను సంధ్యా సమయం అని అంటారు. ఇది చాలా పవిత్రమైన సమయంగా భావిస్తారు. సాయంత్రం పూట లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ భక్తుల ఇళ్లకు వస్తుందని విశ్వాసం. ఏ ఇళ్లల్లోనైతే సాయంత్రం ఏడుపులు, అరుపులు, గొడవలు, బద్దకం ఉంటాయో, అక్కడ ప్రతికూల శక్తి ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతారు. దీంతో లక్ష్మీదేవి ఆ ఇంట్లోకి ప్రవేశించదని, ఆ కుటుంబంలో సుఖసంతోషాలు ఉండవని, ఐశ్వర్యం లోపిస్తుందని చెబుతారు.
గ్రహస్థితులపై ప్రభావం
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, సాయంత్రం పూట విపరీతమైన బాధతో ఏడవడం లేదా మానసిక ఒత్తిడికి గురవడం మంచిది కాదు. ఇలా చేస్తే జాతకంలో శుక్ర, చంద్ర గ్రహాల స్థానాలు బలహీనపడే అవకాశాలు ఉంటాయని చెబుతారు. చంద్రుడు మనసుకు, భావోద్వేగాలకు కారకుడు. అలాగే మానసిక ప్రశాంతతను కూడా అందిస్తాడు. శుక్రుడు భోగభాగ్యాలకు, వైభవానికి చిహ్నంగా భావిస్తారు. సాయంత్రం పూట ప్రతికూల భావోద్వేగాలతో సమయాన్ని గడిపితే మనసు అశాంతికి గురవుతుంది. దాని వల్ల సానుకూల దృక్పథం దెబ్బతింటుంది.
సాయంత్రం పూట ఏం చేస్తే మంచిది?
సాయంత్రం పూట లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే కచ్చితంగా వీటిని పాటించండి. దీని వల్ల ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కూడా ఉంటుంది.
ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించండి. దీని వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని విశ్వాసం.
ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి భక్తి పాటలు వినడం మంచిది.
చేతులు, కాళ్లు కడుక్కుని దైవ ప్రార్థన లేదా ధ్యానంతో కాసేపు సమయాన్ని గడపండి.
కుటుంబ సభ్యులతో గొడవలు పడకుండా, సంతోషంగా సమయాన్ని గడపండి.
అనవసరంగా ఏడవడం, కోపపడడం, ఎక్కువ సేపు నిద్రపోవడం వంటి పనులను సంధ్యా సమయంలో చేయకూడదు.
దీపం వెలిగించిన తర్వాత ఈ శ్లోకాన్ని చదవండి:
దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే..
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


