హైదరాబాద్‌లో 112 ఇండిగో విమానాలు రద్దు.. ఇప్పటివరకు మెుత్తం 600పైనే క్యాన్సిల్!

ఇండిగో విమానాయాన సంస్థ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ప్రయాణికులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సోమవారం కూడా హైదరాబాద్‌లో 112 విమాన సర్వీసులు రద్దు అయ్యాయి.

Published on: Dec 08, 2025 11:11 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA)లో విమానాల అంతరాయాలు సోమవారం కొనసాగాయి. 112 ఇండిగో సర్వీసులు రద్దు అయ్యాయి. రద్దులలో 58 రావాల్సినవి, 54 ఇక్కడి నుంచి వెళ్లాల్సినవరి ఉన్నాయి. చాలా రోజులుగా ఇబ్బంది పడుతున్న ప్రయాణికులపై మరింత ఒత్తిడిని ఇది పెంచుతుంది. ఇండిగో అంతరాయం ఆరో రోజుకు చేరుకోగా.. డిసెంబర్ 3 నుండి హైదరాబాద్ విమానాశ్రయంలో మొత్తం విమానాల రద్దు సంఖ్య 600 దాటింది.

ఇండిగో విమానాలు రద్దు
ఇండిగో విమానాలు రద్దు
  • డిసెంబర్ 3 - 31
  • డిసెంబర్ 4 - 74
  • డిసెంబర్ 5 - 155
  • డిసెంబర్ 6 - 144
  • డిసెంబర్ 7 - 126
  • డిసెంబర్ 8 - 112 విమానాలు క్యాన్సిల్ అయ్యాయి.

ఇండిగో డిసెంబర్ 7న తన 138 గమ్యస్థానాలలో 137 గమ్యస్థానాల కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయని పేర్కొంటూ స్టేటస్ అప్‌డేట్ జారీ చేసింది. డిసెంబర్ 6న 1,500 విమానాలతో పోలిస్తే 1,650 విమానాలను నడపడానికి సిద్ధంగా ఉన్నామని ఎయిర్‌లైన్ తెలిపింది. డిసెంబర్ 6న 30 శాతం నుండి డిసెంబర్ 7న దాని ఆన్-టైమ్ పనితీరు 75శాతానికి పెరిగిందని కూడా పేర్కొంది. డిసెంబర్ 15 వరకు బుకింగ్‌ల కోసం రద్దులు, రీషెడ్యూల్ అభ్యర్థనలపై పూర్తి మినహాయింపును కూడా ప్రకటించారు.

విశాఖపట్నం నుంచి 7 విమానాలను ఇండిగో రద్దు చేసింది. ఇందులో హైదరాబాద్, బెంగళూరు చెన్నై, ఢిల్లీకి వెళ్లాల్సిన విమానాలు ఉన్నాయి. ఎయిర్ పోర్ట్‌కు వచ్చే ముందు స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 600 కోట్లకుపైగా ప్రయాణికులకు రీపండ్ చేశామని ఇండిగో ప్రకటించింది. ఈ హామీలు ఉన్నప్పటికీ ప్రయాణికులు రద్దుల ప్రభావంతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చాలా మంది ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా తమ బాధలను బయటపెడుతున్నారు.

'మీ దారుణమైన నిర్వహణతో మా జీవితంలోని మూడు రోజులను నాశనం చేశారు. నేను గౌహతి నుండి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన విమానం రెండుసార్లు క్యాన్సిల్ అయింది. నేను ముంబైకి మరో విమానంలో ప్రయాణించాల్సి వచ్చింది, ఆపై హైదరాబాద్‌కు రైలులో వెళ్లాల్సి వచ్చింది, దీనివల్ల నేను పని రోజులు కోల్పోయాను, వయసు మీద పడిన నా తండ్రి బాధను అనుభవించాల్సి వచ్చింది.' అని పూర్ణిమ రామచంద్రన్ అనే వ్యక్తి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

'హైదరాబాద్ నుండి సూరత్ వెళ్లే విమానంలో స్పష్టత లేకపోవడంతో నేను ఆగిపోయాను. టికెట్ రద్దు, పూర్తి రీపండ్ కోసం నేను అభ్యర్థించాను, కానీ ఎటువంటి సపోర్ట్ దొరకలేదు. నా తండ్రి అనారోగ్యంతో ఉన్నారు, సకాలంలో మందులు, ఆహారం ఇవ్వాలి. ఈ ఆలస్యంతో చాలా ఇబ్బంది పడ్డాం.' అని నౌరా ఫాతిమా అన్నారు.

హైదరాబాద్ నుండి బాగ్ డోగ్రాకు వెళ్లాల్సిన తన విమానం రద్దు అయిందని సౌమి ముఖర్జి అనే వ్యక్తి చెప్పారు. ప్రత్యామ్నాయ విమానయాన సంస్థలు అందుబాటులో లేవన్నారు. ఇంటికి వెళ్ళడానికి వీలుకాక హైదరాబాద్‌లో చిక్కుకున్నట్టుగా వెల్లడించారు.