వినాయకుడిని నమస్కరించిన తర్వాత మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు, దాని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
వినాయకుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయని నమ్ముతారు. వినాయకుడిని పూజించిన తర్వాత, వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మొట్టికాయలు వేసుకోవడం చూస్తుంటాము. అసలు ఎందుకు అలా చేస్తారు? దాని వెనుక ఉన్న కథ తెలుసుకుందాం.
వినాయకుడు తొలి పూజలను అందుకుంటాడు. మొట్టమొదట వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని అంటారు. అందుకనే ఏదైనా పని లేదా శుభకార్యం మొదలు పెట్టినప్పుడు ముందుగా వినాయకుడిని ఆరాధిస్తాము. వినాయకుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయని నమ్ముతారు.

వినాయకుడిని పూజించిన తర్వాత, వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మొట్టికాయలు వేసుకోవడం చూస్తుంటాము. అసలు ఎందుకు అలా చేస్తారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
వినాయకుడిని నమస్కరించిన తర్వాత మొట్టికాయలు ఎందుకు వేసుకుంటారు? కారణమేంటి?
దశకంఠుడైన రావణాసురుడు కష్టపడి భక్తితో పరమేశ్వరుడుని మెప్పించాడు. శివుని ఆత్మలింగాన్ని పొంది, లంకానగరంలో దానిని ప్రతిష్టించి తన తల్లికి ఇచ్చిన మాటను ఎలాగైనా నెరవేర్చుకోవాలని వెళ్తున్నాడు. అప్పుడు మార్గమధ్యంలో సంధ్య వార్చుకోవడానికి ఆత్మలింగాన్ని మారువేషంలో ఉన్న వినాయకుడికి ఇచ్చి వెళ్తాడు. అప్పుడు మారువేషంలో ఉన్న వినాయకుడు, “నేను నిన్ను మూడు సార్లు పిలుస్తాను. అప్పటికి నువ్వు రాకపోతే ఆత్మలింగాన్ని భూమిపై పెట్టి వెళ్లిపోతాను” అని రావణుడితో చెబుతాడు. రావణుడు సరే అని వెళ్తాడు. అదే అదునుగా భావించిన వినాయకుడు మూడుసార్లు వెంటనే రావణుడిని పిలిచి, వెంటనే ఆ ఆత్మలింగాన్ని నేలపై పెట్టేస్తాడు.
అప్పుడు రావణుడికి కోపం వచ్చి మారువేషంలో ఉన్న వినాయకుడికి మొట్టికాయలు వేస్తాడు. అందుకే వినాయకునికి భక్తులు “మేము రావణుడిలాంటి వారు కాదు తండ్రి” అని చెప్పి వినాయకుని అనుగ్రహం కోసం నమస్కరించి మొట్టికాయలు వేసుకుంటారు. అందుకే వినాయకుని అనుగ్రహం కలగాలని తలపై మొట్టికాయలు వేసుకోవాలని పెద్దలు కూడా చెబుతారు.
వినాయక పూజలో తులసిని ఎందుకు వాడరు?
వినాయకునికి పూజ చేసేటప్పుడు తులసిని కచ్చితంగా పెట్టకుండా చూసుకోవాలి. ఓ రోజు వినాయకుడు గంగా నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. అప్పుడు తులసి తన వివాహ కోరిక నెరవేరాలని తీర్థయాత్రలు చేస్తోంది. తపస్సు చేస్తున్న గణపతి అందమైన రూపానికి తులసి ఆకర్షితురాలవుతుంది. గణపతిని పెళ్లి చేసుకోవాలని కోరిక ఆమె మనసులో కలుగుతుంది.
తాను బ్రహ్మచారి అని గణపతి చెప్పి ఆమెను తిరస్కరిస్తాడు. తులసికి కోపం వచ్చి “దీర్ఘకాలం బ్రహ్మచారిగా ఉండిపో”మని శపిస్తుంది. అప్పుడు కోపానికి గురైన గణపతి “నువ్వు అసురుడిని భర్తగా పొందుతావు” అని తులసిని శపిస్తాడు. గణపతి శాపం మేరకు తులసికి శంఖచూడ అనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది.
తులసి పాతివ్రత్య మహత్యం కారణంగా ఆ రాక్షసుడిని సంహరించడం విష్ణుమూర్తికి కూడా ఎంతో కష్టమవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగేలా చేసి ఆ రాక్షసుడిని విష్ణుమూర్తి సంహరిస్తాడు. తర్వాత శ్రీహరి అనుగ్రహం మేరకు తులసి మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్యానికి భంగం కలగడానికి కారణమైన వినాయకుడిని తెలిసిన తులసి, గణపతిని “శిరస్సు లేకుండా జీవించు”మని శపిస్తుంది. తులసి సాన్నిహిత్యాన్ని సహించని గణపతి కూడా ఆమెను శపిస్తాడు. ఇలా జరగడం వలన గణపతి పూజలో తులసిని వినియోగించరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


