అమ్మవారు సింహంపైనే ఎందుకు కూర్చుంటారు? దుర్గాదేవి వాహనం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక కథ ఇదే!
హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవి సింహంపై విహరించడం శక్తి, ధైర్యం, విజయానికి ప్రతీకగా భావిస్తారు. శివుడు సరదాగా చేసిన వ్యాఖ్యతో పార్వతీదేవి కఠిన తపస్సు చేయగా, ఆమెను వేటాడాలని వచ్చిన ఒక సింహం ఏళ్ల తరబడి ఓర్పుతో వేచి చూసిందని కథనం చెబుతుంది.
హిందూ పురాణాల ప్రకారం దుర్గాదేవికి సింహంతో విడదీయరాని అనుబంధం ఉంది. శివుని వ్యాఖ్యతో పార్వతీదేవి తపస్సు చేయడం, ఆమె కోసం ఓ సింహం ఏళ్ల తరబడి వేచి చూడటం వెనుక ఉన్న ఆసక్తికరమైన పౌరాణిక గాథ ఇక్కడ తెలుసుకోండి.

మన హిందూ శాస్త్రాలు, పురాణాల ప్రకారం చూసినట్లయితే, దుర్గాదేవి సింహంపై విహరించే రూపంతో కనిపిస్తుంది. శక్తి, నిర్భయత్వం, విజయానికి ప్రతీకగా ఈ రూపం భావించబడుతుంది. సింహం కేవలం అమ్మవారి వాహనమే కాదు, అమ్మవారి దివ్య తేజస్సు, ధైర్యం, పరాక్రమానికి చిహ్నం కూడా. ఈ అనుబంధం వెనుక ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది.
సరదాగా శివుడు చెప్పిన మాటలతో మొదలైన కథ
పురాణాల ప్రకారం చూస్తే, ఓ రోజు శివుడు సరదాగా పార్వతీదేవిని "కాళి" అని అంటాడు. తన వర్ణాన్ని ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యతో పార్వతీదేవికి ఆవేదన కలిగింది. ఆమె అరణ్యానికి వెళ్లి కఠిన తపస్సు చేయడం మొదలు పెట్టింది. తన తపస్సు ద్వారా తెల్లగా, కాంతివంతమైన చర్మాన్ని పొందాలని సంకల్పంతో దీక్షను చేపట్టింది. ఆ సమయంలో అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఆకలితో ఉన్న సింహం సంచరిస్తోంది.
పార్వతీదేవిని వేటాడాలని అనుకున్న సింహం
తపస్సులో నిమగ్నమైన పార్వతీదేవిని చూసి ఆమెను తన ఆహారంగా చేసుకోవాలని అనుకుంది. అయితే, ఆమె ధ్యానం పూర్తయ్యాక మాత్రమే దాడి చేయాలని ఆ సింహం నిర్ణయించుకుంది. ఆ నిర్ణయంతో సింహం ఎన్నో సంవత్సరాలు ఓర్పుతో వేచి చూసింది. తెలియకుండానే సింహం తపస్సు చేసినట్లుగా సహనం, నియమాన్ని పాటించింది.
సింహం జీవితం శివ పార్వతుల అనుగ్రహంతో మారిపోయింది
పార్వతీదేవి తపస్సుకు సంతోషించిన శివుడు ఆమెకు గౌరవర్ణాన్ని ప్రసాదించాడు. ఆ తర్వాత పార్వతీదేవి అక్కడే ఏళ్లుగా ఓర్పుతో ఎదురు చూస్తున్న సింహాన్ని గమనించింది. దాని సహనం, అంకితభావం చూసి సంతోషపడి, సింహాన్ని తన వాహనంగా ఉండే వరాన్ని ప్రసాదించింది
దుర్గా దేవితో విడదీయరాని అనుబంధం
అప్పటి నుంచి కూడా సింహానికి దుర్గా దేవితో విడదీయరాని అనుబంధం ఏర్పడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ కథ ద్వారా సహనం, అంకితభావం, పట్టుదల ఉంటే చివరకు మంచి ఫలితాలు తప్పక కలుగుతాయని తెలుస్తోంది. అందుకే ఇప్పటికీ సింహాన్ని దుర్గాదేవి శక్తికి, ధైర్యానికి, గౌరవానికి ప్రతీకగా భావిస్తారు.
నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించాలని నిర్ధారించుకోండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


